జగన్ సర్కార్ పై మళ్లీ ఆనం ఫైర్-ఏడాదిగా నిఘా-ఫోన్లూ ట్యాప్- కూతురుతోనూ వాట్సాప్ కాల్స్ !
ఏపీలో వైసీపీ సర్కార్ పై రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శల దాడి కొనసాగుతోంది. ఏడాదిగా తన ఫోన్లు ట్యాప్ చేయడం, సెక్యూరిటీ తగ్గించడం వంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడిందని ఆనం ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో మాజీమంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన నియోకవర్గంలో వైసీపీ ఇన్ ఛార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆనం తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధంగా గెలిచిన మమ్మల్ని రాజ్యాంగేతర శక్తుల ద్వారా నియంత్రించాలని చూస్తున్నారని నేదురుమల్లి నియామకాన్ని ఆనం తప్పుబట్టారు.
కేంద్ర ఇంటలిజెన్స్ నివేదికల ప్రకారం తన నియోజకవర్గం వెంకటగిరి నక్సల్ జోన్ లో ఉందని ఆనం తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో తనకు సెక్యూరిటీ తగ్గించారని ప్రభుత్వంపై ఆనం మండిపడ్డారు. సెక్యూరిటీ కావాలని కోరలేదు తీసేసినా తనకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదన్నారు. నిన్న తన కటౌట్ ను తగలబెట్టారని, ఇక వారి లక్ష్యం నేనే నేనే ఏమో అని ఆనం వ్యాఖ్యానించారు. తన ఫోన్, తన పీఏ ఫోన్ రెండూ టాపింగ్ లోనే ఉన్నాయని, తన ప్రతి కదలికలను ఏడాదిన్నరగా నిఘా పెట్టారని ఆనం ఆరోపించారు. చివరికి తన కూతురుతో మాట్లాడుకోవాలన్నా వాట్సప్ యాప్,ఫేస్ టైంలో మాట్లాడుకోవాల్సి వస్తుందన్నారు. నా ఫోన్ టాప్ చేసేదే మా వాళ్ళు.. ఇక నేను ఎవరితో చెప్పుకోవాలంటూ ఆనం ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో ప్రత్యామ్నాయం రావాలని ఆనం అభిప్రాయపడ్డారు.
వైసీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి.. తన సీనియార్టీని గుర్తించి జగన్ మంత్రి పదవి ఇవ్వలేదనే ఆక్రోశంతో ఉన్నారు. ఈ సమయంలోనే జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో ఆనంను జగన్ పట్టించుకోవడం మానేశారు. దీంతో అలిగిన ఆనం ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. దీంతో జగన్ ఆనం స్ధానంలో వెంకటగిరి ఇన్ ఛార్జ్ గా మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఆ తర్వాత నియోజవర్గంలో ఆనంకు సహాయనిరాకరణ కూడా పెరిగింది. దీనిపై ఆనం అసహనంగా కనిపిస్తున్నారు.