పెయిడ్ ఆర్టిస్ట్ అంటే మండదా: తప్పు విష్ణుదే: తేల్చేసిన రఘురామ: విశాఖ రాజధాని ఉత్తుత్తిదే
అమరావతి: ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డిపై అమరావతి ప్రాంత రైతు కొలికపూడి శ్రీనివాస రావు చెప్పుతో దాడి చేసిన ఉదంతం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 400 రోజులకు పైగా ఉద్యమంలో కొనసాగుతోన్న వారిని పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించడం సరికాదని అన్నారు. ఈ విషయంలో తప్పు విష్ణువర్ధన్ రెడ్డిదేనని తేల్చి చెప్పారు.
శ్రీవారికి బంగారు శంకుచక్రాలు: విలువెంతో తెలుసా? పండుగ రోజుల్లో సర్వాంగసుందరంగా
ఎమోషనల్ అవుట్ బరస్ట్..
ఈ దాడిపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ కొద్దిసేపటి కిందట ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కొలికపూడి శ్రీనివాస రావు అమరావతి ఉద్యమం కోసం త్యాగాలు చేశారని చెప్పారు. తన ఐఎఎస్ కోచింగ్ సెంటర్ను సైతం మూసివేసి, ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు. శ్రీనివాస రావు గురించి తెలుసుకోకుండా విష్ణువర్ధన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ అవహేళన చేశారని రఘురామ అన్నారు. ఈ ఘటనను ఇద్దరు వ్యక్తుల మధ్య చోటు చేసుకున్న ఉద్వేగభరితమైన చర్యగా భావించాల్సి ఉంటుందే తప్ప.. కులాన్ని, పార్టీలను అపాదించడం సమంజసం కాదని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పక్కోడి గురించి తెలియకుండా ఎలా..
న్యూస్ ఛానళ్లు నిర్వహించే డిబేట్లలో మాట్లాడేటప్పుడు ఎవ్వరైనా గానీ సంయమనాన్ని పాటించాల్సి ఉంటుందని రఘురామ సూచించారు. తమతో పాటు డిబేట్లో పాల్గొనే వారి గురించి తెలుసుకోకుండా కించపరిచేలా మాట్లాడటం, వారి భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. ఉద్యమంలో ఉన్న శ్రీనివాస రావు చేసిన పనిని తాను సమర్థించట్లేదని, అలాగనీ ఒక చెంప మీద కొడితే మరో చెంపను చూపించాల్సిన పనీ లేదని చెప్పారు. ఒక చెంప మీద కొడితే మరో చెంప మీద కొట్టాల్సిన అవసరం ప్రస్తుత రాజకీయాల్లో ఉందని అన్నారు. అయినప్పటికీ.. గాంధేయవాదంతో మనం.. మన అమరావతిని సాధించుకుందామని చెప్పారు.
రూ.3,000 కోట్ల అప్పు అసాధ్యం..
అమరావతి అభివృద్ధి కోసం 3,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకోవడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని, ఇంత పెద్ద మొత్తంలో అప్పు దొరుకుతుందా? అనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయని రఘురామ అన్నారు. మూడు ముక్కల రాజధానిలో ఒక ముక్కకే ఇంత పెద్ద అప్పు చేయాల్సి వచ్చిందని చెప్పారు. అప్పు దొరికితే.. ఆ మొత్తాన్ని అమరావతి కోసమే ఖర్చు పెడతారా? అనేది అనుమానమేనని అన్నారు. ఇతర పథకాల కోసం ఆ నిధులను మళ్లించబోరనే గ్యారంటీ లేదని రఘురామ వ్యాఖ్యానించారు.
విశాఖ రాజధాని ఒట్టిమాటే..
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయిస్తారనేది ఒట్టిమాటేనని రఘురామ అన్నారు. కొద్దినెలల్లో అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా మారుతుందని, అందరిలాగే తానూ ఆశిస్తున్నానని చెప్పారు. అమరావతి తరలిపోదనడానికి ఈ రుణం తీసుకోవాలనుకోవడం నిదర్శనమని చెప్పారు. ఈబీసీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించడానికి ప్రవేశపెట్టదలిచిన పథకం మంచిదేనని, ఒక నియోజకవర్గంలో 850 మంది లబ్దిదారులనే ఎంపిక చేయాలనుకోవడం హాస్యాస్పదమని అన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అనే అనుమానాలు వస్తాయని చెప్పారు. ఈబీసీలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్ను వర్తింపజేయాలని ఆయన సూచించారు.