విజయవాడ, విశాఖలో జగన్ కు హెలికాఫ్టర్లు-ఈసీకి రఘురామ ఫిర్యాదు..!
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసీని ఆశ్రయించారు. ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ కు విజయవాడ, విశాఖపట్నంలో రెండు హెలికాప్టర్లు కేటాయిస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ ఐదు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్ని సైతం హెలికాఫ్టర్లలోనే వెళ్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ ఇప్పుడు రెండు ఛాపర్ల వ్యవహారం చర్చకు దారి తీస్తోంది.
భద్రతా కారణాలతో సీఎం జగన్ కు విజయవాడతో పాటు విశాఖలోనూ హెలికాఫ్టర్లు అందుబాటులో ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ కు ఎన్నికల వేళ ప్రచారం కోసం రెండు హెలికాఫ్టర్లు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం తెలుపుతూ ఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ రెండు హెలికాఫ్టర్ల కోసం నెలకు 3.82 కోట్లు కేటాయించడం సరికాదని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో భద్రతా కారణాలు చూపి సీఎం జగన్ ఒక్కరే ప్రభుత్వ ఖర్చుతో హెలికాఫ్టర్ వాడుకుంటే అది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే అవుతుందని రఘురామ ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈసీ జోక్యం చేసుకుని ఈ ఉత్తర్వులను నిలిపేయాలని రఘురామ కోరారు. దీనిపై ఈసీ జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది త్వరలో తేలనుంది. అయితే ఎన్నికల సమయంలో రాజకీయ నేతల హెలికాఫ్టర్ల వినియోగంపై ఎలాంటి నిషేధం లేదు. అయితే ముందుగా ఈసీకి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications