ముందస్తు ఖాయమే-పవన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయితే- రఘురామ వ్యాఖ్యలు..
నవంబర్, డిసెంబర్ మాసాలలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ముందస్తు ఎన్నికల కోసం రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. తన ముఖం చూసే ప్రజలు ఓటు వేశారని, తన ఫోటో పెట్టుకుని ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ... ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
అయినా రేపో మాపో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయే వాడిని, అయినా ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు . ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బయటకు చెప్పడానికి భయపడుతున్నప్పటికీ, రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారని రఘురామ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విజయవంతమై పొత్తులపై స్పష్టత రావాలని రఘురామకృష్ణంరాజు ఆకాంక్షించారు.

రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల అభ్యర్థనతో 24 గంటల వ్యవధిలో 1100 చిల్లర ఎకరాల భూమిని జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీకి సి ఆర్ డి ఏ కమిషనర్ శ్రీలక్ష్మి కేటాయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. ఈ తరహా చెత్త ఆర్డర్లు ఇవ్వడానికి శ్రీ లక్ష్మీ ఎప్పుడూ రెడీగా ఉంటుందన్నారు.సుప్రీం కోర్టులో రాజధాని కేసు వాదించడానికి వందల కోట్లు వెచ్చించి లాయర్లను నియమించుకొని, కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకొన్నా పంతం నెగ్గించుకోలేక పోయామన్న అక్కసుతోనే రైతులను వేధించాలనే ఉద్దేశ్యంతోనే రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా ఎటువంటి నిర్ణయాలను తీసుకోరాదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

దుగ్గిరాలలో ఒక యువకుడు తన ప్లెక్సీ ని ఏర్పాటు చేస్తే, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆయన్ని స్టేషన్ కు పిలిచి చితకబాదారు. రానున్నది తమ ప్రభుత్వమేనని , తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ తన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే వారి చేతనే వాటిని తొలగించే విధంగా పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. తన ప్లెక్సీ ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఎందుకంటే తాను ఆయన కంటే ఎత్తు ఉంటానని బాధ కాబోలు అన్నారు. తన ప్లెక్సీలను రోడ్లపై ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని, తనని అభిమానించే వారి గుండెల్లోనే ఉంటానంటూ రఘురామకృష్ణం రాజు తెలిపారు.












Click it and Unblock the Notifications