వివేకా హంతకుల హత్యకు కుట్ర-సీబీఐ ఛీఫ్ కిరఘురామ లేఖ-సాయిరెడ్డి విచారణకు వినతి
ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. హత్య జరిగి మూడేళ్లయినా ఇంకా అసలు నిందితుల్ని సీబీఐ అరెస్టు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులకు ప్రాణహాని ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ సీబీఐ ఛీఫ్ కు ఓ లేఖ రాశారు.
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఇవాళ సీబీఐ ఛీఫ్ కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు కోరారు. మాజీమంత్రి పరిటాల రవీంద్ర కేసులోనిందితుల తరహాలోనే ఈ కేసులోనూ నిందితుల్ని అంతమొందించే కుట్ర జరుగుతోందని రఘురామరాజు తన లేఖలో అనుమానాలు వ్యక్తంచేశారు. జైల్లో, జైలు బయట ఉన్న నిందితులు, సాక్షులకు రక్షణ కల్పించాలని సీబీఐ ఛీఫ్ ను కోరారు.
మరోవైపు వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించాలని రఘురామ సీబీఐకి రాసిన లేఖలో కోరారు. వివేకా హత్య కేసులో పెద్దల పాత్ర వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రఘురామ వినతి ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్రెడ్డి, సోదరుడు మనోహర్ రెడ్డితో పాటు పలువురు వైఎస్ కుటుంబీకులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సీబీఐ మాత్రం ఇప్పటివరకూ వీరి పాత్రపై నోరు విప్పడం లేదు. దీంతో ఈ కేసులో ఏం జరగబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది. అటు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు కోసం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ చేసిన ఫిర్యాదుపైనా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.