తెలంగాణ రాష్ట్రంలో జగన్పార్టీ, మజ్లిస్లకు ఈసీ గుర్తింపు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలను తెలంగాణలో రాష్ట్ర పార్టీలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే ప్రతిపక్ష హోదాలో ఉంది. తెలంగాణలో ఆ పార్టీ మూడు ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది.
గుర్తింపు విషయమై పార్టీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో తమ పార్టీని రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించిందని తెలిపింది. ఇప్పటికే తమకు ఎపిలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉందని, ఇప్పుడు తాజాగా తెలంగాణలోను గుర్తింపు వచ్చిందని ప్రకటించింది. తెలంగాణలో పార్టీకి ఎన్నికల సంఘం సీలింగ్ ఫ్యాన్ గుర్తును రిజర్వ్ చేసిందని తెలిపింది.
మరోవైపు మజ్లిస్ పార్టీని కూడా తెలంగాణలో రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించింది. మజ్లిస్ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలను, ఒక పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. మున్సిపల్ ఎన్నికల్లోను సత్తా చాటింది.
కాగా, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తును కొనసాగిస్తూ రెండు రోజుల క్రితం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, మజ్లిస్ పార్టీకి గాలి పటం కొనసాగనున్నాయి.