జగన్ కు అనూహ్య షాక్ ? మంత్రి ఇవ్వకపోతే పార్టీకి గుడ్ బై ! విపక్షాలతో టచ్ లోకి సీనియర్లు ?
ఏపీలో జగన్ కేబినెట్ విస్తరణ అంశం కాకరేపుతోంది. మంత్రి పదవులు దక్కించుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, పదవులు కోల్పోతున్న మంత్రులు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో పలువురు సీనియర్లు, తొలిసారి ఎమ్మెల్యేలు కూడా తమ సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి దక్కపోతే మాత్రం పార్టీని వీడేందుకు సైతం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ప్రత్యర్ధి పార్టీలతో టచ్ లోకి వెళ్తున్నారు. దీంతో ఈ మంత్రివర్గం విస్తరణ జగన్ కు కత్తిమీద సాముగా మారుతోంది.
జగన్ కు కేబినెట్ షాకులు
ఏపీలో జగన్ కేబినెట్ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న మంత్రులందరితో రాజీనామాలు చేయించి వారి స్ధానంలో కొత్త మంత్రుల ఎంపిక ఇప్పుడు రాజకీయంగా అనూహ్య పరిణామాలకు తావిస్తోంది. ప్రస్తుతం కేబినెట్ నుంచి తప్పించిన మంత్రులలో చాలా మంది సీఎం ముందు, బయట కూడా తాము హ్యాపీగా ఉన్నామని చెప్పుకుంటూనే అంతర్గతంగా మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో తాజా కేబినెట్ ప్రక్షాళనలో భాగంగా వారికి చోటు దక్కకపోతే ఎంతకైనా రెడీ అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ మారేందుకు కూడా సై అంటున్నారు. అసలే ప్రతిపక్షాలు జగన్ సర్కార్ విషయంలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకునేందుకు సిద్ధంగా లేవు. ఇలాంటి సమయంలో వీరిపై వల విసిరేందుకు విపక్షాలు సిద్ధమైపోతున్నాయి.
ఫలించని బుజ్జగింపులు !
ప్రస్తుతం కేబినెట్ లో మంత్రి పదవులు కోల్పోయిన వారిలో చాలా మంది మంత్రుల్ని పార్టీ అధిష్టానం తరఫున కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగిస్తున్నారు. వారికి కేబినెట్ హోదాతో ఇతర పదవులు కట్టబెడతామని హామీ ఇస్తున్నారు. అయినా వారు వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటున్నారు. వీరిలో కొందరు మాత్రం ప్రభుత్వ హామీలతో సంతృప్తి చెందుతుండగా.. మిగతావారు మాత్రం పదవి ఇవ్వకపోతే తమ దారి చూసుకుంటామని అంతర్గతంగాసన్నిహితులతో వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వీరి విషయంలో ఏం చేయాలో తెలియక అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది.
మంత్రి పదవి దక్కకపోతే జంప్ ?
పైకి ఎన్నిమాటలు చెప్పుకున్నా ఉన్న మంత్రి పదవి సగం కాలానికే వదులుకోవాల్సి రావడం, మరోసారి అవకాశం దక్కుతుందో లేదో తెలియని పరిస్ధితి, భవిష్యత్తులో అవకాశం రావాలంటే పార్టీని గెలిపించాలన్న కండిషన్ ఇప్పుడు వైసీపీ తాజా మాజీ మంత్రుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని కంటే మంత్రి పదవి దక్కకుంటే ప్రత్యర్ధి పార్టీలో చేరిపోయి వచ్చే ఎన్నికలకు సిద్ధంకావడమే మేలనే భావనలో కొందరిలో కనిపిస్తోంది. అందుకే మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం పార్టీ మారేందుకు ఉన్న అవకాశాల్ని వారు పరిశీలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి తనకు ఎలాగో కేబినెట్ బెర్తు మరోసారి దక్కదనే నిర్ణయానికి వచ్చేసి టీడీపీతో టచ్ లోకి వెళ్లిపోయారు. అక్కడ ఎమ్యెల్యే సీటుతో పాటు గెలిస్తే మంత్రి పదవి హామీ కూడా ఆయనకు లభించింది. ఇదే బాటలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు.
Recommended Video
జగన్ భవిష్యత్ తేలే సమయం ?
ప్రస్తుత కేబినెట్ ప్రక్షాళనలో అసంతృప్తుల్ని అధిగమించి సాఫీగా విస్తరణ చేయగలిగితే సీఎం జగన్ రాష్ట్ర రాజకీయాల్లో మరింత బలమైన నేతగా పేరు తెచ్చుకుంటారు. అలా కాకుండా మంత్రి పదవుల చిచ్చుతో పార్టీలో సీనియర్లు, కొత్త ఎమ్మెల్యేలు చేజారితే, విపక్షాల్లో చేరిపోతే మాత్రం కచ్చితంగా జగన్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అన్నింటికంటే మించి మరో ఏడాది తర్వాత ఎలాగో ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. అప్పటికల్లా ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు విపక్షాల్లో చేరి చిచ్చు పెడితే మాత్రం వైసీపీకి కూడా రాజకీయంగా నష్టం తప్పదు. దాని స్ధాయి ఎక్కువగా ఉంటే వైసీపీకి మరోసారి ఙారీ మెజారిటీతో అధికారం దక్కించుకోవాలన్న కలపైనా ప్రభావం పడుతుంది. కాబట్టి జగన్ కు ఇది అగ్నిపరీక్షగా అంచనావేస్తున్నారు.