ఇండియా టుడే సర్వేపై వైసీపీ గరంగరం-ఏం పీకలేరంటూ ఫైర్-జగనే శాశ్వత సీఎం
ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రజాదరణ తగ్గుతోందంటూ ఇండియా టుడే తన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడించడంపై వైసీపీ మండిపడుతోంది. ఇండియా టుడే సర్వేలో జగన్ పాపులారిటీ జాతీయ స్ధాయిలో నాలుగో స్ధానంలో ఉన్నా సొంత రాష్ట్రంలో మాత్రం తగ్గిందని వెల్లడించారు. దీనిపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో శాశ్వత స్ధానం ఏర్పాటు చేసుకున్న జగన్ శాశ్వత సీఎంగా ఉండిపోతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇండియా టుడే సర్వే చెప్పిందేంటి ?
జాతీయ మీడియా సంస్ధ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తరచుగా సర్వేలు చేస్తూ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. జాతీయ స్ధాయిలో ఉత్తమ సీఎంల జాబితాలో వైఎస్ జగన్ తన నాలుగో స్ధానాన్ని నిలబెట్టుకోగా.. రాష్ట్రంలో మాత్రం జగన్ పాపులారిటీ భారీగా తగ్గినట్లు తేలింది. సొంత రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉన్న ప్రజాదరణను సర్వే చేసినప్పుడు జగన్ టాప్ 10లో కూడా చోటు సంపాదించుకోలేకపోయారు.. దీంతో ఈ సర్వే వైసీపీకి మింగుడు పడటం లేదు.
ఎల్లో మీడియా గగ్గోలు
ఇండియా టుడే సర్వేలో ఎప్పుడైతే జగన్ సొంత రాష్ట్రంలో ప్రజాదరణ విషయంలో టాప్ 10లో లేకుండా పోయారో అప్పుడు ఈ క్షణం కోసమే కాసుకుని కూర్చున్న ఎల్లో మీడియాకు మంచి ఛాన్స్ దక్కినట్లయింది. దీంతో వరుసగా పత్రికలతో పాటు ఛానళ్లు కూడా రెచ్చిపోయాయి. స్వరాష్ట్రంలో జగన్ అనుసరిస్తున్న విధానాల వల్ల ఆయనకు ప్రజాదరణ తగ్గిపోయిందంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాయి. జగన్ విధానాల్ని ముందునుంచీ వ్యతిరేకిస్తున్న తమ మాటే ఇప్పుడు నిజమైందంటూ విపక్షాలతో కలిసి చర్చలు పెట్టడం మొదలుపెట్టేశాయి. ఈ రెండేళ్లలో జగన్ అనుసరించిన విధానాల్ని గుర్తు చేస్తూ వైసీపీ సర్కార్ పై, జగన్ పై సాధ్యమైనంతగా బురద చల్లేశాయి.
వైసీపీకి మింగుడు పడని సర్వే
ఇండియా టుడే సర్వేలో సీఎం జగన్ జాతీయ స్ధాయిలో నాలుగో పాపులర్ సీఎంగా ఎంపికైనప్పటికీ .. స్వరాష్ట్రంలో ఆదరణ విషయంలో టాప్ 10లో కూడా లేకపోవడం వైసీపీకి ఇబ్బందికరంగా మారిపోయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారధిగా చెప్పుకుంటూ వచ్చే ఎన్నికల్లోనూ తమకు నల్లేరు నడకేనని భావిస్తున్న తరుణంలో వైసీపీ నేతలకు ఈ సర్వే అస్సలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని తాకట్టు పెట్టి మరీ రుణాలు తెస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నా ప్రజల్లో జగన్ పాపులారిటీ అంతగా క్షీణించడం వారికి రుచించడం లేదు. దీంతో ఈ సర్వే వెనుక ఎవరున్నారనే దానిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇంత దారుణంగా జగన్ పాపులారిటీ నిజంగా పడిపోయిందా అని ఆశ్చర్యపోతున్నారు.
వైసీపీ ఎదురుదాడి
ఇండియాటుడే సర్వే ఆధారంగా వైఎస్ జగన్ కు ప్రజాదరణ తగ్గిందంటూ ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు మండిపడుతున్నారు. జగన్ పాపులారిటీ తగ్గిదంటూ ఇండియా టుడే చేసిన సర్వేలో తేలడం నిజం కాదని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ సర్వే అంతా బూటకమంటూ ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ కు ఉన్న ప్రజాదరణను ఓర్వలేకే ఇలాంటి సర్వేలు చేసి ప్రజల్లోకి పంపుతున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటి వల్ల జగన్ కు కానీ, వైసీపీకి కానీ ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు. ఇలాంటి సర్వేలు చేసే వాళ్లు రాష్ట్రంలో పర్యటించి వాస్తవ పరిస్ధితి తెలుసుకోవాలని కోరుతున్నారు.
ఇండియా టుడే వెనుక ఎవరు ?
జగన్ కు ప్రజాదరణ తగ్గిందంటూ ఇండియా టుడే చేసిన సర్వేపై మండిపడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఆ సర్వే విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. కొందరు పనిగట్టుకుని ఇండియా టుడేతో ఇలా చెప్పించారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయించారని వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. చాలా రాష్ట్రాల్లో చేసిన ఇలాంటి సర్వేలు గతంలో తేలిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేలు బోగస్ అని పలుమార్లు తేలిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్ారు. దేశమంతా జగన్ వైపు చూస్తుంటే పచ్చ ఛానల్స్ మాత్రం సర్వేలతో దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని జనం ఎప్పటికీ నమ్మే అవకాశం లేదన్నారు.
Recommended Video
జగనే శాశ్వత సీఎం- వెంట్రుక కూడా పీకలేరు
రాష్ట్రంలో పసిబిడ్డల నుంచి పెద్ద వారి వరకూ అందరూ జగనే శాశ్వత సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్ని సర్వేలు చేయించి జగన్ పై అబద్ధాలు ప్రచారం చేసినా వెంట్రుక కూడా పీకలేరని ఆయన తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధతో రాష్ట్రంలో అందరికీ అన్నీ అందుబాటులోకి తెచ్చిన చరిత్ర జగన్ ది అన్నారు. జగన్ దేశంలోనే ఏపీని ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంశించారు. ఐదేళ్లు కొత్త రాష్ట్రంలో చంద్రబాబు పాలించి ప్రజల్ని ఎలా మభ్యపెట్టాడో జనం మర్చిపోలేదన్నారు. జగన్ గ్రాఫ్ పడిపోయిందని రాయిస్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల మనసుల్లో జగన్ నిలిచిపోయారని ప్రసన్న వ్యాఖ్యానించారు.