రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ పాత్ర ఎలాంటిదనేది తేల్చేసిన నాగార్జున యాదవ్
తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. తన యువగళం పాదయాత్ర సందర్భంగా పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతుండటం, ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తోండటాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించింది. తాము కూడా చంద్రబాబుపై అదే స్థాయిలో విమర్శలు చేయగలమని, తమకు సంస్కారం అడ్డు వస్తోందని స్పష్టం చేసింది.

కామెడీ సినిమాగా..
నారా లోకేష్ పాదయాత్ర కామెడీ సినిమాను తలపిస్తోందంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిది నాగార్జున యాదవ్ ఎద్దేవా చేశారు. లోకేష్ ను ఓ కమేడియన్ గా అభివర్ణించారు. కమెడియన్ పాత్రకు నారా లోకేష్ పూర్తి న్యాయం చేస్తారని చురకలు అంటించారు. మాయాబజార్ సినిమాలో రేలంగి పాత్ర ఎలాంటిదో రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ పాత్ర కూడా అలాంటిదేనని అన్నారు.

ఐరన్ లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
యువగళం పేరుతో నారా లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ అపశకునాలే ఎదురవుతున్నాయని, దుర్ఘటనలు చోటు చేసుకుంటోన్నాయని నాగార్జున యాదవ్ అన్నారు. ఆ పాద మహిమ అలాంటిదని, ఐరన్లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు భావిస్తోన్నారని చెప్పారు. ఐరన్ లెగ్ తో పాదయాత్ర చేస్తోండటం వల్ల ప్రమాదాలు, దుర్మరణాలు నమోదవుతున్నాయని ధ్వజమెత్తారు. పాదయాత్ర, కాస్తా బలియాత్రగా మారిందంటూ మండిపడ్డారు. పదిరోజుల పాదయాత్ర కాస్తా టీడీపీకి పాడెయాత్రగా మారిపోయిందంటూ విమర్శించారు.

నందమూరి కుటుంబానికి నారా ఉసురు..
నందమూరి కుటుంబానికి నారా ఉసురు తగులుతోందని నాగార్జున యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, నారా లోకేశ్ల యాత్రల ప్రభావం గుంటూరు, కందుకూరుల్లో చూశామని చెప్పారు. అప్రయోజకుడైన కొడుకును చూసి చంద్రబాబుకు నవ్వాలో, ఏడవాలో దిక్కుతోచని స్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. అజ్ఞానానికి టక్కు, టై కట్టి, దానికి పేరేం పెట్టాలంటే లోకేష్ అనే సమాధానం వస్తుందని నాగార్జున యాదవ్ చెప్పారు.

లోకేశ్ యాత్రతో
నారా లోకేష్ పాదయాత్రతో చంద్రబాబుకు సన్ స్ట్రోక్ తగులుతోందని నాగార్జున యాదవ్ అన్నారు. లోకేష్ ను ఎందుకు తమకు అంటగడుతున్నావంటూ టీడీపీ సీనియర్ నాయకులు నేరుగా చంద్రబాబును ప్రశ్నిస్తోన్నారని చెప్పారు. నారా లోకేష్ సమర్థుడు కాకపోవడం వల్లే చంద్రబాబు చివరికి పవన్ కళ్యాణ్ పై ఆధారపడ్డారని వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్ర దెబ్బకు చంద్రబాబుకు సన్స్ట్రోక్ తగిలేలా ఉందని టీడీపీ నాయకులకూ అర్థమైందని చెప్పారు.

అన్ని వర్గాల సంక్షేమానికి..
సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీల సంక్షేమానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారని, ఈ క్రమంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నారని నాగార్జున యాదవ్ అన్నారు. జగన్ కు లభిస్తోన్న ప్రజాదరణను చూసి చంద్రబాబు, నారా లోకేష్ తట్టుకోలేకపోతున్నారని, జగన్ పై నోటికొచ్చినట్లు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరెన్ని విమర్శలు చేసినా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీయేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications