వైసీపీ పొరబాటున మళ్లీ గెలవకపోతే..! ఏం జరుగుతుందో చెప్పిన వైవీ సుబ్బారెడ్డి..
వైసీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో టీటీడీ ఛైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి ఇావాళ జోస్యం చెప్పారు. విజయనగరం జిల్లా రాజాంలో వాలంటీర్లు, గృహసారధుల భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజాం : ఏపీలో వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. మరో ఏడాదిలో ఎన్నికలకు సిద్దమవుతోంది. అదే సమయంలో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందా రాదా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై టీటీడీ ఛైర్మన్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
ప్రభుత్వం విద్య, వైద్యం కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఎక్కడా లేని విధంగా నాడు-నేడుతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏ పథకం ప్రారంభించినా మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామస్ధాయి నుంచే అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సచివాలయ వ్యవస్ధ పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలిపారు.
వాలంటీర్ల వ్యవస్ధ కూడా సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలుచేసేందుకు ఉపయోగపడుతోందన్నారు. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విధంగా పార్టీలు, కుల, మత, ప్రాంతాలు చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నారన్నారు. గ్రామ వాలంటీర్లతో కలిసి గృహసారధులు ఎలా పనిచేయాలనేది త్వరలోనే తెలియజేస్తామని వైవీ వెల్లడించారు. ప్రతీ గ్రామ సచివాలయం పరిథిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎలాంటి లబ్ది జరుగుతుందో ప్రతీ ఇంటికీ తెలియచేయాలన్నారు.
మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి ఎట్టి పరిస్దితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే సీఎం జగన్ సమాంతర వ్యవస్ధల్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ఏడాది కాలం అప్రమత్తంగా ఉండాలని వాలంటీర్లు, గృహసారధులకు సూచించారు. ఎన్నికల పోలింగ్ రోజు వరకూ సచివాలయ పరిధిలో ఉన్న వాళ్లు వైసీపీ అభ్యర్ధులకు ఓట్లు వేసేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ సమాంతర వ్యవస్ధలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మీడియాలో జరిగే దుష్ప్రచారం నమ్మి మనం తిరిగి పొరబాటున అధికారంలోకి రాలేకపోతే కోట్లాది మంది నష్టపోతారని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలాంటి పరిస్ధితి రాకూడదని వైసీపీ నేతలకు ఆయన సూచించారు.