ఎన్డీఏకే వైసీపీ మద్దతు - మరోసారి ఎంపీలంతా...!!
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్న వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేసిన ముర్ము ఎన్నికల్లో గెలిచి రాష్ట్రపతిగా బాద్యతలు స్వీకరించారు. ఇక, ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల కోసం మద్దతు సమీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్ధిగా ధన్ఖడ్ పోటీలో ఉన్నారు. ఇదే సమయంలో విపక్ష పార్టీల నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వా పోటీలో ఉన్నారు. అల్వా ఎంపిక పైన విపక్ష పార్టీల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్డీఏ అభ్యర్ధికే వైసీపీ మద్దతు
ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా తాము అల్వాకు మద్దతు ఇవ్వలేమని చెబుతూ ..తటస్థ వైఖరితో ఉంటామని ప్రకటించారు. ఇప్పడుు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డితో పాటుగా పార్టీ ఎంపీలంతా కలిసి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి ధన్ఖడ్ ను కలిసారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నివాసంలో ధన్ఖడ్ను వైసీపీ ఎంపీలు కలిసి సన్మానించారు. ఆయనకు మద్దతుగా నిలవనున్నారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ థియోధర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీని ద్వారా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ పైన క్లారిటీ వచ్చింది.

తాజా పరిణామాలతో చర్చ..క్లారిటీ
ముఖ్యమంత్రి జగన్ మాజీ రాష్ట్రపతి కోవింద్ వీడ్కోలు విందు.. నూతన రాష్ట్రపతి ముర్ము ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. తాజాగా.. పార్లమెంట్ వేదికగా ఏపీకి సంబంధించిన అంశాల పైన కేంద్ర మంత్రుల వైఖరి రాజకీయంగా చర్చకు కారణమైంది. దీంతో..ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేవని, కానీ..ఎన్డీఏ అభ్యర్ధికి ఇస్తారా లేదా అనే చర్చ మొదలైంది. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలంతాధన్ఖడ్ తో సమావేశమయ్యారు. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు స్టాండ్ ఏంటనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో చివరి నిమిషంలో అనూహ్యంగా టీడీపీ ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు మద్దతు ప్రకటించింది.

చంద్రబాబు అదే బాట పడతారా
ఇప్పుడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ తమ వైఖరి ఏంటనేది వెల్లడించాల్సి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ నుంచి అన్ని ఓట్లు ముర్ముకు అనుకూలంగా పోలయ్యాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. వైసీపీకి లోక్ సభలో 22, రాజ్యసభలో 9 ఓట్లు ఉన్నాయి. టీడీపీకి లోక్ సభలో 3, రాజ్యసభలో ఒక్క ఓటు మాత్రమే ఉంది. వైసీపీ మద్దతు ఎన్డీఏకే అని తేలటంతో.. టీడీపీ సైతం ఎన్డీఏక మద్దతుగా నిలుస్తుందా.. లేక తటస్థ వైఖరితో ఉంటుందా అనేది తేలాల్సి ఉంది. ఇక, అటు తెలంగాణలో సీఎం కేసీఆర్ సైతం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉండటం..విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహిస్తుండటంతో... ఈ రోజు తమ మద్దతు ఎవరికనే అంశం పైన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications