వైజాగ్ బ్లాస్ట్ పై సర్కారుకు నివేదిక- మానవతప్పిదమే కారణం- కుట్రే అంటన్న వైసీపీ...
విశాఖపట్నంలోని పరవాడ ఫార్మాసిటీలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. విశాఖకు రాజధానిని తరలించవద్దంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న వేళ ఫార్మాసిటీలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలపై ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో ఇందులో కుట్ర కోణం ఉండొచ్చని వైసీపీ అనుమానిస్తోంది. అయితే తాజాగా జరిగిన ఫార్మాసిటీ పేలుడు వెనుక మానవ తప్పిదమే కారణమని దర్యాప్తు కమిటీ తేల్చింది.
నిన్న రాత్రి ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో ఐదుగురు సభ్యుల కమిటీ తేల్చిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

విశాఖ పేలుడుపై నివేదిక..
విశాఖపట్నంలోని పరవాడ ఫార్మాసిటీలోని రాంకీ సాల్వెంట్స్ సంస్ధలో చోటు చేసుకున్న తాజా పేలుడు ఘటనపై ప్రభుత్వం కలెక్టర్ వినయ్ చంద్ నేతృత్వంలో నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ తన ప్రాధమిక నివేదికను అందజేసింది. ఇందులో ప్రమాదానికి మానవతప్పిదమే కారణమని ఈ నివేదిక తేల్చింది. ప్రమాదం జరిగిన తీరు, దానికి దారి తీసిన కారణాలు, ప్రమాదం తర్వాత పరిణామాలపై రెండు పేజీల నివేదికలో ఈ కమిటీ పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. అక్కడి పరిస్ధితులను స్ధూలంగా పరిశీలించిన అనంతరం కలెక్టర్ కమిటీ ఈ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది..

శుద్ధి ప్రక్రియలో లోపం- గుర్తింపులో వైఫల్యం...
రాంకీ సాల్వెంట్ రికవరీ రియాక్టర్ వద్ద డై మిధైల్ సల్ఫాక్సైడ్ శుద్ధి చేసే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కమిటీ తన నివేదికలో పేర్కొంది. శుద్ధి సమయంలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించి సరిచేస్తే సరిపోయేదని, అందులో విఫలం కావడం వల్లే భారీ పేలుడు చోటు చేసుకుందని నివేదికలో వెల్లడించింది. స్ధూలంగా లోపాన్ని సరిచేయలేని మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని కలెక్టర్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల కమిటీ చెప్పినట్లయింది. అయితే ఈ నివేదికను అధ్యయనం చేశాక ప్రభుత్వం చర్యలు ప్రకటించే అవకాశముంది.

కుట్ర కోణంపై వైసీపీ అనుమానాలు..
విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత ఫార్మాసిటీలో చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, ఇందులో కుట్ర కోణం ఉందేమో సీఎం జగన్ సమగ్ర విచారణకు ఆదేశించాలని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖ ఇమేజ్ ను దెబ్బతీసే వారు ఎవరైనా ఉపేక్షించే సమస్యే లేదన్నారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అయ్యేవి కావంటూ విపక్షాలు విమర్శిస్తున్న వేళ వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కొందరు కావాలనే ఇలాంటి కుట్రలు చేస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో ప్రభుత్వం వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications