వంగవీటిVsదేవినేని, ఎమ్మెల్యే కారుపై జగన్ పార్టీ దాడి
విజయవాడ/అనంతపురం: విభజనను నిరసిస్తూ సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో శుక్రవారం బంద్ కొనసాగుతోంది. కృష్ణా జిల్లా బెంజ్ సర్కిల్లో వంగవీటి రాధా, దేవినేని వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. నేడు ఎపిఎన్జీవోలు 24 గంటలు, టిడిపి 48 గంటలు, విద్యార్థి ఐకాస నిరవధిక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒకరోజు బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బెంజ్ సర్కిల్లో దేవినేని, వంగవీటి వర్గీయులు ఎదురయ్యారు. పోటా పోటీగా నినాదాలు చేశారు. ఓ సమయంలో బాహాబాహీకి దిగారు. పోలీసులు కల్పించుకొని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
విజయవాడలోని టిడిపి అర్బన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెసు ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటిని ముట్టడించేందుకు తెలుగు మహిళలు ప్రయత్నించారు. వారు ర్యాలీగా లగడపాటి ఇంటికి వెళ్లే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతపురం జిల్లాలోని టిడిపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.
మంత్రి శైలజానాథ్ ఇంటిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నేతలు ముట్టడించి, చీరలు, గాజులు ఇచ్చారు. గుత్తి రోడ్డుపై టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆందోళనలు చేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాదులో ట్యాంక్ బండు పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎపిఎన్జీవోలు రాగా తెలంగాణవాదులు అడ్డుకున్నారు.
విశాఖలో కోర్టుకు తాళం వేసి న్యాయవాదులు బైఠాయించారు. చిత్తూరులో గాంధీ సర్కిల్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావును పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డుకుంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.