అమరావతి రచ్చ రచ్చ- రాష్ట్రంలో అనుకూల, వ్యతిరేక ర్యాలీలు-టీడీపీ, వైసీపీ పరోక్ష మద్దతు
ఏపీలో రాజధానుల వ్యవహారం ప్రాంతీయ చిచ్చుకు కారణమవుతోంది. స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయ నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాంతాల మధ్య, అక్కడి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయి. అమరావతి రైతులు రేపు తిరుపతిలో బహిరంగసభ నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. దీనికి కౌంటర్ గా ఇవాళ తిరుపతిలో రాయలసీమ మేథావుల ఫోరం భారీ ర్యాలీ నిర్వహించింది. అటు టీడీపీ కూడా అమరావతి సభకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తోంది.
Recommended Video

అమరావతి రచ్చ
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నాలకు నిరసనగా... అమరావతిలో రైతులు ఏడాదిన్నర క్రితమే దీక్షలు మొదలుపెట్టారు. తాజాగా న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో తిరుపతికి పాదయాత్ర కూడా చేశారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా కోర్టును ఆశ్రయించి తెచ్చుకున్నారు. అనంతరం తిరుపతిలో రేపు బహిరంగసభ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ రచ్చకు దారితీస్తోంది.

టీడీపీ సంఘీభావ ర్యాలీలు
అమరావతి రైతులు రేపు తిరుపతిలో నిర్వహించే బహిరంగసభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వేడి రగిల్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తిరుపతి సభకు మధ్తతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంఘీభావ ర్యాలీలకు పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల పేరుతో రాజకీయం చేస్తోందని, దాని కంటే అమరావతిలో రాజధాని ఉండటమే బెటర్ అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మూడు రాజధాను ర్యాలీలతో కౌంటర్
ఏపీలో ఎప్పుడైతే అమరావతి అంశాన్ని టీడీపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందో అప్పుడు వైసీపీ కూడా అదే స్ధాయిలో కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా రాయలసీమలో హక్కుల సమితుల్ని,మేథావుల ఫోరాల్ని రంగంలోకి దింపుతోంది. తాజాగా తిరుపతి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దాన్ని తుదివరకూ అడ్డుకున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు తాను మౌనంగా ఉంటూ స్ధానికులతో అమరావతికి వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీలు తీయిస్తోంది. ఇవాళ తిరుపతిలో రాయలసీమ మేథావుల ఫోరం నిర్వహించిన భారీ ర్యాలీయే ఇందుకు నిదర్శనం. దీంతో తిరుపతిలో అమరావతి కంటే మూడు రాజధానులకే స్ధానికుల మద్దతు ఉందని చూపించే ప్రయత్నం చేస్తోంది.

టీడీపీ, వైసీపీ చావోరేవో
అమరావతి రాజధాని అంశాన్ని ముందునుంచీ నెత్తికెత్తుకున్న టీడీపీ... ఇప్పుడు తిరుపతిలో జరిగే బహిరంగసభకు సైతం రాయలసీమ వాసులతో మద్దతు ఇప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో వైసీపీ మాత్రం తాను బయటపడకుండా రాయలసీమ హక్కుల సంఘాలు, మేథావులతో ర్యాలీలు, మీటింగ్ లకు ప్లాన్ చేస్తోంది. తద్వారా మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందని చెప్పే ప్రయత్నం చేస్తోంది.
ఇందులో ఎక్కడ తేడా వచ్చిన టీడీపీ అమరావతి రాజధానికి మద్దతుగా చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంచి తిరస్కారం ఎదురవుతుందని చెప్పే ప్రయత్నం చేస్తోంది. దీంతో దీన్ని కౌంటర్ చేసేందుకు టీడీపీ కూడా ప్రతివ్యూహాలు రచిస్తోంది. ఈ ర్యాలీలు, సభల ప్రయత్నాల వెనుక వైసీపీయే ఉందని ప్రచారం చేస్తోంది.












Click it and Unblock the Notifications