అమరావతిలోనూ వైసీపీ హవా- గుంటూరు కైవసం-విజయవాడలో ఆధిక్యం-సజ్జల హ్యాపీ
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో సత్తా చాటుతున్న వైసీపీ.. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో సత్తా చాటింది. విజయవాడ, గుంటూరు మున్సిపల్ కార్పోరేషన్లపై వైసీపీ ఏకపక్షంగా విజయాలు సాధిస్తోంది. దీంతో వైసీపీ సర్కారు వికేంద్రీకరణకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా దీన్ని చెప్పుకుంటోంది.
గుంటూరు కార్పోరేషన్కు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 50 స్ధానాల్లో వైసీపీ ఏపక్షంగా 37 స్ధానాలు కైవసం చేసుకుంది. విపక్ష టీడీపీ కేవలం 6 సీట్లకే పరిమితం అయింది. జనసేన 2 స్ధానాల్లో విజయం సాధించింది. ఇతరులకు రెండు సీట్లు దక్కాయి. ఇక్కడ వైసీపీ తొలిరౌండ్ నుంచీ ఆధిపత్యం ప్రదర్శించింది. పోటీలో జనసేన-బీజేపీ కూటమి కూడా ఉండటంతో పలుచోట్ల ఓట్ల చీలిక కూడా జరిగినట్లు భావిస్తున్నారు.
అటు విజయవాడ కార్పోరేషన్లోనూ వైసీపీ ఆదిక్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ మొత్తం 64 స్ధానాలు ఉండగా... వైసీపీ ఇప్పటికే 19 స్ధానాల్లో విజయం సాధించింది. మరో పది స్ధానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ మాత్రం నాలుగు డివిజన్లు గెల్చుకుంది. విజయవాడలో 1, 3, 5, 7, 15, 23 25, 27, 29, 31, 33, 37, 41, 43, 47, 49, 51, 53, 57 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. 9, 11, 13, 45 డివిజన్లలో టీడీపీ విజయం సాధించింది. పోస్టల్ ఓట్లలో వెనుకబడిన టీడీపీ మేయర్ అభ్యర్ధిని కేశినేని శ్వేత అసలు ఓట్లలో మాత్రం ఆధిక్యం సాధించి విజయాన్ని అందుకున్నారు. ఫలితాల సరళిని బట్టి చూస్తుంటే విజయవాడ కార్పోరేషన్ను కూడా వైసీపీ సునాయాసంగా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
అమరావతి పరిధిలో వైసీపీ సాధిస్తున్న విజయాలపై ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వైసీపీ సర్కారు చేపట్టిన వికేంద్రీకరణకు అమరావతి ప్రజలు మద్దతిచ్చారని ఆయన వ్యాఖ్యనించారు. టీడీపీ మాత్రం కృత్రిమ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఇంకా రాజధాని రాజకీయాలు చేస్తోందని సజ్జల విమర్శించారు. అమరావతి ప్రాంతంలో ఉన్న గుంటూరు కార్పోరేషన్ విజయంపై ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో వినుకొండ, రేపల్లె, సత్తెనపల్లి వంటి మున్సిపాలిటీలనూ వైసీపీ కైవసం చేసుకుంది.