Vallabhaneni Vamsi : ఆ ఇద్దరు టీడీపీ నేతలపై వల్లభనేని వంశీ పరువునష్టం దావా ..
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరులో ఓ కీలక స్కాంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని హస్తం ఉందంటూ ఆరోపణలు చేసిన ఇద్దరు టీడీపీ నేతలపై ఆయన ఇవాళ పరువునష్టం దావా దాఖలు చేశారు.
గన్నవరంలో టీడీపీ తరఫున గెలిచి వైసీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇప్పుడు సొంత పార్టీ, కొత్త పార్టీ రెండింటి నుంచీ సెగ తప్పడం లేదు. ఓవైపు టీడీపీ నేతలతోనూ, మరోవైపు వైసీపీ నేతలతోనూ ఆయన పోరు సాగిస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు చేసిన ఆరోపణలు ఆయన్ను చికాకు పెడుతున్నాయి. దీంతో వంశీ ఇవాళ వారిద్దరిపై పరువునష్టం దావా దాఖలు చేశారు.
టీడీపీ గన్నవరం ఇంచార్జి బచ్చుల అర్జునుడు, విజయవాడకు చెందిన మరో నేత పట్టాభిపై గన్నవరం కోర్టులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువునష్టం దావా వేశారు. కృష్ణాజిల్లాలో తాజాగా బయటపడిన సంకల్ప సిద్ధి స్కాంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ పాత్ర ఉందని వీరు తీవ్ర ఆరోపణలు చేశారు. సంకల్ప సిద్దిని నడిపిస్తూ స్కాంకు పాల్పడ్డారంటూ వంశీతో పాటు మాజీ మంత్రి కొడాలి నానిపైనా వీరు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన వంశీ ఇవాళ పరువునష్టం దావా వేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచానని,
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు పథకాలకు ఆయాకర్షితుడనై మద్దతు తెలిపానని వంశీ వెల్లడించారు. అందుకు టీడీపీకి చెందిన కొంత నాపై సోషల్ మీడియా,కొన్ని పత్రికలు ద్వారా దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. టీడీపీకి మద్దతుగా ఉంటే ఒకలా బయటకు వస్తే మరోలా దుష్ప్రచారం చేయడం అలవాటు చేసుకున్నారని వీరిపై మండిపడ్డారు. విజయవాడలో సంకల్ప సిద్దిలో అవినీతి జరిగిందని కొన్ని మీడియాల ద్వారా తనకు తెలిసిందన్నారు.

రాజకీయ జీవితంలో ఒక్క అవినీతికి కూడా పాల్పడని తనపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని వల్లభనేని వంశీ ఆరోపించారు. టీడీపీకి చెందిన పట్టాభి,బచ్చుల అర్జునుడు తీవ్ర పదజాలంతో అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారన్నారు. తాను ,కొడాలి నాని కోట్లు అవినీతి చేసి బెంగుళూరులో ఆస్తులు కొన్నట్లు మీడియాలో ప్రకటనలు ఇచ్చారన్నారు. ఈ విషయం పై గతంలో ఇచ్చిన నోటీస్ కి రిప్లై ఇవ్వలేదని, టీడీపీ నాయకులు రిప్లై ఇవ్వని కారణంగా నేడు గన్నవరం కోర్టుని ఆశ్రయించినట్లు వంశీ వెల్లడించారు. తనపై కావాలని తీవ్ర పదజాలంతో మీడియాలో ప్రకటనలు చేసిన వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వంశీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications