అదనపు రుణానికి అనుమతి కోరిన జగన్ సర్కార్- రాజ్యసభలో కేంద్రానికి సాయిరెడ్డి వినతి
ఏపీ ప్రభుత్వం వరుసగా చేస్తున్న అప్పులపై ఇప్పటికే ఆర్బీఐతో పాటు వివిధ ఆర్ధికసంస్ధలు సైతం పెదవివిరుస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇవాళ పార్లమెంటులో కేంద్రానికి మరో విజ్ఞప్తి చేసింది. కొత్త అప్పులు తీసుకునేందుకు అనుమతించాలని కోరింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విజ్ఞప్తి చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన సభ ముందు ఉంచారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

రాజ్యసభలో సాయిరెడ్డి డిమాండ్
రాష్ట్ర విభజన నాటి నుంచి తీవ్ర రెవెన్యూ లోటుతో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్డీపీ)లో అదనంగా 0.5 శాతం రుణాల సేకరణకు అనుమతించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. అత్యధిక వృద్ధి రేటు సాధించడానికి ప్రతి రాష్ట్రం తపన పడుతుంది. క్రియాశీలుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుంజలో నిలిపేందుకు కృషి చేస్తోందని సాయిరెడ్డి అన్నారు.

విభజనతో రెవెన్యూ లోటు
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన తీరని అన్యాయం కారణంగా రెవెన్యూ వనరులన్నీ తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయాయని విజయసాయిరెడ్డి తెలిపారు. అశాస్త్రీయంగా జరిగిన విభజన వలన అంధ్రప్రదేశ్ ఇప్పటికీ భారీ రెవెన్యూ లోటుతో సతమతమవుతూనే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ లోటు అనివార్యమని 14వ ఆర్థిక సంఘం కూడా స్పష్టం చేసిందని విజయసాయి రెడ్డి అన్నారు. రెవెన్యూ లోటు కారణంగా అనేక ఇబ్బందులు, అవరోధాలు ఎదురవుతున్నా, కేంద్రం నుంచి ఆశించిన సాయం అందకపోయినా ముఖ్యమంత్రి నవరత్నాల ద్వారా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన చెప్పారు.

మూలధన లోటు నిబంధనతో అన్యాయం
ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 45 శాతం మూలధన వ్యయం చేసిన ఏడు రాష్ట్రాలకు జీఎస్డీపీలో అదనంగా 0.5 శాతం రుణం సేకరించుకోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుమతించారని సాయిరెడ్డి తెలిపారు. మూలధన వ్యయం అనే నిబంధన విధించడం ద్వారా విభజననాటి నుంచి రెవెన్యూ లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు మరోమారు అన్యాయం చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించి, పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రాష్ట్రాలతో నేరుగా సంప్రదింపులు జరుపుతామనంటూ ఇటీవల ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు.
Recommended Video

అదనపు రుణానికి అనుమతివ్వరూ...
ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోకి ప్రవేశిస్తున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని జీఎస్డీపీలో 0.5 శాతం అదనంగా రుణ సేకరణకు రాష్ట్రాన్ని అనుమతించాలని వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా అమలు చేయడానికి దోహదం చేసినట్లవుతుందని అన్నారు. అయితే దీనిపై ఆర్ధిక మంత్రి నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ అప్పులపై కేంద్ర ఆర్ధికశాఖ నుంచి సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అదనపు రుణానికి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications