Vijayasai Reddy Cell Phone : విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ మిస్సింగ్- తాడేపల్లిలో కేసు ! దాచేశారన్న టీడీపీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ తాజాగా చోరీకి గురైంది. వరుస ప్రయాణాలతో బిజీగా ఉండే సాయిరెడ్డి సెల్ ఫోన్ మిస్సయినట్లు ఆయన గుర్తించారు. దీంతో ఆయన పీఏ లోకేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాడుతున్న ఐఫోన్ ఈ నెల 21న మిస్సయినట్లు తాడేపల్లి పోలీసులు ఫిర్యాదు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి పీఏ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దాన్ని వెతికే పనిలో పడ్డారు. సాయిరెడ్డి ఫోన్ ఎప్పుడు, ఎక్కడపోయింది, దాన్ని ఎవరు దొంగిలించే అవకాశం ఉందన్న అంశాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయామంశమవుతోంది.
మరోవైపు విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారంపై టీడీపీ ఆరోపణలకు దిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాం వివరాలు బయటపడతాయనే, తాడేపల్లికి, విజయసాయిరెడ్డి వాటాలు బయటపడతాయనే ఈ సెల్ ఫోన్ ను దాచేశారన్న అనుమానం ఉందని టీడీపీ మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు. తామూ ఎన్నో ఫోన్లు వాడుతున్నామని, కానీ ఎప్పుడూ సెల్ ఫోన్ మిస్ కాలేదన్నారు. గతంలో ఈడీ విచారణ సమయంలోనూ సాయిరెడ్డి ల్యాప్ టాప్ దాచేసిన చరిత్ర ఉందన్నారు. మద్యం కుంభకోణం విచారిస్తున్న ఈడీ అధికారులు రెండు తంతే సాయిరెడ్డి ఫోన్ తానే తీసుకొస్తాడన్నారు. తాడేపల్లి ప్యాలెస్ తో పాటు వీఐపీలు ఉండే ఏరియాల్లో ఉండే సాయిరెడ్డి ఫోన్ పోయే అవకాశమే లేదని జవహర్ వ్యాఖ్యానించారు.