వైఎస్ షర్మిల దొంగ సంతకాలు పెట్టారా?
Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి జగన్ను జైలుకు పంపించేలా కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తోన్నారు.
షర్మిల తీరుపై వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఘాటు విమర్శలు చేశారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఈ ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన 67 సంవత్సరాల వయస్సులో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ వద్ద ఆడిటర్గా పని చేశానని, వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడే జగన్, షర్మిలకు ఆస్తుల పంపకాలు జరిగాయని అన్నారు.

షర్మిల ఇప్పుడు జగన్తో గొడవ పడుతున్నది ఆస్తుల కోసం కాదని, అధికారం కోసమే తగాదా పెట్టుకున్నారని విమర్శించారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకూడదని, జగన్ ముఖ్యమంత్రి కాకూడదని ఆరాట పడుతోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ మీద కేసులు పెట్టిన కాంగ్రెస్, వాటిని పెట్టించిన చంద్రబాబులతో షర్మిల కలిసి జగన్పై కుట్ర పన్నారని ఆరోపించారు.
వైఎస్సార్ కన్నమూయడానికి 15 రోజుల ముందు ఆయన ఈ భూమి మీద ఉండడంటూ చంద్రబాబు చెప్పలేదా? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. షర్మిల రాసిన లేఖ ఆమెనే స్వయంగా ఇవ్వకపోతే చంద్రబాబు, ఆయనకు మద్దతు పలికుతున్న ఒక వర్గానికి చెందిన మీడియా చేతికి ఎలా వచ్చిందని నిలదీశారు.
చెల్లి మీద ప్రేమాభిమానాలతో జగన్ సొంతంగా సంపాదించిన ఆస్తిలో 40 శాతం ఇచ్చేలా, కోర్టు కేసులు ముగిసిన వెంటనే పంపకాలు జరిగేలా 2019లో ఎంఓయూ సైతం కుదుర్చుకున్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కోర్టు కేసులు పూర్తి అయ్యాక మాత్రమే షేర్లు, ఆస్తుల పంపకాల వంటివి పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని, లేకపోతే న్యాయపరంగా చిక్కులు వస్తాయని అన్నారు.

వాటన్నింటినీ పట్టించుకోకుండా షేర్లు ఎక్కడో పోయాయని చెప్పి జగన్కు తెలియకుండా దొంగ సంతకాలతో వాటిని తన పేరు మీద బదలాయించుకునే ప్రయత్నం చేశారని విజయసాయిరెడ్డి అన్నారు. దీనివల్ల జగన్ బెయిల్ రద్దయి జైలుకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా ఇదే కోరుకుంటోన్నారని విమర్శించారు.
భారతి సిమెంట్స్ను నెలకొల్పడానికి 1,400 కోట్ల రూపాయలను అప్పు చేశారని, ఆ తరువాత దాన్ని తీర్చారని సాయిరెడ్డి అన్నారు. ఎప్పుడైనా ఒక్క రూపాయి అయినా షర్మిల పెట్టుబడి పెట్టలేదని చెప్పారు. 2009 నుంచి జగన్ ఎన్నికల అఫిడవిట్లను చూస్తే ఆస్తుల పంపకం ఎలా జరిగాయో తెలుస్తుందని అన్నారు.
జగన్, భారతి కంపెనీలు కావడం వల్లే వాటికి జగతి పేరును తానే సూచించానని విజయసాయిరెడ్డి అన్నారు. షర్మిల వివాహం జరిగి పాతికేళ్లు అయిందని, వైఎస్సార్ కన్నుమూసి 15 సంవత్సరాలు గడిచిందని, అయినప్పటికీ తన సొంత సంపాదన నుంచి జగన్ 200 కోట్ల రూపాయలను షర్మిలకు ఇచ్చాడని అన్నారు. అది జగన్ అతి మంచితనమని వ్యాఖ్యానించారు.
200 కోట్ల రూపాయలు ఇచ్చిన తోడబుట్టిన అన్నను షర్మిల కోర్టుకు ఈడ్చిందంటూ మండిపడ్డారు. సరస్వతి పవర్ సంస్థలో తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని, జగన్ను తిడితే గానీ చంద్రబాబు వాటిని పరిష్కరించడంటూ షర్మిల తన సన్నిహితుల వద్ద చెప్పుకొందని విమర్శించారు.












Click it and Unblock the Notifications