సిద్ధం.. సూపర్ హిట్: అద్దంకి.. అంతకుమించి: మంత్రి రోజా
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో సమర శంఖాన్ని పూరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా విశాఖపట్నం జిల్లా భీమిలీ సభలో రణభేరిని మోగించారు.
ఇప్పటివరకు మూడు సిద్ధం సభలను నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. ఏలూరు జిల్లా దెందులూరు, అనంతపురం జిల్లా రాప్తాడుల్లో లక్షలాది మంది జనం మధ్య జరిగాయి ఈ సభలన్నీ కూడా. ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లాలోని అద్దంకి వద్ద నాలుగో సభను అంతకుమించి- అనే స్థాయిలో నిర్వహించడానికి వైసీపీ సన్నాహాలు చేస్తోంది.

ఈ సభలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు, పర్యాటక శాఖ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధం పేరుతో తమ పార్టీ నిర్వహిస్తోన్న సభలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయని చెప్పారు. ఒకదాని మించి ఒకటి అన్న తరహాలో లక్షలాది మంది ప్రజలు ఈ సభలకు తరలివచ్చారని గుర్తు చేశారు.
భీమిలీ, దెందెలూరు సభలకు వచ్చిన జనం కంటే అనంతపురం జిల్లా రాప్తాడులో సభకు హాజరైన ప్రజలు భారీగా ఉన్నారని రోజా అన్నారు. ఈ మూడింటినీ మించి పోయే స్థానంలో మార్చి 10వ తేదీన బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో నాలుగో విడత సిద్ధం బహిరంగ సభను నిర్వహించబోతోన్నామని పేర్కొన్నారు.
15 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తోన్నామని రోజా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలోని తమ ప్రభుత్వం ఈ అయిదు సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకూ అందాయనడానికి ఈ సభలకు వస్తోన్న ప్రజా స్పందనే నిదర్శనమని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన 99 శాతం హామీలను తాము అమలు చేశామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications