'దాడి కేసులో ఏ1 బాబు, ఏ2 డీజీపీ, ఏపీలో నమ్మకంలేకే హైదరాబాద్, 24 గం. అబ్జర్వేషన్లో జగన్'
Recommended Video

అమరావతి: తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన ఎయిర్ పోర్టు లాంజ్లో దాడి చంద్రబాబు ప్రభుత్వం ప్రమేయం లేకుండా జరుగుతుందా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రశ్నించారు. ఆసుపత్రిలో జగన్ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
నిందితుడు శ్రీనివాస రావును జగన్ అభిమానిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శ్రీనివాస రావుకు ఇదే టీడీపీ ప్రభుత్వం రెండు లోన్లు మంజూరు చేసిందని చెప్పారు. అందులో రూ.2 లక్షలతో ఇల్లు కూడా కట్టుకున్నాడని చెప్పారు. ఆయన టీడీపీకి చెందిన వాడే అన్నారు. పని చేసేది కూడా టీడీపీ నేత క్యాంటీన్లోనే అన్నారు.

ఆపరేషన్ గరుడ వెనుక చంద్రబాబే
పోలీసుల సహకారం లేకుండా కత్తితో విమానాశ్రయంలోకి ఎలా వచ్చాడని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు చెబుతున్న ఆపరేషన్ గరుడ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదే అన్నారు. జగన్ పైన దాడి ఘటనపై చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా అనిపిస్తోందన్నారు.

డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నం, టీడీపీలో చేరారు
జగన్ పైన జరిగిన దాడిని ప్రభుత్వం డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్తో నిందితుడి ఫ్లెక్సీ ప్రభుత్వం సృష్టించిందే అన్నారు. ఎప్పుడో పదకొండు నెలల క్రితం ఫ్లెక్సీని ఇప్పుడు తెరపైకి తెచ్చారన్నారు. నిందితుడి కుటుంబం ఆరు నెలల క్రితం వరకు వైసీపీ అభిమాన కుటుంబమేనని, ఆ తర్వాత టీడీపీలో చేరిందని, ఇదే విషయం అతని సోదరుడు మీడియాకు చెప్పారని గుర్తు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకే హైదరాబాద్కు జగన్
జగన్ మీద దాడి ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు చూసి ఆయనకు మానవత్వం ఉందా అనిపిస్తోందని, ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మీరు మనుషులా.. రాక్షసులా అన్నారు. తమకు చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకే, ఏపీ ప్రభుత్వంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం లేకే హైదరాబాద్ వచ్చామని చెప్పారు.

అదీ వైయస్ రాజశేఖర రెడ్డి
2003 అలిపిరి వద్ద దాడి జరిగితే వైయస్ రాజశేఖర రెడ్డి వెళ్లి చంద్రబాబును పరామర్శించారని, భగవంతుడి దయ వల్ల తాను బతికి బయటపడ్డానని నాడు చంద్రబాబు అన్నారని, అది ప్రతిపక్ష నేతగా వైయస్ సంస్కారం అన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు తీరు అసహ్యించుకునేలా ఉందన్నారు. విశాఖపట్నం కంటే హైదరాబాదులో మెరుగైన చికిత్స అందడంతో పాటు, మీ ప్రభుత్వంపై (చంద్రబాబు) నమ్మకం లేదని, అందుకే పారదర్శక దర్యాఫ్తు కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

దాడి కేసులో చంద్రబాబు ఏ1, డీజీపీ ఏ2
శ్రీనివాస రావు లేఖ రాసినట్లుగా రాత్రికి విడుదల చేశారని, అది అసలైన లేఖ అయితే ఎందుకు ఆలస్యమైందని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ప్లెక్సీని సృష్టించినట్లే పది పేజీల లేఖను సృష్టించారని చెప్పారు. జగన్ పైన దాడి కేసులో ఏ 1 చంద్రబాబు, ఏ2 డీజీపీ అన్నారు. ఈ కేసును ఏపీ అధికారులతో కాకుండా థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించాలన్నారు. కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా కేంద్రాన్ని, గవర్నర్ను కోరుతామని చెప్పారు.

శివాజీ ఎవరు? ఆపరేషన్ గరుడ వెనుక చంద్రబాబు
తాము విశాఖ నుంచి హైదరాబాద్ రావడాన్ని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని, కానీ పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి చంద్రబాబు ఇక్కడి నుంచి పారిపోయారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయినా జగన్ కోర్టుకు రావాల్సింది హైదరాబాదుకు అని, అందుకే వచ్చారని చెప్పారు. ఈ సందర్భంగా ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడుతూ.. అసలు శివాజీ ఎవరు, ఆపరేషన్ గరుడ వెనుక ఉందే చంద్రబాబు అన్నారు. ఆయన నడిపిస్తున్నారని, ఆయనే రాసిచ్చారని చెప్పారు. అందుకే అందులో ఉన్నట్లుగా జరుగుతోందన్నారు. విమానాశ్రయం తమ పరిధిలోకి రాదని చెబుతున్న ఏపీ ప్రభుత్వం, గతంలో ఇందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు.

మరో 24 గంటలు అబ్జర్వేషన్లోనే చంద్రబాబు
వైయస్ జగన్ను మరో 24 గంటల పాటు ఆబ్జర్వేషన్లో ఉంటాలని డాక్టర్లు చెప్పారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రక్తంలో కెమికల్ నమూనాలు ఉన్నదీ లేనిదీ రిపోర్టులు వచ్చాకే తెలుస్తుందని చెప్పారు. సాయంత్రం రిపోర్టులు వస్తాయని వైద్యులు చెప్పారని అన్నారు. అవి చూసిన తర్వాతే జగన్ డిశ్చార్జ్ ఎప్పుడు అనేది తేలుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications