కల్తీ నెయ్యి కథేంటో చెప్పేసిన వైవీ సుబ్బారెడ్డి..! అసలు జరిగిందిదీ..!
ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ సుప్రీంకోర్టుకు ఇంకా నివేదిక సమర్పించలేదు. అయితే తాజాగా సిట్ దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా కల్తీ నెయ్యి వాడకం ద్వారా లడ్డూ కల్తీ జరిగినట్లు ఓ నిర్ధారణకు వచ్చినట్లు వార్తలొచ్చాయి. దీని ఆధారంగా వైవీ సుబ్బారెడ్డి హయాంలో తిరుమలలో 20 కోట్ల లడ్డూల్ని కల్తీ నెయ్యితోనే తయారు చేయించారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా సిట్ విచారణ ఎదుర్కొన్న వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు.
తిరుమల లడ్డూలో 2019 నుండి 2024 వరకు నకిలీ నెయ్యి వాడారన్న వార్తల్ని టిటిడి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు నాణ్యత లేని నెయ్యితో తయారయ్యాయన్న వార్తలు తప్పుడు ప్రచారమే తప్ప నిజం కావని ఆయన తేల్చేశారు. లడ్డూపై జరుగుతున్న సిట్ విచారణకు పూర్తిగా సహకరించినట్లు వైవీ తెలిపారు. విచారణకు ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమన్నారు శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని, కానీ మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబు నాయుడే మొదటగా లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేశారని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. అప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు సీబీఐ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించిందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అదే కథను ప్రచారం చేస్తున్నారని వైవీ ఆరోపించారు. మొదట వెజిటబుల్ ఫ్యాట్ కలిపారని ఆరోపణలు చేశారని, తర్వాత జంతువుల కొవ్వు వాడారనే ఆరోపణగా మార్చారన్నారు.
దీనిపై ఎక్కడైనా ల్యాబ్ నివేదిక ఉందా? సిట్ అధికారికంగా ప్రకటించిందా? లీకుల పేరిట విషప్రచారం ఎందుకని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ముందు అనుమానాస్పదంగా గుర్తించిన నాలుగు నెయ్యి ట్యాంకర్లను తిరిగి పంపించామని అధికారులు చెప్పినప్పటికీ, ఇప్పుడు మళ్లీ నెయ్యి ఏ రకంగా తిరిగి వచ్చిందో చెప్పాలన్నారు. అలాగే తాను చైర్మన్గా ఉన్న సమయంలో రూ.326 కిలో ధరకు కొనుగోలు చేసిన నెయ్యి నకిలీదని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.

2017-18లో రూ.276, రూ.279 ధరలకు కొనుగోలు చేసిన నెయ్యి కూడా అదే లాజిక్ ప్రకారం నకిలీ అవుతుందా? అప్పటి లడ్డూలు కూడా అపవిత్రమా? అని ఆయన ప్రశ్నించారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం అపరాధమని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే కుట్ర అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మీడియా బాధ్యతగా వ్యవహరించి, తప్పుడు ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.












Click it and Unblock the Notifications