బెంగళూరులో అల్లర్లు: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు: కాల్పుల్లో 2 మృతి: రాళ్ల దాడి: 60 మంది పోలీసులకు
బెంగళూరు: ఉద్యాన నగరి బెంగళూరు ఒక్కసారిగా భగ్గుమంది. బెంగళూరు తూర్పు ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. కాంగ్రెస్ శాసన సభ్యుడి ఇంటిపై ఒక వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దాడి చేశారు. ఆయన ఇంటిని ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని సృష్టించారు. ఇంటికి నిప్పు పెట్టారు. దాడులకు పాల్పడిన వారిని అడ్డుకోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అల్లర్లు తీవ్రరూపం దాల్చాయి. వాటిని నియంత్రించడానికి రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ను విధించాల్సి వచ్చింది. అదనపు బలగాలను తరలించాల్సి వచ్చింది.
Recommended Video
కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం..
వారిని అదుపు చేయడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. దీనితో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. రాళ్ల వర్షాన్ని కురిపించారు. ప్రతిదాడులకు దిగారు. పోలీస్స్టేషన్నూ ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 60 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. బెంగళూరు కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కావల్ బైరసంద్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను మోహరింపజేశారు. డీజే హళ్లి, కేజీ హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ను విధించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు
కావల్ బైరసంద్రలో నివాసం ఉంటోన్న కాగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి ఇంటిపై రాత్రి ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వందలాది మంది మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఇంటిపై రాళ్లు రువ్వారు. ఇంటి గోడలను పగులగొట్టారు. లోనికి చొచ్చుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. అప్పటికీ తమ ఆగ్రహం చల్లారకపోవడంతో ఇంటికి నిప్పు పెట్టారు. ఫలితంగా- ఆయన నివాసం పాక్షికంగా కాలిపోయింది. ఇంటి బయట ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు.
కారణమేంటీ?
కాల్పులు జరిపేంతటి స్థాయిలో అల్లర్లు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం.. ఫేస్బుక్లో చేసిన ఓ పోస్ట్. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఆయన పోస్ట్ ఉండటమే దీనికి కారణమని పోలీసులు చెబుతున్నారు. అఖండ శ్రీనివాస మూర్తి మేనల్లుడు నవీన్ ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా ఉన్న ఈ పోస్ట్ను చూసిన వెంటనే వందలాది మంది ఈ దాడికి పాల్పడ్డారు. కావల్ బైరసంద్ర, కేజీ హళ్లి ప్రాంతాల్లో ఏం జరుగుతున్నదో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా వందలాది మంది తరలి రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
రాత్రంతా ఉద్రిక్తత..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లరి మూకులను నియంత్రించడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మొదట గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ.. వారు అదుపులోకి రాలేదు. దీనితో నేరుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డరు. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితి కాల్పుల వరకూ వెళ్లడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరింపజేశారు.

కేజీ హళ్లి పోలీస్ స్టేషన్పై దాడి
కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో ఆందోళనకారులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. కేజీ హళ్లి పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. రాళ్లు రువ్వారు. పోలీస్ స్టేషన్ బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలను ధ్వంసం చేశారు. నిప్ను పెట్టారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. వారిని తరిమి కొట్టారు. కేజీ హళ్లి, డీజే హళ్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు.
సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్..
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ అల్లర్లకు పాల్పడిన వారిలో 30 మందిని అరెస్టు చేశారు. వారిని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇప్పటిదాకా 30 మందిని అరెస్టు చేశామని, పలువురిపై కేసులు నమోదు చేసినట్లు బెంగళూరు నగర జాయింట్ కమిషనర్ (క్రైమ్) సందీప్ పాటిల్ తెలిపారు. 144 సెక్షన్ను విధించిన తరువాత పరిస్థితులు అదుపులో ఉన్నాయని తెలిపారు.












Click it and Unblock the Notifications