టెంప్ట్ అయ్యా..టేస్ట్ చేయడానికొచ్చా: పవన్ - బీజేపీ మీడియేటింగ్ ఎంపీ అడ్డంగా దొరికేసారు..!!
బెంగళూరు: ఇటీవల కురిసిన అతి భారీ వర్షం దెబ్బ నుంచి సిలికాన్ సిటీ బెంగళూరు.. ఇంకా కోలుకోవట్లేదు. సోమవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలు, టెక్ పార్కులు ఇంకా వరద ముంపులోనే ప్రధాన మార్గాల్లో రెండు నుంచి మూడడుగుల మేర వర్షపునీరు నిలిచిపోయింది. స్కూటర్లు, కార్లు రోడ్లపై రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా చాలామంది ఉద్యోగులు తమ ఆఫీసులకు వెళ్లడానికి ట్రాక్టర్లను ఆశ్రయించారు.
వరదనీటిలో సగం సిటీ..
రెండు రోజులుగా బెంగళూరులో అతి భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. రికార్డుస్థాయి వర్షపాతం అది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో ఆరంభమైన వర్షం సోమవారం తెల్లవారు జాము వరకూ ఏకధాటిగా కురిసింది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లల్లో వర్షం తీవ్రత అధికంగా కనిపించింది.
మళ్లీ వర్షం..
సోమవారం రాత్రి కూడా మళ్లీ భారీ వర్షం కురిసింది. ఇప్పటికే వరదముంపులో ఉన్న బెంగళూరియన్లకు ఇది మరింత ఇబ్బందులను తెచ్చిపెట్టింది. బలమైన ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. మ్యాన్హోల్స్ పొంగిపొర్లడంతో మురుగునీరు రోడ్లపై పోటెత్తింది. యామలూరు, బెల్లందూరు, సర్జాపుర, వైట్ఫీల్డ్, బన్నేరుఘట్ట రోడ్, బసవేశ్వర నగర, యశ్వంతపూర్, పీణ్య, లగ్గెరె, విజయనగర, రాజాజీనగర, మల్లేశ్వరం, శేషాద్రిపురంలల్లో మళ్లీ వర్షం కురిసింది.
దోసె తింటూ తేజస్వి సూర్య ఎంజాయ్..
ఈ పరిస్థితుల మధ్య భారతీయ జనతా పార్టీకి చెందిన బెంగళూరు సౌత్ లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య చుట్టూ విమర్శలు ముసురుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఓ హోటల్లో మసాలా దోసె తింటూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవ్వాళ తాను పద్మనాభనగరలోని సాత్విక్ కిచెన్కు వచ్చానని, ఇన్స్టాగ్రామ్లో దోసె ఫొటోలు చూసి..టెంప్ట్ అయ్యానని, దాన్ని టేస్ట్ చేయడానికి వచ్చానని ఆయన ఈ వీడియోలో చెప్పడం కనిపించింది.
కాంగ్రెస్ విమర్శలు..
వెన్నతో చేసిన ఈ మసాలా దోసె చాలా బాగుందని అంటూ కితాబిచ్చారు. మీరు కూడా వచ్చి దోసెను టేస్ట్ చేయాలంటూ ఆయన సూచించారు. సోమవారం నాడు అప్లోడ్ చేసిన వీడియో క్లిప్ ఇది. 41 సెకెండ్ల పాటు నిడివి ఉందీ వీడియో. ఆయన ఈ హోటల్లో మసాలా దోసె టేస్ట్ చేసే సమయానికి బెంగళూరును భారీ వర్షాలు కుమ్మేశాయి. కర్ణాటక కాంగ్రెస్ అధికార ప్రతినిధి లావణ్య బల్లాల్ దీన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తేజస్వి సూర్యపై విమర్శలు గుప్పించారు.
పవన్ కల్యాణ్ ఫ్రెండ్గా
తేజస్వి సూర్యకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్రెండ్గా గుర్తింపు ఉంది. ఇదివరకు ఆయన తన తోటి మైసూరు ఎంపీ ప్రతాప్ సింహతో కలిసి పవన్ కల్యాణ్తో సమావేశం అయ్యారు. పవన్ కల్యాణ్ను బీజేపీకి దగ్గర చేసిందే తేజస్వి సూర్య అనే గుర్తింపు ఉంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తేజస్వి సూర్య, ప్రతాప్ సింహ ఈ ముగ్గురితో కలిసి పవన్ కల్యాణ్ గతంలో జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే.