రక్తమోడిన రహదారి: క్రూయిజర్ను ఢీ కొట్టిన బస్సు.. తుక్కుతుక్కు: అయిదుమంది దుర్మరణం
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. తెల్లవారు జామున పొగమంచు అలముకోవడం కూడా ప్రమాదానికి దారి తీసి ఉంటుందని అంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టమ్ కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా బీజీ హళ్లి వద్ద ఆదివారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు క్రూయిజర్ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్ నుంచి 11 మందితో క్రూయిజర్ నంబర్ కేఏ 36 ఎన్ 0627 వాహనం బెంగళూరుకు బయలుదేరింది. మార్గమధ్యలో చిత్రదుర్గ జిల్లా బీజీ హళ్లి సమీపానికి చేరుకున్న వెంటనే ప్రమాదానికి గురైంది.

బెంగళూరు నుంచి రాయచూర్కు బయలుదేరిన బస్సు క్రూయిజర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్రూయిజర్లో ప్రయాణిస్తోన్న వారిలో నలుగురు సంఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారు. ఆరుమంది గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే మోళకాల్కూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చిత్రదుర్గలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదే సమయంలో పొగమంచు అలుముకోవడం వల్ల ఎదురుగా వస్తోన్న వాహనాల వేగాన్ని డ్రైవర్లు ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారని చెబుతున్నారు. మంచు కురుస్తోన్న సమయంలో వాహనాలను నెమ్మదిగా నడిపించడం శ్రేయస్కరమని అంటున్నారు. దీనిపై తాము జాతీయ రహదారులపై పెట్రోలింగ్ వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications