కర్ణాటక పాఠశాలల్లో కరోనా కలకలం: కరోనా బారినపడిన 22 మంది విద్యార్థులు
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు పాఠశాలను ప్రారంభిచాయి. అయితే, గత కొద్ది రోజులుగా కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. అయితే, పాఠశాలల్లోనూ పదుల సంఖ్యలో కరోనా కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, కర్ణాటకలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏకంగా 32 మంది విద్యార్థులకు కరోనా సోకింది.
కర్ణాటకలోని కొడుగు జిల్లా మడికెరిలోని జవహర్ నవోదయ విద్యాలయకు చెందిన 22 మంది బాలురు, 10 బాలికలు కరోనా బారినపడ్డారు. వీరంతా 9 నుంచి 12వ తరగతి చదువులున్న విద్యార్థులే. ఈ పాఠశాలలలో మొత్తం 270 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారం క్రితం వీరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
కాగా కరోనా బాధిత విద్యార్థుల్లో 10 మందికి లక్షణాలు కనిపంచగా, 22 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. వారందరికీ జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ కోలుకుంటున్నారని పాఠశాల ప్రిన్సిపాల్ పంకజాషణ్ మీడియాకు తెలిపారు. క్యాంపస్ మొత్తాన్ని శానిటైజ్ చేసినట్లు, ఇతర ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కర్ణాటక రాష్ట్రంలో 8వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇది ఇలావుండగా, నెల రోజుల వ్యవధిలో హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో 550 మంది విద్యార్థులు కరోనా బారినపడటం గమనార్హం. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 25 మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మొత్తం 556 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 1415 యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు, దేశంలో కరోనావైరస్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో స్వల్పంగా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 12.90,900 నమూనాలను పరీక్షించగా.. 16,156 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.42 కోట్లకు పెరిగింది. బుధవారం 733 మంది కరోనా బారినపడి మరణించారు. ఈ మరణాల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 622 ఉండటం గమనార్హం. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,56,386కు పెరిగింది. గత 24 గంటల్లో 17,095 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.36 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,60,989 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 98.20 శాతానికి పెరగ్గా, పాజిటివిటీ రేటు 0.47 శాతానికి తగ్గింది. బుధవారం 49,09,254 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ శారు. దీంతో ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారి సంఖ్య 104 కోట్లు దాటింది.