పునీత్ రాజ్కుమార్ పార్థివదేహాన్ని ముద్దాడిన ముఖ్యమంత్రి బసవరాజ్: కన్నీటితో తుది వీడ్కోలు
బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ పార్థివదేహానికి అంత్యక్రియలు మొదలయ్యాయి. కంఠీరవ స్టూడియోలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు శివరాజ్ కుమార్కు ఆడపిల్లలే కావడం వల్ల రెండో అన్న రాఘవేంద్ర రాజ్కుమార్ తనయుడు వినయ్ రాజ్కుమార్ చేతుల మీదుగా అంత్యక్రియలు సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది. దీనికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పలువురు మంత్రులు, కన్నడ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, తోటి నటీనటులు హాజరయ్యారు.
తెల్లవారు జామునే స్టేడియానికి చేరుకున్న ముఖ్యమంత్రి..
ఈ తెల్లవారు ఝామున 4:15 నిమిషాలకు బసవరాజ్ బొమ్మై.. కంఠీరవ స్టేడియానికి చేరుకున్నారు. అంతిమయాత్ర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట మంత్రి అశ్వర్థ నారాయణ కొందరు అధికారులు ఉన్నారు. అక్కడే ఉన్న శివరాజ్ కుమార్, యష్తో మాట్లాడారు. అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఇక తన తమ్ముడు కనిపించడంటూ కన్నీరు పెట్టుకున్న శివన్నను ఓదార్చారు.
పార్థివదేహానికి ఆప్యాయంగా ముద్దుపెట్టిన ముఖ్యమంత్రి
పార్థివదేహం వద్దకు చేరుకుని.. గ్లాస్ కవర్ను తొలగించాలని కోరారు. గ్లాస్ కవర్ను తీసిన వెంటనే- బసవరాజ్ బొమ్మై కన్నీటి పర్యంతం అయ్యారు. ఆప్యాయతతో పునీత్ రాజ్కుమార్ పార్థివదేహం నుదుటిని రెండుసార్లు ముద్దాడారు. ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు నిల్చుండిపోయారు. మరోసారి పునీతుడి తలను నిమిరారు. చెంపలను తడిమారు. చేతులు జోడించి పార్థివదేహానికి నమస్కరించారు. కన్నీరు పెట్టుకున్నారు. భార్య అశ్వినీ రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్కుమార్, వందిత రాజ్కుమార్.. పార్థివదేహం వద్దే కొద్దిసేపు కూర్చున్నారు.
కుటుంబ సభ్యులు తోడుగా..
ఆ వెంటనే అంతిమయాత్ర పనులు మొదలయ్యాయి. ఈ తెల్లవారు జామున 5 గంటలకే అంతిమయాత్ర మొదలైంది. ప్రభుత్వం అమర్చిన వాహనాన్ని కంఠీరవ స్టేడియానికి చేరుకుంది. ఆయన పార్థివదేహాన్ని అందులో ఉంచారు. వాహనాన్ని పూలతో అలంకరించారు. ముందువైపు పునీత్ రాజ్కుమార్ చిత్రపటాన్ని అమర్చారు. పార్థివదేహం వద్ద ఇద్దరు అన్నలు, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్, భార్య అశ్విని రేవంత్ కూర్చున్నారు. స్టేడియం వెనుక వైపు గేట్ నుంచి వాహనం కంఠీరవ స్టూడియోకు బయలుదేరింది.
ఈ మార్గాల మీదుగా..
హడ్సన్ సర్కిల్, పోలీస్ కార్నర్, కేజీ రోడ్, మైసూర్ బ్యాంక్ సర్కిల్, పోస్టాఫీస్ రోడ్, కేఆర్ సర్కిల్, శేషాద్రి రోడ్, మహారాణి ఫ్లైఓవర్, సీఐడీ జంక్షన్, చాలుక్య సర్కిల్, టీ చౌడయ్య రోడ్, విండ్సర్ మ్యానర్ జంక్షన్, బీడీఏ, పీజీ హళ్లి క్రాస్, కావేరీ జంక్షన్, భాష్యం సర్కిల్, స్యాంకీ రోడ్, మల్లేశ్వరం 18వ క్రాస్, మారెమ్మ సర్కిల్, బీహెచ్ఈఎల్ సర్వీస్ రోడ్, యశవంతపుర సర్కిల్, మారప్పన పాళ్య, గోవర్ధన టాకీస్, ఆర్ఎంసీ యార్డ్, ఎంఈఐ బస్స్టాప్, గురగొంట పాళ్య జంక్షన్, సీఎంటీఐ జంక్షన్, లారీ అసోసియేషన్ ఆఫీస్, ఎఫ్టీఐ ఆఫీస్ రోడ్ మీదుగా కంఠీరవ స్టేడియానికి చేరుకుంది.
ముఖ్యమంత్రి హాజరు..
అంతిమయాత్ర కంఠీరవ స్టూడియోకు చేరుకున్న కొద్ది సేపటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పలువురు మంత్రులు, ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. కంఠీరవ స్టూడియోలో.. తండ్రి రాజ్కుమార్ సమాధికి 125 అడుగులు, తల్లి పార్వతమ్మ సమాధికి 45 అడుగుల దూరంలో పునీత్ పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ దారి పొడవునా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.