బీజేపీ ముఖ్యమంత్రిపై అవినీతి ఆరోపణలు: విచారణకు సమాయాత్తమౌతోన్న వేళ.. స్టే ఇచ్చిన సుప్రీం
బెంగళూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఊరట లభించింది. ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును నిలిపివేయాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే స్టే జారీ చేసింది. పదేళ్ల కిందటి ఓ కేసులో యడియూరప్ప తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే మంజూరు చేసింది.
24 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలను బీఎస్ యడియూరప్ప ఎదుర్కొంటున్నారు. 2012లో ఆయనపై లోకాయుక్తలో కేసు నమోదైంది. దీన్ని సవాల్ చేస్తూ యడియూరప్ప తొలుత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ప్రొసీడింగ్స్ను నిలిపివేయాలని కోరుతూ పిటీషన్ను దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘకాలం పాటు విచారణ కొనసాగింది.

ఈ కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేసేలా కర్ణాటక హైకోర్టు ఇటీవలే ఆదేశాలు ఇచ్చింది. యడియూరప్పపై లోకాయుక్త నమోదు చేసిన కేసుల విచారణ పూర్వాపరాల ప్రక్రియను వేగవంతం చేయాలంటూ కర్ణాటక హైకోర్టు ధర్మాసనం కొద్దిరోజుల కిందటే ఆదేశాలను జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై యడియూరప్ప సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కిందటి నెల 21వ తేదీన పిటీషన్ దాఖలు చేశారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే మంజూరు చేయాలని కోరారు.
ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. వాదోపవాదాలను చేపట్టింది. యడియూరప్ప తరఫున సీనియర్ అడ్వొకేట్ కేవీ విశ్వనాథన్ తన వాదనలను వినిపించారు. 24 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడం సక్రమమేనంటూ వాదించారు. వాదోపవాదాలను ఆలకించిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంపై స్టే మంజూరు చేసింది. దీనితో యడియూరప్పకు ఊరట లభించినట్టయింది.












Click it and Unblock the Notifications