బలవంతపు శృంగారంపై కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
బెంగళూరు: వ్యభిచార గృహంలో ఓ మైనర్ బాలిక తనతో బలవంతపు శృంగారం చేశారని ఫిర్యాదు చేస్తే, ఆ విటుడిని కస్టమర్గా పరిగణించరాదని కర్నాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే... మహ్మద్ షరీఫ్ అకా ఫహీమ్ హాజీ (45) అనే వ్యక్తి తనపై విచారణ రద్దు చేయాలని కోరుతూ ఓ పిటిషన్ను కర్నాటక హైకోర్టులో దాఖలు చేశాడు. ఈ కేసును జస్టిస్ ఎం నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ చేసి పైన ఆదేశాలు జారీ చేసింది.
కేరళలోని కాసర్గోడ్కు చెందిన మహ్మద్ షరీఫ్ అకా ఫహీమ్ హాజీ మంగళూరులోని ఓ వ్యభిచార గృహాన్ని సందర్శించాడు. ఆ సమయంలో మంగళూరు పోలీసులు ఆ గృహంపై దాడి చేసిన సమయంలో మహ్మద్ షరీఫ్ పట్టుబడ్డాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ మహ్మద్ షరీఫ్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించాడు. దాడులు జరిగిన సమయంలో పట్టుబడ్డవారిని కస్టమర్లుగా పరిగణించవచ్చు అని చెప్పిన ధర్మాసనం... బాధితుల్లో మైనర్లు ఉండి నిందితులపై ఫిర్యాదు చేస్తే వారిని మాత్రం కస్టమర్లుగా పరిగణించలేమని కోర్టు అభిప్రాయపడింది.
పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది... నిందితుడు కస్టమర్ అని తనపై మానవ అక్రమ రవాణా కింద కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. దొరికింది ఒక కేసులో అయితే అనేక రకాల కేసులు ఒకే వ్యక్తిపై పోలీసులు బనాయించారని అందువల్ల కేసును కొట్టివేయాలని కోరుతూ న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకు కోర్టు అంగీకరించలేదు. పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇక ఈ కేసులో 17 ఏళ్ల బాలిక తన బంధువు వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఆమెకు సహాయం చేస్తామని నమ్మబలికిన నిందితుడు ఆమెను వ్యభిచార గృహంలోకి నెట్టేశారు. అమ్మాయి కస్టమర్లతో ఉన్న సమయంలో ఓ వీడియోను తీసి బాధితురాలిని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. తమ మాట వినకుంటే వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామంటూ బెదిరించారు. దీంతో అమ్మాయి వారు చెప్పిందల్లా చేసింది. చివరకు వారి నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మహ్మద్ షరీఫ్ పై పోక్సో చట్టంతో పాటు పలు చట్టాల కింద కేసు నమోదు చేశారు. చార్జ్షీట్ కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇది విచారణ చేసిన కోర్టు బాధితురాలు ఒకరే అయినప్పటికీ ఆమెపై పాల్పడిన నేరాలు వేర్వేరుగా ఉన్నాయని అభిప్రాయపడింది. అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించాలని డిమాండ్ చేయడం సాధ్యం కాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.