IT raids: బళ్లారిలో ఐటీ శాఖ పంజా, మంత్రి బళ్లారి శ్రీరాములు క్లారిటీ, గాలి జనార్దన్ రెడ్డి పార్టీ ఎఫెక్ట్?
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ఇదే సంవత్సరం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర్ రెడ్డి బీజేపీలోనే ఉన్నారు.
ఇక గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు బళ్లారి శ్రీరాములు కర్ణాటక ప్రభుత్వంలో రవాణా శాఖా మంత్రిగా పని చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బళ్లారిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడం కలకలం రేపింది. ఐటీ దాడులు జరిగిన కంపెనీకి బళ్లారి శ్రీరాములు ఫ్యామిలీకి సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ సందర్బంలో కర్ణాటక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బళ్లారి శ్రీరాములు క్లారిటీ ఇచ్చారు.
బళ్లారిలో ఐటీ శాఖ దాడులు
ఇటీవల కర్ణాటకలోని బళ్లారిలోని ప్రముఖ వ్యాపారవేత్త కైలాష్ వ్యాస్ కార్యాలయాలు, నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. దీనిపై కర్ణాటక రవాణా శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు స్పందిస్తూ బళ్లారిలో జరిగిన ఐటీ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
బళ్లారిలో ప్రముఖ వ్యాపారి కైలాష్ వ్యాస్తో మంత్రి శ్రీరాములు, కొంప్లి మాజీ ఎమ్మెల్యే సురేశ్బాబు సన్నిహితంగా మెలిగినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మంత్రి శ్రీరాములు క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లింక్?
తనపై వచ్చిన ఆరోపణకు తనకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక మంత్రి శ్రీరాములు కొట్టిపారేశారు. జనవరి 13న కైలాష్ వ్యాస్ కార్యాలయం, వ్యాపారాలపై, ఆయ నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కైలాష్ వ్యాస్ కు చెందిన ఇల్లు, కార్యాలయాల్లోని అన్ని పత్రాలను ఐటీ శాఖ అధికారులు పరిశీలించారు.
కైలాష్ కు కొందరు రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కైలాష్ కంపెనీలో మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే సురేష్బాబు, కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి అనిల్ లాడ్లకు వాటాలున్నాయని ఆరోపణలు వచ్చాయి.
నా భార్యకు కంపెనీలో వాటా ఉంది
బళ్లారిలో జరిగిన ఐటీ దాడులతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి శ్రీరాములు స్పష్టం చేశారు. నా భార్య కైలాష్ కంపెనీలో వాటాలు ఉన్నాయి, అది చట్టబద్ధమైనది. సమయానికి మేము మా భార్య పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాము, బళ్లారిలో జరిగిన ఐటీ దాడులకు మాకు లింక్ పెట్టి ప్రచారం చెయ్యకూడదని మంత్రి శ్రీరాములు ప్రతిపక్షాలకు సూచించారు.
మొత్తం మీద బళ్లారి జిల్లా కేంద్రంగా కొత్త రాజకీయాలు తెరమీదకు వచ్చిన సమయంలో అదే బళ్లారిలో ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడం, ఆ కంపెనీలో గాలి జనార్దన్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, మంత్రి శ్రీరాములు భార్యకు వాటాలు ఉండటం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ విషయంలోొ బీజేపీ సీనియర్ నాయకులు కాని, బళ్లారి జిల్లాకు చెందిన ప్రతిపక్ష నాయకులు కాని మాట్లాడటానికి ముందుకురాలేదు. ఏది ఏమైనా గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీతో కర్ణాటకలో రాజకీయాలు భలే రసవత్తరంగా మారిపోయాయి.