అన్నాచెల్లెలుగా అద్దె ఇంట్లో: కొస ప్రాణంతో ఆసుపత్రిలో చేర్చిన యువకుడు మాయం: యువతి మృతి
బెంగళూరు: కర్ణాటకలోని ఉడుపిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఉదంత కలకలానికి దారి తీసింది. కొస ప్రాణాలతో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తీసుకొచ్చిన యువకుడు ప్రస్తుతం కనిపించట్లేదు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభిస్తే గానీ ఆ యువతి మరణానికి గల అసలు కారణం వెలుగులోకి రాదని పోలీసులు భావిస్తున్నారు. ఆమెది సహజ మరణమా? లేక హత్యాయత్నం చేశారా? అనేది తేలాల్సి ఉందని, పోస్ట్మార్టమ్ రిపోర్ట్ అందిన తరువాతే ఏ విషయంసైనా నిర్ధారణకు వస్తామని అంటున్నారు.
అనుమానాస్పద స్థితిలో..
మృతురాలి పేరు రక్షితా నాయక్. వయస్సు 22 సంవత్సరాలు. ఉడుపి తాలూకా హిరియడ్కె పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కెహళ్లి ఆమె స్వస్థలం. శనివారం సాయంత్రం ప్రశాంత్ కుందర్ అనే యువకుడు ఆమెను ఉడుపిలోని గాంధీ జిల్లా ఆసుపత్రిలో చేర్చాడు ఓ ఆటోలో అతను రక్షితను ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆసుపత్రిలో అడ్మిట్ చేయించిన సమయంలో తన పేరును వెల్లడించాడు. అనంతరం అతను మాయం అయ్యాడు. రక్షితను ఆసుపత్రికి తీసుకుని వచ్చేటప్పటికే ఆమె కొస ప్రాణంతో ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ప్రేమవ్యవహారమే కారణమా?
రక్షితను తీసుకుని వచ్చిన ఆటో కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికోసం ఆసుపత్రి ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి రిజిస్టర్లో పొందుపరిచిన సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా అతని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రశాంత్ కుందర్ వివాహితుడని, ఇటీవలే అతనికి పెళ్లయిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అతను తరచూ రక్షితతో ఫోన్లో మాట్లాడేవాడని చెబుతున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మంగళూరులో పరిచయం..
ప్రశాంత్ స్వస్థలం.. బైండూర్ తాలూకా పరిధిలోని జడ్కల్. పెళ్లికి ముందే అతనికి రక్షితతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. హోటల్ మేనేజ్మెంట్ చదివిన అతను మంగళూరులోని ఓ హోటల్లో పనిచేసే సమయంలో అక్కడే రక్షితతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. అనంతరం వారిద్దరూ మంగళూరులోనే ఓ గదిలో కొద్దిరోజుల పాటు సహజీవనం చేశారని తెలుస్తోంది. ఆ సమయంలో తాము అన్నాచెల్లెలమని ఇంటి ఓనర్కు అబద్ధం చెప్పి, గదిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.
మరణానికి కారణం ఎవరు ?
అనంతరం ప్రశాంత్కు వివాహమైందని, అతను భార్యతో కలిసి ఉడుపిలో నివాసం ఉంటున్నట్లు తేల్చారు. పెళ్లికి ముందే ప్రశాంత్కు రక్షితతో సహజీవనం ఉన్న విషయం అతని భార్యకు తెలిసిందని, ఆమె రక్షితకు ఫోన్ చేసి దుర్భాషలాడినట్లు సమాచారం. మంగళూరులో ఉన్న రక్షిత ఉడుపికి ఎలా వచ్చింది? ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్చిన ప్రశాంత్ ఏమయ్యాడు? ఆమె ఎలా మరణించింది? దానికి కారకులు ఎవరు? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రక్షిత నాయక్ మరణానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రశాంత్ ఫోన్ స్విచాఫ్లో ఉందని, అతని కోసం గాలిస్తున్నామని అన్నారు.