Handy work: పీసీసీ చీఫ్ మెడకు మాజీమంత్రి రాసలీలు వ్యవహారం: స్క్రీన్ప్లే ఆయనదేనట
బెంగళూరు: కర్ణాటక భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, జల వనరుల శాఖ మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ టేపుల వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవ్వరూ ఊహించని పేరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం అంతా అటు తిరిగి, ఇటు తిరిగి కాంగ్రెస్ పెద్దల మెడకు చుట్టుకుంటోంది. మాజీ మంత్రి రాసలీల వ్యవహారంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ దిశగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంటుందంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
సెక్స్ సీడీ వెలుగులోకి రావడంతో రాజీనామా..
మాజీమంత్రి జార్కిహోళి.. ఓ యువతితో సెక్స్లో పాల్గొన్న సీడీ కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని నీటి ప్రాజెక్టులపై షార్ట్ఫిల్మ్ను చిత్రీకరించడానికి సహకరించాలంటూ తనను ఆశ్రయించిన ఓ యువతిని అప్పటి జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి లోబరచుకుని సెక్స్లో పాల్గొన్నట్లు సీడీ, దానికి సంబంధించిన వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన మొత్తంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
బాధితురాలి కుటుంబ సభ్యులు.. సిట్ విచారణకు
జార్కిహోళితో కలిసి ఆ సెక్స్ టేపుల్లో కనిపించిన యువతి కుటుంబం చేసిన తాజా ఆరోపణలతో ఈ ఉదంతం షాకింగ్ ట్విస్ట్ తీసుకున్నట్టయింది. తమ కుమార్తెను బలవంతంగా రమేష్ జార్కిహోళితో సెక్స్ చేయడానికి ఒప్పించారని, దీని వెనుక డీకే శివకుమార్ హస్తం ఉందంటూ ఆ యువతి తండ్రి, సోదరుడు ఆరోపించారు. తెరవెనుక ఉంటూ ఈ బాగోతాన్ని నడిపించింది డీకే శివకుమారేనంటూ వారిద్దరూ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు సిట్ వద్ద విచారణకు హాజరయ్యారు. వారి స్టేట్మెంట్ను సిట్ అధికారులు నమోదు చేశారు.
డర్టీ పాలిటిక్స్ కోసం..
డర్టీ పాలిటిక్స్ కోసం తమ కుమార్తెను బలిపశువును చేశారంటూ ఆ యువతి తండ్రి, సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. బలవంతంగా ఈ ఊబిలోకి దింపారని, తమ కుటుంబ పరువును బజారును పడేశారంటూ వాపోయారు. రమేష్ జార్కిహోళితో సెక్స్లో పాల్గొన్న అనంతరం తాను డీకే శివకుమార్ ఇంట్లో ఉన్నానంటూ తన చెల్లెలు తమకు తెలిపిందని ఆ యువతి సోదరుడు చెప్పారు. తనను సురక్షితంగా ఇంటికి పంపిస్తానని డీకే శివకుమార్ హామీ ఇచ్చారని ఆమె చెప్పారని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు, ప్రత్యర్థులపై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి తమ చెల్లెలిని వాడుకున్నారని ఆయన విమర్శించారు.
చివరిసారిగా ఫిబ్రవరి 5న
ఈ విషయంలోో తాము ఎలాంటి ఆరోపణలు గానీ, విమర్శలు గానీ చేయట్లేదని, తన కుమార్తె క్షేమంగా ఇంటికి వస్తే చాలని ఆమె తండ్రి అన్నారు. తమది షెడ్యూల్డ్ తెగల కుటుంబమని, ఈ విషయంలో పోలీసులు, మీడియా అండను తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి రాజకీయాలు చేయదలచుకోలేదని పేర్కొన్నారు. తన కుమార్తె చివరిసారిగా ఫిబ్రవరి 5వ తేదీన తమతో ఫోన్లో మాట్లాడిందని, ఇప్పటిదాకా ఆమె ఎక్కడ ఉందో?. ఎలా ఉందో తెలియరావట్లేదని అన్నారు. తమ కుమార్తె కిడ్నాప్ అయినట్లు ఇదివరకు ఆ యువతి కుటుంబం.. బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
దర్యాప్తు చేయనివ్వండి..
కాగా- ఈ వ్యవహారంపై డీకే శివకుమార్ వెంటనే స్పందించారు. తన ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆమె కుటుంబాన్ని బీజేపీ నాయకులు బెదిరించి.. ఈ స్టేట్మెంట్ ఇప్పించి ఉంటారని ఆరోపించారు. బెంగళూరుకు ఆనుకునే ఉన్న తమిళనాడులోని హోసూరులో ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఈ సెక్స్ సీడీల వ్యవహారంలో తన ప్రమేయం ఉందనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు వారివద్ద ఉన్నాయో తనకు తెలియదని అన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు.