ఆసుపత్రిలో చేరిన మున్నాభాయ్: రాత్రికి రాత్రి హుటాహుటిన: పడిపోయిన ఆక్సిజన్ లెవెల్స్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరారు. 61 సంవత్సరాల సంజయ్ దత్.. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తడంతో రాత్రికి రాత్రి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయిందని, అందుకే శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తినట్లు డాక్టర్లు తెలిపారు.
ఆసుపత్రిలో చేరిన వెంటనే సంజయ్ దత్కు కరోనా పరీక్షలను నిర్వహించారు. ఆర్టీ-పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ ద్వారా టెస్టులు చేయగా.. నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిందున మరిన్ని పరీక్షలను చేస్తున్నట్లు డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. డాక్టర్ జలీల్ పార్కర్.. కరోనా వైరస్ బాధితుడు. కిందటి నెలలో కరోనా బారిన పడిన ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. మళ్లీ విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆయన పర్యవేక్షణలోనే సంజయ్ దత్కు వైద్య చికిత్సను అందిస్తున్నారు.
ప్రస్తుతం సంజయ్ దత్ ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు లీలావతి ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వీ రవిశంకర్ తెలిపారు. కోవిడ్ పరీక్షలు నెగెటివ్ వచ్చిందని చెప్పారు. ఇతరత్రా అనారోగ్యా సంబంధించిన టెస్టులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంజయ్ దత్ ప్రస్తుతం ముంబైలోని తన నివాసంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. లాక్డౌన్ వల్ల వారు ముంబైకి రాలేకపోతున్నారు.
సంజయ్ దత్.. ప్రస్తుతం కేజీఎఫ్- చాఫ్టర్ 2లో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో సంజయ్.. అధీరా అనే క్యారెక్టర్ను పోషిస్తున్నారు. కిందటి నెల 29వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రం యూనిట్ ఫస్ట్లుక్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. శాండిల్ వుడ్ మాస్ హీరో యష్, శ్రీనిధి షెట్టి, రవీనా టండన్ ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు.
Recommended Video
తన ఆరోగ్యంపై సంజయ్ దత్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను బాగున్నానని చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని చెప్పారు. కోవిడ్ 19 పరీక్షలను నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని పేర్కొన్నారు. లీలావతి ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సహకారంతో తాను వెంటనే కోలుకుంటానని అన్నారు. ఒకట్రెండు రోజులు ఇక్కడే ఉండాల్సి రావొచ్చని అన్నారు. తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోన్న వారికి కృతజ్ఙతలు తెలిపారు.