2018లో బడ్జెట్: జైట్లీజీ! గృహోపకరణాలపై పన్ను తగ్గించి ప్రోత్సాహకాలివ్వండి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీలకు ప్రోత్సాహకాలివ్వాలని, విదేశాల నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై మరింత ఎక్కువగా కస్టమ్స్ సుంకాన్ని విధించాలని కన్స్యూమర్ డ్యూరబుల్స్, గృహోపకరణాల తయారీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అంతేకాక పన్ను రేట్లను కూడా తగ్గిస్తూ వచ్చే బడ్జెట్లో ప్రకటన చేయాలని పేర్కొంటున్నాయి. ఇంధన సామర్థ్యం కలిగిన ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీలను మరింతగా ప్రోత్సహించాలని కూడా కోరుతున్నాయి.
'రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు అనేవి విలాసవంతమైన ఉత్పత్తులు కావు. ఇలాంటి ఉత్పత్తులను వినియోగదారులకు మరింత అందుబాటు ధరల్లో అందించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయ పడుతున్నాయి. వాస్తవంగా కూడా ప్రభుత్వం ఇంధన పొదుపునకు వాడే వస్తువులపైనా పన్ను విధించిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మొబైల్ బ్యాటరీలు, విడిభాగాలపై పన్ను తగ్గింపునకు ఇలా
ఇంధన సామర్థ్యం గల ఉత్పత్తులపై 28 శాతం పన్నుకు బదులుగా 18 శాతం పన్ను విధించాలని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ అండ్ ఇవిపి కమల్ నంది అభ్యర్థించారు. 5 స్టార్, 4 స్టార్ ఉత్పత్తులపై పన్నును తగ్గించాలని, అప్పుడే ఎక్కువ మంది ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. అప్లయెన్సెస్ అండ్ కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్ (ఎసిఇ) కేటగిరీలోకి వచ్చే వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లల్లో దిగుమతి చేసుకునే వాటిపై కస్టమ్స్ సుంకం పెంచాలని, దీని వల్ల స్థానికంగా తయారీని ప్రోత్సహించే అవకాశం ఏర్పడుతుందని పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, సీఈఓ మనీష్ శర్మ పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ఎల్ఈడీ దీపాల వంటి వాటిపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని పెంచిందని, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లపైనా ప్రభుత్వం బడ్జెట్లో సుంకాన్ని పెంచుతుందని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఫినిష్డ్ ఎల్ఇడి బల్బులపై కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచారని, దీన్ని ఫినిష్డ్ లైటింగ్ ఉత్పత్తులకు కూడా ప్రభుత్వం వర్తింపజేస్తుందని భావిస్తున్నట్టు ఫిలిప్స్ లైటింగ్ ఇండియా వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమి త్ జోషి తెలిపారు. మొబైల్ ఫోన్లలో వినియోగించే బ్యాటరీ తదితర విడిభాగాలపై వసూలు చేస్తున్న 28 శాతం పన్నును 12 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని ఇంటెక్స్ కోరుతోంది.
పన్నులను హేతుబద్దీకరించాలన్న ఆతిథ్య రంగం
అంతర్జాతీయంగా పోటీ పడాలంటే దేశీయ పర్యాటక రంగానికి మరింతగా ప్రోత్సాహం అందించాలని, ఇందులో భాగంగా 2018-19 బడ్జెట్లో పన్ను రేట్లను ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఈ పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. ఉద్యోగాల కల్పన, సమ్మిళిత వృద్ధిలో కీలకమైన ఈ రంగంలో వృద్ధికి అనుకూల విధానాలు, సరైన వాతావరణ అవసరం ఉందని ఆ వర్గాలు చెబుతున్నాయి. పర్యాటకం విషయంలో థాయ్లాండ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలతో పోటీపడాలంటే అంతర్జాతీయ రేట్లకు సమాన స్థాయిలో సర్వీసులు అందించాల్సి ఉంటుందని ఆయా ఆతిథ్య సంస్థలు చెబుతున్నాయి. ఈ దేశాల్లో ఆతిథ్య రంగంపై విధించే పన్నులు తక్కువ స్థాయిలో ఉన్నాయని, ఫలితంగానే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఏర్పడుతోందని పేర్కొంటున్నారు. దేశంలోని మౌలిక రంగంలో పురోగతి చాలా ముఖ్యమని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల మరింత ఎక్కువగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి వృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుందంటున్నారు. రూ. 2,500-7,500 కేటగిరీ పరిధిలోకి వచ్చే హోటల్ గదులపై వసూలు చేస్తున్న18 శాతం జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నారు. పలు పోటీ దేశాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువని, దీన్ని హేతుబద్దీకరించడం ద్వారా మరింత పోటీ వంతంగా తయారుకావడానికి ఆస్కారం ఉంటుందన్నారు.
గ్రామీణుల వేతనాల పెరుగుదలకు ఇలా మార్గం సుగమం
ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉందని వినియోగదారు ఉత్పత్తుల కంపెనీలు భావిస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు మరింతగా విలువను జోడించే అవకాశం ఉంటుందని కంపెనీలు అంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరిగేందుకే కాక, వినియోగదారుల చేతిలో ఎక్కువ సొమ్ము ఉండేలా పన్నులను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, చిన్న వ్యాపారాలు, అందుబాటు ధరల్లో ఇళ్లు, గోదాములు, కోల్డ్ చెయిన్ సదుపాయాలను ఏర్పాటు చేసే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు కోరాయి.ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అగ్రి వాల్యూ చెయిన్ సామర్థ్యాలు పెరుగుతాయని, రైతుల ఆదాయాలను రెండింతలు పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు ఈ చర్యలు దోహదపడతాయని ఐటిసి ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.