స్వల్పంగా కోలుకున్న బిట్ కాయిన్.. ఈ ఏడాదిలో 40 శాతానికి పైగా పతనం
వాషింగ్టన్: భారీగా పతనమైన బిట్ కాయిన్ విలువ అంతర్గత ట్రేడింగ్లో 8400 డాలర్ల వద్ద ట్రేడయింది. మంగళవారం ముగిసిన ధర 5921 డాలర్లతో పోలిస్తే బుధవారం ఉదయం నుంచి క్రమంగా ఎదుగుతూ వచ్చింది. అయితే చివరకు 7,754 డాలర్ల వద్ద ముగిసింది. గరిష్ఠంగా 8503 డాలర్ల పలికింది కూడా. తద్వారా కొంత రికవరీ సాధించింది. అమెరికా, చైనా, దక్షిణ కొరియాలతోపాటు తాజాగా ఆస్ట్రేలియా కూడా బిట్ కాయిన్ లావాదేవీలను నిషేధించాలని ప్రణాళిక రచిస్తోంది.
గత ఏడాది కాలంలో డిసెంబర్కల్లా సుమారు 70 శాతం వరకు పతనమై 20 వేల డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఇప్పటివరకు 40 రోజుల్లోనే 40 శాతానికి పైగా బిట్ కాయిన్ విలువ పతనమైంది. ఇదిలా ఉంటే బుధవారం భారత్ మార్కెట్లలో దాని విలువ రూ. 6,15,000 వద్ద ట్రేడ్ కావడం గమనార్హం.
ద్రవ్యలోటు కట్టు తప్పుతుందన్న గోల్డ్మన్
వర్చువల్ కరెన్సీ ‘బిట్కాయిన్' విలువ త్వరలో సున్నాకు చేరుకుంటుందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ శాచెస్ పరిశోధన విభాగం అధిపతి స్టీవ్ స్ట్రాంగిన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలు విలువ కోల్పోవడం వల్ల దాదాపు 500 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోతుందన్నారు. ప్రస్తుత రూపంలోని డిజిటల్ కరెన్సీలు బతికి బట్టకట్టడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. వీటికి ప్రత్యామ్నాయాలు వచ్చిన వెంటనే క్రిప్టోకరెన్సీలు కనుమరుగైపోతాయని అన్నారు. క్రిప్టోకరెన్సీల అదృశ్యానికి కచ్చితంగా గడువు చెప్పలేమని స్టీవ్ పేర్కొన్నారు. అకారణంగా పెరిగిన విలువను ఇప్పుడు కోల్పోతున్నాయని అన్నారు. అన్ని రకాల క్రిప్టోకరెన్సీలు ఒకే రకంగా విలువ కోల్పోతుండటం ఆందోళనకరమన్నారు. ఇవన్నీ పూర్తిగా విలువ కోల్పోయే దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు.
భద్రతాపరమైన సవాళ్లతోనే ప్రాబ్లం
ప్రస్తుతం ఉన్న క్రిప్టోకరెన్సీలు దీర్ఘకాలం మన్నే సామర్థ్యం లేదని గోల్డ్ మన్ సాచెస్ పరిశోధన విభాగం అధిపతి స్టీవ్ స్టాంగిన్ అన్నారు. నెమ్మదిగా లావాదేవీలు నడవడం, నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉండటం, భద్రతాపరమైన సవాళ్లు పెరిగిపోవడం వీటికి సమస్యగా మారిందని అన్నారు. ఒక వేళ వీటి విలువ మళ్ల పుంజుకొని పెరిగినా గత వైభవం దక్కదని అన్నారు. ప్రస్తుతం ఉన్న బుడగ బయటపడటానికి మాత్రమే ఈ పెరుగుదల ఉపయోగపడుతుందన్నారు.
ఎన్నికల వేళ ప్రభుత్వ వ్యయం పెరిగే అవకాశం
వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19) భారత ద్రవ్య లోటు కట్టు దాటే ప్రమాదం ఉందని గోల్డ్మన్ శాచెస్ హెచ్చరించింది. ఈ కాలానికి ద్రవ్య లోటు జిడిపిలో 3.3%గా ఉండే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక వ్యవస్థ వేగంగా గాడిలో పడితేనే ఇది సాధ్యమవుతుందని గోల్డ్మన్ శాచెస్ ఒక నివేదికలో పేర్కొన్నది. లేకపోతే మాత్రం 2018-19లో ద్రవ్య లోటు జిడిపిలో 3.5 శాతానికి చేరే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం పన్నులు, పన్నేతర ఆదాయం తగ్గినా ప్రభుత్వ ఖర్చులు తగ్గే అవకాశమూ లేదని అంచనా వేసింది. ఎన్నికల సంవత్సరం కావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది.
మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం రిస్క్ తప్పనిసరి.
ముడి చమురు ధర పెరుగుదలే భారత ఆర్థిక వ్యవస్థకు పొంచి ఉన్న ప్రధాన ముప్పు అని అంచనా గోల్డ్మన్ సాచెస్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం అంతా పీపా చమురు ధర 60-65 డాలర్ల మధ్య ఉండొచ్చనే అంచనాతో ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ను రూపొందించిన విషయాన్ని గుర్తు చేసింది. చమురు బ్యారెల్ ధర ఇప్పటికే 70 డాలర్లకు ఎగబాకింది. ఇక బ్యారెల్ చమురు ధర 10 డాలర్లు పెరిగితే భారత ద్రవ్యలోటు జిడిపిలో 0.3 శాతం పెరిగే అవకాశం ఉందని గోల్డ్మన్ శాచ్ అంచనా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగకుండా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వ్రుద్ధిరేటు ఎనిమిది శాతం వద్ద స్థిర పడుతుందని అంచనా వేశారు.