2018లో బడ్జెట్: మహిళల పట్ల మొసలి కన్నీరే.. ఫ్రం మహిళా బ్యాంకు టు నిర్భయ నుంచి మహిళాబ్యాంక్ అదే స్టైల
న్యూఢిల్లీ: దేశంలో మహిళలు సగభాగం. ఆర్థిక ప్రగతిలో వారేం తీసిపోరు. కానీ వారి పట్ల సమాజం అణచివేత బడ్జెట్ ప్రతిపాదనల అమలులోనూ కొనసాగుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం బడ్జెట్ ప్రసంగాల్లో అక్కడక్కడా 'మహిళ'ల ప్రస్తావన వచ్చేది. కానీ నిర్భయపై లైంగిక దాడి తర్వాత సమూలంగా మార్పు వచ్చింది.
2013 - 14 బడ్జెట్ నుంచి ధోరణి పూర్తిగా మారిపోయింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో మహిళా సంక్షేమం, భద్రత తదితర అంశాలకు పెద్దపీట వేసినట్లు కనిపించినా.. వాటిని ఆచరణలోకి తేవడంలో మాత్రం ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
నిర్భయ ఘటన తర్వాత పరిస్థితుల్లో పూర్తిగా మార్పు
ఆర్థిక విధానాలు, నగదు కొరత వంటి సమస్యలు ఉన్నా కేంద్ర బడ్జెట్లో ద్రుష్టి పెట్టాల్సిన రంగాలు బాగానే ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బడ్జెట్ ప్రసంగాల్లో ‘మహిళ' అనే పదం ప్రస్తావన అద్భుతమైన కేస్ స్టడీగా కనిపించేంది. కానీ 2008 - 09లో అప్పటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం తొమ్మిది సార్లు మహిళల మంత్రం జపించారు. కానీ 2012 డిసెంబర్ 16న నిర్భయ అనే యువతిపై లైంగిక దాడి ఘటన దేశమంతా మహిళల భద్రతపై ద్రుష్టి సారించే పరిస్థితులు తీసుకొచ్చింది.
మోదీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో నిధుల కేటాయింపు
ఆ తర్వాత రెండు నెలలకు ఆర్థిక మంత్రి పీ చిదంబరం 2013 - 14 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో మహిళ పదాన్ని 24 సార్లు పలికారు. మహిళల గౌరవం, భద్రత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా బాధ్యతలు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ‘నిర్భయ ఫండ్' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి రూ.1000 కోట్ల కార్ఫస్ ఫండ్ కేటాయించారు. మోదీ ప్రభుత్వం కూడా 2014లో ఇదే మొత్తంలో నిధిని కార్ఫస్ ఫండ్ గా కేటాయించింది. కానీ ప్రభుత్వాలేవైనా సదరు నిధులను వినియోగించేందుకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
రూ.1000 కోట్ల ప్రాథమిక పెట్టుబడితో మహిళా బ్యాంకు సేవలు మొదలు
మహిళల గౌరవం, భద్రత, స్వతంత్రతకు మాత్రమే కేంద్రం వ్యవహారాలు పరిమితం కాలేదు. 2013 - 14లో ఆర్థిక మంత్రి చిదంబరం.. భారత దేశ చరిత్రలోనే తొలిసారి ప్రభుత్వ రంగంలో ‘మహిళా బ్యాంక్' ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దాని పేరు ‘భారతీయ మహిళా బ్యాంక్'. దాని ప్రారంభ పెట్టుబడి రూ.1000 కోట్లు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 2013 నవంబర్ నెలలో ‘భారతీయ మహిళా బ్యాంక్'ను ప్రారంభించారు.
ఎస్బీఐలో విలీనంతో మహిళా బ్యాంకు ఉనికి ముగింపు
సదరు బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఉషా అనంత సుబ్రమణ్యం నియమితులయ్యారు. ఆమె మహిళల్లో నైపుణ్యం పెంపుదలకు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఈ మహిళా బ్యాంకు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇతర బ్యాంకులతో పోటీ పడలేక పోయింది. ఫలితంగా గతేడాది భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో దాని అనుబంధ బ్యాంకులతోపాటు మహిళా బ్యాంకును కూడా మోదీ సర్కార్ విలీనం చేసేసి చేతులు దులిపేసుకున్నది. 2013 - 14 బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం మాట్లాడుతూ ‘ఇటీవలి కాలంలో జరిగిన ఘటనలు మనదేశ ఉదారవాద, ప్రగతిశీల అర్హతలను చీకటి మయం చేసేశాయి' అని నిర్భయ ఘటన నేపథ్యంగా వ్యాఖ్యలు చేశారు. మహిళల అభ్యున్నతే కేంద్రంగా ప్రభుత్వాలు చేపట్టిన పలు పథకాలను ఈ చీకటి కోణాలే వెంటాడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.