మోసాలకు వజ్రాయుధం: ‘స్కామ్’ల నిలయం జెమ్స్ అండ్ జ్యువెల్లరీ బిజినెస్

న్యూఢిల్లీ/ముంబై: వజ్రాభరణాలు అంటే శ్రీమంతుల సంపద.. హోదా ప్లస్ దర్పానికి ప్రతిబింబం. వజ్రాభరణాలకు సమాజంలోనేకాదు.. వ్యాపారంలోనూ ప్రత్యేక స్థానమే ఉంది. సంపన్నుల ఇళ్లలో మాత్రమే విరబూసే ఈ వజ్రకాంతులను.. ఇప్పుడు అక్రమార్కులు తమ చీకటి సామ్రాజ్యాల రాచబాటలకు వెలుగు రేఖలుగా వాడుకుంటున్నారు. అవును.. వజ్రాభరణాల వ్యాపారం ఇప్పుడు మోసాలకు చిరునామాగా మారిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో జరిగిన కుంభకోణం చెబుతున్నదిదే మరి.
రూ.11,400 కోట్ల ఈ కేసులో ప్రధాన నిందితులంతా కూడా వజ్రాభరణాల వ్యాపారులే. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలతోపాటు నీరవ్ భార్య అమీ, సోదరుడు నిషాల్ మోదీ తదితరులంతా అపర కుబేరులే. బ్యాంకుల్ని నమ్మించి వంచించడానికి ఈ హోదా చాలా బాగా ఉపయోగపడుతున్నది. కొందరు బ్యాంకర్లు వీరి విలాస జీవితాన్ని చూసి బొక్కబోర్లా పడుతుంటే, మరికొన్ని బ్యాంకుల్లో ఉన్నతోద్యోగులు వీరితో చేతులు కలిపి ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. వజ్రాల వ్యాపారం అనగానే భారీ లావాదేవీలే. సరిగ్గా దీని ఆసరా బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను ఇట్టే పొందుతున్నారు వజ్రాభరణాల వర్తకులు. చివరకు ప్రజల సొమ్ముతో పరాయి దేశానికి పారిపోతున్నారు.

పీఎన్బీ బాగోతాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్న ఆర్బీఐ

పీఎన్బీ బాగోతాన్ని నిశితంగా తనిఖీ చేస్తున్న ఆర్బీఐ

నీరవ్‌ మోదీ చేసిన మోసపూరిత లావాదేవీల ఫలితంగా, వివిధ నియంత్రణ సంస్థల దృష్టి ఈ వ్యాపార విభాగంపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా వజ్రాభరణాల వ్యాపారాలతో లావాదేవీలు నిర్వహించే ఆర్థిక సంస్థలు, వాటి ప్రతినిధుల తీరు ఎలా ఉందో పరిశీలిస్తున్నారు. గీతాంజలి జెమ్స్‌ వాణిజ్య కార్యకలాపాలను సెబీ పరిశీలిస్తోంది. అంతేకాక వజ్రాల వ్యాపారులు, స్టాక్‌మార్కెట్‌ బ్రోకర్ల మధ్య బంధాన్ని తనిఖీ చేస్తోంది. పీఎన్బీ స్థితిని ఆర్‌బీఐ పరిశీలిస్తుండగా, మిగిలిన బ్యాంకులు కూడా వజ్రాభరణాల వ్యాపారుల లావాదేవీలపై పరిశీలిస్తున్నాయి. మోదీ, ఆయన సన్నిహితుడైన చోక్సితో అనుబంధం కలిగిన నమోదిత కంపెనీలు, వాటి డైరెక్టర్లపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.

29 నీరవ్ మోదీ గ్రూపు ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాలు సీజ్

29 నీరవ్ మోదీ గ్రూపు ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాలు సీజ్

నాలుగు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ), ఐటీ అధికారులు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ ‌(పీఎన్బీ)కి భారీగా కుచ్చుటోపీ పెట్టిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన వ్యాపార భాగస్వామి మెహుల్‌ చోక్సీ కంపెనీలు, దుకాణాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ సోదాల్లో దాదాపు 200 డొల్ల కంపెనీలు, భారీగా బినామీ ఆస్తులను గుర్తించారు. ఇప్పటికే ఈడీ అధికారులు పీఎంఎల్‌ఏ కింద 24కి పైగా స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఈడీ అధికారులు చోక్సీకు చెందిన జ్యూయలరీ షోరూమ్స్‌, వర్క్‌షాప్స్‌తో పాటు 45 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. నీరవ్‌ మోదీకి గ్రూపునకు చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాలను ఇప్పటివరకు స్తంభింపజేసినట్లు‌ ఆదాయం పన్ను శాఖ అధికారులు తెలిపారు.

డొల్ల కంపెనీలతో బినామీ ఆస్తుల సేకరణ ఇలా

డొల్ల కంపెనీలతో బినామీ ఆస్తుల సేకరణ ఇలా

నీరవ్‌మోదీ డైరెక్టర్‌గా ఉన్న 4 నమోదిత కంపెనీలు, మరో 4 పరిమిత భాగస్వామ్య సంస్థల (ఎల్‌ఎల్‌పీ)ను పరిశీలిస్తోంది. వీటిలో ఫైర్‌స్టార్‌ డైమండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫైర్‌స్టార్‌ డైమండ్‌ ఇంటర్నేషనల్‌, రాధాషిర్‌ జువెలరీ కంపెనీ అండ్‌ జువెలరీ సొల్యూషన్స్‌ ఇంటర్నేషనల్‌ వంటి నమోదిత కంపెనీలున్నాయి. ఎల్‌ఎల్‌పీలు చూస్తే పాంచజన్య డైమండ్స్‌, నీశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, పారగాన్‌ జువెలరీ, పారగాన్‌ మర్చండైజింగ్‌ ఉన్నాయి. ఈ డొల్ల కంపెనీలను చూపి భారీగా బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఐటీ విచారణలో వెల్లడైంది. నీరవ్‌, చోక్సీ కేసుల విచారణకు ఈడీ, ఐటీ శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈడీ అధికారులు రూ.5,674కోట్ల విలువైన వజ్రాభరణాలు, ఇతర ఖరీదైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఐటీ అధికారులు చోక్సీకి చెందిన గీతాంజలి సంస్థల తొమ్మిది బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.

వజ్రాలు, రత్నాల వ్యాపారాన్ని జల్లెడ పడుతున్న సీబీఐ

వజ్రాలు, రత్నాల వ్యాపారాన్ని జల్లెడ పడుతున్న సీబీఐ

పైపై మెరుగుల్ని చూసి బ్యాంకర్లు వేల కోట్ల రుణాలిచ్చేస్తుండగా, వెతికితే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారెందరో బయటపడుతారన్నది మాత్రం నిజం. ఇప్పుడు ఆ దిశగానే దర్యాప్తు సంస్థలు అడుగులేస్తున్నాయి. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రిత వ్యవస్థ సెబీ.. డిజైనర్ జువెల్లర్ నీరవ్ మోదీతో సంబంధాలున్న స్టాక్ మార్కెట్ లిస్టింగ్ సంస్థలపై దృష్టిసారించింది. తరచుగా మనీల్యాండరింగ్ కేసుల్లో వజ్రాభరణాల వర్తకులు ఇరుక్కుంటుండటం కూడా ఈ రంగం ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం ఈ వ్యాపార లావాదేవీలను చాలా దగ్గరగా గమనిస్తుండగా, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. పీఎన్‌బీ కుంభకోణం కేసులో దాదాపు అన్ని రత్నాలు, ఆభరణాల సంస్థల వాణిజ్య లావాదేవీలను జల్లెడ పడుతున్నది. నీరవ్ మోదీ.. ఫోర్బ్స్ భారతీయ ధనవంతుల జాబితాలో 1.7 బిలియన్ డాలర్లతో ఉండగా, హాలీవుడ్ అగ్రతార కేట్ విన్స్‌లెట్‌తోపాటు బాలీవుడ్ కథానాయికలైన ప్రియాంకా చోప్రా, కరీనాకపూర్, అలియాభట్, శిల్పాశెట్టి తదితరులు నీరవ్ వద్ద వజ్రాభరణాలను చేయించుకున్నట్లు ఆయన వెబ్‌సైట్ ద్వారా తెలుస్తున్న సమాచారం. మొత్తానికి లక్షల కోట్ల లావాదేవీలకు వేదికైన వజ్రాల వైభవం.. మోసగాళ్ల చేతిలోపడి మసకబారుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+