EPF New Rules: జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ ఎంత? ఏడాదికి రెండు సార్లే..!
ప్రైవేట్, కార్పొరేట్ ఉద్యోగుల భవిష్యత్తు నిధి (PF)కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరు దశాబ్దాల కాలం నాటి పాత 'ఈపీఎఫ్ స్కీమ్ 1952' స్థానంలో.. సరికొత్త సామాజిక భద్రతా కోడ్ (Social Security Code) కింద 'ఈపీఎఫ్ స్కీమ్ 2026'ను అధికారికంగా నోటిఫై చేసింది. జూన్ 29, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా గెజెట్ ప్రచురణతో అమల్లోకి వచ్చాయి. అయితే, ఈ కొత్త స్కీమ్ వల్ల మీ పీఎఫ్ డబ్బులు కట్ అవ్వడంలో గానీ, వచ్చే వడ్డీలో గానీ ఏవైనా మార్పులు ఉంటాయా? అసలు ఉద్యోగులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ మారదు!
- కొత్త రూల్స్ వచ్చాయి కదా అని మీ జీతం నుంచి కట్ అయ్యే పీఎఫ్ అమౌంట్ ఏమీ మారదు.
- ఎప్పటిలాగే ఉద్యోగి బేసిక్ శాలరీ నుంచి 12 శాతం, కంపెనీ తరపున మరో 12 శాతం పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. కొన్ని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలకు మాత్రం ఇది 10 శాతంగానే కొనసాగుతుంది.
- కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట వేతన పరిమితి (Wage Ceiling) ప్రకారమే ఈ కటింగ్లు ఉంటాయి.
- ఒకవేళ ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో ఎక్కువ డబ్బులు దాచుకోవాలనుకుంటే.. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ద్వారా అదనంగా పొదుపు చేసుకునే వెసులుబాటును అలాగే ఉంచారు.

ఏడాదికి రెండు సార్లే పీఎఫ్ విత్డ్రా!
గతంలో అనారోగ్య కారణాల (Medical Emergency) పేరిట పీఎఫ్ ఖాతా నుంచి ఎన్నిసార్లయినా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఒక ఏడాదిలో గరిష్ఠంగా రెండు సార్లు మాత్రమే పాక్షికంగా డబ్బులు తీసుకోవడానికి అనుమతిస్తారు.
ఉదాహరణకు, మీరు ఒక సంవత్సరంలో వేరే ఏదైనా అవసరానికి పీఎఫ్ నుంచి కొంత డబ్బు తీసుకుంటే.. అదే ఏడాదిలో అనారోగ్యం కింద డబ్బులు తీసుకోవడానికి ఇంకా ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది.
- చదువు, పెళ్లి కోసం: పిల్లల ఉన్నత చదువులు లేదా పెళ్లిళ్ల కోసం ఉద్యోగి తన మొత్తం సర్వీసు కాలంలో 10 సార్లు పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు.
- ఇల్లు, స్థలం కొనుగోలు: సొంత ఇల్లు, ప్లాట్ కొనుగోలు, ఇండ్ల మరమ్మతులు లేదా హోమ్ లోన్ రీపేమెంట్ కోసం గతంలో రెండు సార్లే ఛాన్స్ ఉండేది. కానీ ఇకపై సర్వీసు మొత్తంలో 5 సార్లు ఉపసంహరించుకోవచ్చు.
25 శాతం కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) తప్పనిసరి
కొత్త స్కీమ్ ప్రకారం పీఎఫ్ ఖాతాలో 25 శాతం కనీస నిల్వను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మీరు డబ్బులు విత్డ్రా చేసుకునే రోజు నాటికి.. మీ ఖాతాలో జమ అయిన ఉద్యోగి వాటా, కంపెనీ వాటా, ఆ మొత్తంపై వచ్చిన వడ్డీ.. ఈ మూడింటినీ కలిపి చూసి, అందులో కనీసం 25 శాతం డబ్బును అకౌంట్లోనే ఉంచాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతం లోపే విత్డ్రా చేసుకోవాలి. అలాగే, పీఎఫ్ చందాదారుడిగా కనీసం ఒక ఏడాది సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాతే ఈ పాక్షిక ఉపసంహరణలకు అర్హత లభిస్తుంది.
20 మంది దాటితే చాలు.. ఈపీఎఫ్వో పరిధిలోకి!
ఇకపై 20 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ఏ సంస్థ అయినా సరే తప్పనిసరిగా ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వస్తుంది. నిబంధనల ప్రకారం యాజమాన్యం, ఉద్యోగి తమ 12 శాతం వాటాను కరెక్ట్గా జమ చేయాలి. కంపెనీ తన వాటాను ఉద్యోగి జీతం నుంచి కట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. అయితే, దేశంలో ఏదైనా జాతీయ విపత్తులు సంభవించినప్పుడు మాత్రం.. కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం, ఉద్యోగి ఇద్దరి వాటాలను మూడు నెలల పాటు తగ్గించే అధికారాన్ని కలిగి ఉంటుంది.
కంపెనీలు పీఎఫ్ కట్టకపోతే భారీ వడ్డీ బాదుడు
కంపెనీలు ఉద్యోగుల పీఎఫ్ చందాలను సకాలంలో కట్టకుండా ఆలస్యం చేస్తే ప్రభుత్వం జరిమానాలు విధిస్తుంది.
- 2 నెలల పాటు చందా కట్టకుంటే బకాయిలపై 0.25 శాతం వడ్డీ చెల్లించాలి.
- 4 నెలలు ఆలస్యం చేస్తే 0.5 శాతం వడ్డీ పడుతుంది.
- అంతకంటే ఎక్కువ కాలం పెండింగ్ పెడితే మొత్తం బకాయిలపై 1 శాతం అదనపు భారం పడుతుంది.
వడ్డీ రేట్ల లెక్కింపు.. ఉద్యోగులకు లాభం!
ఒక ఉద్యోగి తన పీఎఫ్ డబ్బులను పూర్తిగా వెనక్కి తీసుకునే సమయానికి (ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా) ప్రభుత్వం ఆ ఏడాదికి సంబంధించిన వడ్డీని అధికారికంగా ఖరారు చేయకపోతే.. దానికి ముందు ఏడాది ఉన్న వడ్డీ రేటు ప్రకారమే లెక్కించి డబ్బులు ఇచ్చేస్తారు. ఒకవేళ ఆ తర్వాత ప్రభుత్వం వడ్డీ రేటును తగ్గిస్తే.. ఆ తగ్గించిన లోటును సంస్థే భరిస్తుంది కానీ, ఉద్యోగికి ఇచ్చిన డబ్బుల నుంచి తిరిగి రికవరీ చేయరు. ఇది ఉద్యోగులకు లాభదాయకమైన నిర్ణయం.
పెళ్లయ్యాక పాత నామినీ చెల్లదు!
కొత్త రూల్స్ ప్రకారం నామినీ వివరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే అవి రద్దవుతాయి. ముఖ్యంగా, ఉద్యోగికి వివాహం కాకముందు ఇచ్చిన నామినీ వివరాలు పెళ్లయిన తర్వాత అస్సలు చెల్లుబాటు కావు. వివాహం జరిగిన వెంటనే భార్య/భర్త లేదా కుటుంబ సభ్యుల వివరాలతో కొత్త నామినీ ఫారమ్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక పెన్షన్ లెక్కింపు ఫార్ములాలో పాత పద్ధతినే ఉంచినప్పటికీ, లెక్కించే విధానంలో మాత్రం దామాషా పద్ధతిని (Pro-rata basis) తప్పనిసరి చేశారు.
పాత ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు
ఇప్పటికే పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్న పాత చందాదారులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాత 1952 స్కీమ్లో ఉన్న ఉద్యోగులందరూ ఆటోమేటిక్గా ఈ కొత్త 2026 స్కీమ్లోకి మారిపోతారు. మీ పీఎఫ్ బ్యాలెన్స్ కానీ, రిటైర్మెంట్ సేవింగ్స్ కానీ ఎక్కడికీ పోవు, అంతా సురక్షితంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి కూడా రూల్స్ ప్రకారం పీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అవుతాయి. మీ పాత UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్) నంబర్ మారదు, ఉద్యోగాలు మారినా అదే నంబర్ శాశ్వతంగా కొనసాగుతుంది.
సొంత పీఎఫ్ ట్రస్ట్లు ఉన్న కంపెనీలకు చెక్!
కొన్ని పెద్ద కంపెనీలు ప్రభుత్వ పీఎఫ్ ఆఫీస్తో సంబంధం లేకుండా తమ ఉద్యోగుల కోసం సొంతంగా పీఎఫ్ ట్రస్ట్లను (Exempted Establishments) నడుపుతుంటాయి. కొత్త స్కీమ్ ప్రకారం ఇలాంటి సొంత ట్రస్ట్లపై నిఘా మరియు నిబంధనలను ప్రభుత్వం చాలా కఠినతరం చేసింది.
- ఈ ట్రస్ట్లు అన్నీ ఇకపై తప్పనిసరిగా డిజిటల్ రికార్డులను మెయింటైన్ చేయాలి.
- ఉద్యోగులకు వారి పీఎఫ్ బ్యాలెన్స్ ఆన్లైన్లో చూసుకునే సదుపాయం కల్పించాలి.
- ఉద్యోగులు పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ (ఉపసంహరణ) పెట్టుకుంటే, నిర్దేశిత సమయంలోగా ఆన్లైన్ ద్వారానే సెటిల్ చేయాలి. ప్రతీ ఏటా పీఎఫ్ అకౌంట్ స్టేట్మెంట్లను ఉద్యోగులకు ఆన్లైన్లోనే పంపించాలి.
ఉద్యోగులు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం
ఈ కొత్త నోటిఫికేషన్ వల్ల మీ పీఎఫ్ డబ్బులు ఎంత కట్ అవుతాయి, ఎంత వడ్డీ వస్తుంది అనే విషయంలో ఎలాంటి నష్టాలు లేవు. మార్పులన్నీ కూడా కేవలం పీఎఫ్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించినవి మాత్రమే. డిజిటల్ పారదర్శకత పెంచడం, క్లెయిమ్లను త్వరగా సెటిల్ చేయడం, సొంత పీఎఫ్ ట్రస్ట్లలో అక్రమాలు జరగకుండా అడ్డుకోవడం కోసమే ప్రభుత్వం ఈ కొత్త 'ఈపీఎఫ్ స్కీమ్ 2026'ను తీసుకొచ్చింది. దీనివల్ల ఉద్యోగులకు పేపర్వర్క్ తగ్గి, పీఎఫ్ మేనేజ్మెంట్ మరింత సులభతరం కానుంది.















Click it and Unblock the Notifications