పెరిగిన టీసీఎస్ షేర్ విలువ:ఇన్వెస్టర్ల లాభాలు రూ. 30వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ షేర్ శుక్రవారం నాడు 6 శాతానికి పైగా పుంజుకొంది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది. అంతేకాదు 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరడానికి టీసీఎస్ సిద్దంగా ఉంది. 2017-18 ఏడాది 4వ క్వార్టర్ ఫలితాల్లో అంచనాలను మించి రాణించడంతో వాటాదారులకు 1:1 బోనస్ బొనాంజాతో నిమిషాల్లో ఇన్వెస్టర్ల సంపద రూ. 30 వేల కోట్లకు పుంజుకొంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో తొలిసారి రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ను సాధించిన దిగ్గజ సంస్థగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన టీసీఎస్ తాజాగా ఈ సరికొత్త రికార్డును సాధించింది. టీసీఎస్ షేర్ రూ. 3400 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడంతో కంపెనీ మార్కెట్ విలువ తొలిసారి రూ. 6.5 లక్షల కోట్లకు చేరింది..
ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువలో దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి కంపెనీ టీసీఎస్. అంతేకాదు ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్తో (38 బిలియన్ డాలర్లు) పోలిస్తే ఇది రెండున్నరెట్లు ఎక్కువ.
కాగా క్యూ4(జనవరి-మార్చి)లో త్రైమాసిక ప్రాతిపదికన టీసీఎస్ నికర లాభం 5.7 శాతం పెరిగి రూ. 6904 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రూ. 32,075 కోట్లకు చేరింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి బోర్డు అనుమతించింది. దీంతోపాటు వాటాదారులకు షేరుకి రూ. 29 తుది డివిడెండ్ను ప్రకటించింది.