నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు.. బ్యాంకింగ్, రియాల్టీ షేర్లు పతనం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 99.36 పాయింట్ల మేర పడిపోయి 34,346.39 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీ 28.30 పాయింట్ల మేర నష్టపోయి 10,554.30 వద్ద ముగిసింది.
మంగళవారం ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లు పతనమై నష్టాలను మూటగట్టుకున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ నావల్, ఒబెరాయ్ రియాల్టీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి.
సింఫనీ, ఆస్ట్రల్ పాలీ టెక్నిక్, వాబ్కో ఇండియా, అవెన్యూ సూపర్మార్ట్స్, ఇండియన్ హోటల్స్ కంపెనీ షేర్లు లాభాలబాట పట్టాయి. మంగళవారం ఉదయం తొలుత ట్రేడింగ్ ప్రారంభం కాగానే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సూచీలు కొంత దూకుడును ప్రదర్శించాయి.
అయితే మదుపరులలో ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. కొద్దిసేపటికే ఆవిరైపోయింది. పీఎన్బీ కుంభకోణం నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోలుదారుల నుంచి మద్దతు కరవయింది. దాంతో మార్కెట్లు 'నెగటివ్' పంథాలో నడిచి చివరకు నష్టాల్లోనే ముగిశాయి.