విమానాల రద్దు: భారీగా పెరిగిన ఛార్జీలు, ఏమైందంటే?
లక్నో: విమాన ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. ఇండిగో, గో ఎయిర్ సంస్థలు కీలక మార్గాల్లో సుమారు 76 విమానాలను రద్దు చేయడంతో ఒక్కసారిగా విమాన ఛార్జీలకు రెక్కలొచ్చాయి. కొన్ని కీలక మార్గాల్లో ప్రయాణించే ప్రయాణీకులపై తీవ్రమైన ప్రభావం పడుతోంది.
ప్రధాన విమానాయాన సంస్థలు ప్రధాన మార్గాల్లో విమాన సర్వీసులను రద్దు చేసుకొన్నాయి. దేశీయ విమానాయాన సంస్థకు చెందిన ఇండిగో 65, గో ఎయిర్ సంస్థ సుమారు 11 విమానాలను రద్దు చేసింది. దీంతో కీలక మార్గాల్లో ప్రయాణాలు చేసే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా రద్దయిన విమానాలకు చెందిన ప్రయాణీకులు సదరు టికెట్లను కాన్సిల్ చేసుకోవడం, తిరిగి టికెట్లను బుక్ చేసుకోవడం తప్పనిసరి. దీంతో కొన్ని ప్రధానమైన రూట్లలో 10శాతం చార్జీలు పెరిగాయి. దీంతో వేలాది మంది విమానప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
విమానాలు రద్దు చేయడం కొన్ని కీలక మార్గాల్లో అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణీకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ప్రతినిధి శరత్ దలాల్ తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైల మధ్య వన్వే టికెట్లు రూ.12వేల ధర పలికినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనావేశారు.
రానున్న రోజుల్లో విమాన ఛార్జీల్లో సుమారు దాదాపు 5-10శాతం పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. టైర్ -2 విమానాల ఛార్జీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మంగళవారం ఢిల్లీ, భువనేశ్వర్ మధ్య చివరి నిమిషంలో బుక్ చేసుకున్న టికెట్ చార్జీలు రూ .7వేలు- రూ .29వేలు ఉండగా, బుధవారం నాటి ధరలు రూ.9వేలనుంచి -రూ.27వేలుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై రూట్లో కూడా బుధవారం దాదాపు రూ. 5వేలు-24వేల మధ్య పలికాయి.
ముంబయి, కోల్కతా పుణె, జైపూర్, శ్రీనగర్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, డెహ్రాడూన్, అమృత్సర్, బెంగళూరు, హైదరాబాద్ రూట్లలో విమానాలను ఇండిగో రద్దు చేసింది.మరోవైపు ప్రయాణీకుల ఇబ్బందులకు తొలగించేందుకు చర్యలు తీసుకంటామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. కాన్సిలేషన్ చార్జీలు రద్దు, రీషెడ్యూలింగ్ లాంటి చర్యలు చేపట్టుతున్నటు విమానాయాన సంస్థలు ప్రకటించాయి .
ప్రాట్ అండ్ విట్నీఇంజిన్ల వైఫల్యాల కారణంగా ఎ320 నియో(న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిలిపివేస్తోంది. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ ఏ320 నియో విమానం ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్ మొరాయించింది.