2018లో బడ్జెట్: పర్మినెంట్ ఉద్యోగాల్లేవ్.. అంతా కాంట్రాక్టే.. కార్మికశాఖ స్వరం మారుతోంది
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తమ ప్రభుత్వం ఉపాధి కల్పన కోసం చర్యలు తీసుకుంటున్నదని ఘంటాపథంగా చెబుతారు. 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు ఏటా కోటి మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అడుగడుగునా హోరెత్తించారు మోదీ. కానీ ఆచరణలో గత యూపీఏ ప్రభుత్వం కంటే చాలా వెనుకబడి ఉన్నారు. ఇక 2016 నవంబర్ ఎనిమిదో తేదీన అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, గతేడాది జూలై నుంచి అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లడానికి ఒకరోజు ముందు ప్రైవేట్ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ విధానాల వల్లే యువతకు ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారే గానీ ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో నిర్దిష్టంగా చెప్పలేకపోయారు. సదరు చానెల్ ప్రతినిధి ఉద్యోగాల కల్పనపై ప్రశ్నిస్తే.. ఈ ఏడాది 70 లక్షల మంది 18 - 25 ఏళ్లలోపు వారు 'ఈపీఎఫ్' ఖాతాల్లో పేరు నమోదు చేసుకున్నారని సెలవిచ్చారు. అంటే యువత తమ కెరీర్ కోసం అహర్నిశలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకున్నా ఏలినా వారి క్రుషి అని చెప్పుకుంటారా? అని రాజకీయ విశ్లేషకులు సందేహిస్తున్నారు.
కాకపోతే బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇది చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఉపాధి అవకాశాల కల్పనపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏమైనా చర్యలు తీసుకుంటారా? అని యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. కాకపోతే కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ మాత్రం.. నిరుద్యోగ యువత కోసం కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించాలని చెబుతోంది. అంటే పలు సంస్థలు కూడా తమ సంస్థల్లో ఉద్యోగాలు కేవలం నిర్దిష్ట కాలం మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉద్యోగాల కల్పనకు విధాన రూపకల్పనకు వచ్చేనెల తొమ్మిదో తేదీలోగా సూచనలివ్వాలని దేశ ప్రజలను కోరింది.
రోజూ పెరుగుతున్న నిరుద్యోగులు 30 వేలు
ఇక దేశ జనాభాలో 35 ఏళ్ల లోపు యువత 65 శాతం. 25 ఏళ్లలోపు యువత 50 శాతం. ఈ వయసు వారి ముఖ్య లక్ష్యం జీవితంలో స్థిరపడటం. మంచి ఉద్యోగం లేక ఉపాధి చూసుకోవడం. కానీ ఆ స్థాయిలో ఉపాధి అందుతోందా అంటే లేదనే గణాంకాలు చెబుతున్నాయి. భారత్లో రోజూ వెలుగు చూసే నిరుద్యోగుల సంఖ్య సుమారు ముప్ఫై వేలు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, దేశ జనాభాలో 15-29 ఏళ్ల మధ్య వారిలో 30 శాతం చదువు, ఉద్యోగం, ఎటువంటి శిక్షణ లేకుండా ఉన్నవారే. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శిక్షణనిచ్చిన వారిలో 12 శాతం మాత్రమే ఉద్యోగాలను సాధించారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (డబ్ల్యూఎల్వో) లెక్కల ప్రకారం క్రమంగా నిరుద్యోగిత 3.5 శాతం పెరుగడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. 2014లో 15 - 24 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న వారు 10 నుంచి 10.7 శాతానికి పెరిగారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల కల్పన దిశగా ఈ బడ్జెట్లో శభాష్ అనిపించే ప్రతిపాదనలు ఉంటాయనే అందరూ ఊహిస్తున్నారు. ఉపాధి కల్పించే రంగాలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వరాలు కురిపిస్తారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఉద్యోగాలు పెరిగే అవకాశం లేదు. దీనిలో భాగంగా పర్మినెంట్ ఉద్యోగులకు ఇచ్చే వేతనం, సౌకర్యాలను కల్పించేలా కాంట్రాక్ట్ ఉద్యోగాల నియమకానికి ఏర్పాట్లు చేయడం. ఇప్పటికే ఈ విధానం ప్రయోగాత్మకంగా వస్త్ర పరిశ్రమలో అమలు చేస్తున్నారు. దీనిని మిగిలిన రంగాలకూ విస్తరించాలి. దీనివల్ల పరిశ్రమలకు అనుభవం, నైపుణ్యం ఉన్న వారు లభిస్తారు. కొత్త పెట్టుబడులు వచ్చి పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
టెక్నాలజీ కంపెనీలను ప్రోత్సహిస్తే మార్పు సాధ్యమేనా?
భారత్లో ప్రస్తుత పరిస్థితులను బట్టి ఏటా కోటి ఉద్యోగాలకు పైగా అవసరం. గతంలో ఉద్యోగ కల్పనకు ప్రభుత్వాలు అనుసరించిన పంథా ఇప్పుడు ఫలితాలిచ్చే పరిస్థితి లేదు. గతంలో పెట్టబడిదారీ వ్యవస్థలో ఉద్యోగ కల్పన జరిగేది. గనులు, వస్తు తయారీ, విద్యుత్, బ్యాంకింగ్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభించేవి. ఇప్పుడంతా ఆటోమేషన్. దాంతో ఆయా రంగాల్లో ఉద్యోగ కల్పన బాగా తగ్గి... ఐటీ, టెలికాం, రిటైల్, ఔషధరంగం, ఈ - కామర్స్లో ఉద్యోగాలు భారీగా పెరిగాయి. దేశంలో డిజిటల్ సునామీ ప్రారంభంతో సంప్రదాయ ఉద్యోగాలు మాయమైపోతున్నాయి. పర్యవేక్షణ ఉద్యోగాలూ వీటిల్లో ఉండటం విశేషం. ప్రపంచంలో అత్యంత విలువైన తొలి ఐదు కంపెనీలు టెక్ రంగానికి చెందినవే. వీటన్నిటి విలువ 3.5 లక్షల కోట్ల డాలర్లు. భారత్ స్టాక్మార్కెట్లోని మొత్తం కంపెనీల విలువే 2.3లక్షల కోట్ల డాలర్లు. దీనిని బట్టే టెక్ కంపెనీల పట్టు అర్థమవుతోంది. సృజనాత్మకతే పెట్టుబడిగా సాగే టెక్ కంపెనీల అవసరం భారత్కు చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తే పరిస్థితిలో మార్పు రావచ్చు. వీటన్నిటికీ అత్యుత్తమ స్థాయి ఇంజినీరింగ్ ప్రమాణాలు అవసరం. భారత్లో ఇప్పుడున్న విద్యావ్యవస్థలో వీటిని అందుకోవడం చాలా కష్టం. ఐఐటీ, ఎన్ఐటీ వంటి కొన్ని సంస్థలు మాత్రం దీనికి మినహాయింపు. ఈ నేపథ్యంలో ప్రపంచ స్థాయి విద్యావ్యవస్థను భారత్లో అమలు పరచాలి. మార్కెట్ అవసరాలకు తగిన విధంగా కోర్సులు డిజైన్ చేయాలి. భారత్లోని అత్యున్నత విద్యాసంస్థలను వేగంగా విస్తరించాలి. ఉన్నత విద్యా బోధకుల కొరత తీరేలా వాస్తవిక అవసరాలపై పరిశోధన పత్రాలను సమర్పించిన వారిని బోధన రంగంలోకి ఆహ్వానించాలి. స్కిల్ డెవలప్మెంట్, విదేశీ భాషలు నేర్చుకోవడంపై ఈ తరం దృష్టి నిలిపేలా ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు అందించాలి. ‘స్కిల్ ఇండియా' కింద 2020 నాటికి 50 కోట్ల మంది నైపుణ్యాలకు సానబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు జరిపే అవకాశం ఉంది.
కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ స్టార్టప్లకు ప్రోత్సాహకాలివ్వాలి
ఇంటర్నెట్ పురోగతితో వివిధ రంగాల్లో సృజనాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం వీడియో, విజువల్స్, వాయిస్ రంగాల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని చిన్న పట్టణాల్లో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మరోపక్క గూగుల్, రైల్టెల్ కలిసి టైర్-2, టైర్-3 నగరాల్లోని రైల్వే స్టేషన్లలోనూ వైఫైలను అందుబాటులోకి తెస్తున్నాయి. యూట్యూబ్ మార్కెటింగ్ ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారింది. తమ ప్రతిభా పాటవాలను చాటిచెప్పుకోవడానికి యూ - ట్యూబ్ను ప్రజలు వేదికగా చేసుకుంటున్నారు. దీంతో వంటలు, మేకప్, రిపేర్, ఆన్లైన్ క్లాస్లు, హాస్యం, పర్యటకం ఇలా అన్ని రంగాలకు చెందిన వారు యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్నారు. భారత్లో ఈ ట్రెండ్ ఇప్పడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రజలకు ఈ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, శిక్షణ కల్పిస్తే మరిన్ని ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సరళమైన వ్యాపార విధానాలు గల దేశాల్లో భారత్ స్థానం 100. ఇది భారత్ చట్టాల్లోని సంక్లిష్టతను తెలియజేస్తోంది. కచ్చితంగా ఈ అంశంలో దేశం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేలా పాలసీలను సరళతరం చేయాలి. 98.6 శాతం స్టార్టప్లు 10 మంది కంటే తక్కువ ఉద్యోగులను కలిగి ఉన్నాయి. ఈ చిరు పారిశ్రామికులు తమకు ఉపాధి చూసుకుంటూ మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారిని ప్రోత్సహించాలి. వ్యాపార అనుమతులు, నిర్వహణ విధానాలు, రుణ సౌకర్యాలు, పన్ను మినహాయింపు వంటి వాటిలో సానుకూల మార్పులు జరగాలి. ఐఐటీ, ఐఐఎంల ఆధ్వర్యంలో స్టార్టప్లను ప్రారంభించేలా ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్న సూచనలు ఎంతో కాలం నుంచి ఉన్నాయి. అది ఈ బడ్జెట్లో సాకారం అవుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నది. ఇక కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ మీద స్టార్టప్లు పెట్టే వారికి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరం.