నాలుగున్నరేళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లు పెంచిన ఆర్బీఐ
ముంబై: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతూ పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) బుధవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గత నాలుగున్నరేళ్లలో కీలక వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా జనవరి 2014లో రెపో రేటును 8శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచడం జరిగింది.
కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక పరపతి విధాన సమావేశం జూన్ 4 నుంచి మూడు రోజులపాటు జరిగింది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచాలని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.తాజా నిర్ణయంతో ప్రస్తుతం 6శాతంగా ఉన్న రెపో రేటు 6.25శాతానికి పెరిగింది.
రివర్స్ రెపో రేటు 5.75శాతం నుంచి 6శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయ చమురు ధరలు పెరుగుతుండటమే కీలక వడ్డీరేట్ల పెంపునకు కారణంగా తెలుస్తోంది. దేశ జీడీపీ వృద్ధిరేటు 2018-19ఆర్థిక సంవత్సరానికి 7.4గా ఉండనుందని ఆర్బీఐ పేర్కొంది. కాగా, తదుపరి సమీక్ష జులై 31, ఆగస్టు 1న జరగనుంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ప్రథమార్థంలో 4.8-4.9శాతం మధ్య, ద్వితీయార్థంలో 47.7శాతం నమోదు కావొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4శాతం వృద్ధిరేటు నమోదు కావొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.