గీతాంజలీ జెమ్స్కు ఎన్ఎస్ఈ జరిమానా.. మరో 23 సంస్థలకు కూడా
ముంబై: గీతాంజలి జెమ్స్పై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్ఎస్ఈ) జరిమానా విధించింది. వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించనందుకు ఈ చర్య తీసుకుంది. ఈ సంస్థతో పాటు మరో 23 కంపెనీలకు కూడా అపరాధ రుసుములు విధించింది. ఒక వేళ ఇప్పటికీ నిబంధనల ప్రకారం ఆర్థిక ఫలితాలను ప్రకటించకపోతే సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. సెంట్రల్ డిపాజటరీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ (సీడీఎస్ఎల్) ఈ నిర్ణయానికి సంబంధించిన లేఖలను వాటా దారులకు పంపించనున్నది.
షేర్ హోల్డింగ్ ప్యాట్రన్, ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించని సంస్థల వాటాదారులకు లేఖలు పంపే విధానాన్ని ప్రారంభించినట్లు ఎన్ఎస్ఈ ప్రతినిధి తెలిపారు. 'వాటాదారులకు విజ్ఞప్తి, మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీలు డిసెంబర్ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించలేదు' అని ఆ లేఖలో పేర్కొంటారు.
గీతాంజలితోపాటు మరో 23 సంస్థలపై ఎన్ఎస్ఈ కొరడా
నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు ప్రతి మూడునెలలకు ఆర్థిక ఫలితాలను ప్రకటించాలి. మూడోనెల పూర్తి అయిన 45 రోజుల్లోపు వీటిని వెల్లడించాల్సి ఉంటుంది. దీనిని ఉల్లంఘిస్తే సెబీ, స్టాక్ ఎక్స్చేంజీలు జరిమానాలు విధించ వచ్చు. ఎన్ఎస్ఈ జరిమానా విధించిన కంపెనీల్లో ఏబీజీ షిప్ యార్డ్, యామ్టెక్ ఆటో, డి.ఎస్. కులకర్ణి డెవలపర్స్, భారతీ డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రా వంటి కంపెనీలు ఉన్నాయి.
ఆటుపోట్లతో సాగిన మార్కెట్ కదలికలు
మరోవైపు స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నాటి రిలీఫ్ ర్యాలీ మంగళవారానికి బ్రేక్ పడింది. రోజంతా ఆటుపోట్లతో సాగిన సెన్సెక్స్ చివరికి 61.16 పాయింట్ల నష్టంతో 33856.78 దగ్గర ముగిసింది. నిఫ్టీ మాత్రం 5.45 పాయింట్ల స్వల్ప లాభంతో 10426.85 దగ్గర ముగిసింది. కొన్ని బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ, టిసిఎస్ షేర్లలో అమ్మకాలు సెన్సెక్స్ను కుంగదీశాయి. ఐటీ, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ, పిఎస్యూ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, మెటల్, బ్యాంకెక్స్, ఇన్ఫ్రా, పవర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లు మాత్ర మే స్వల్ప లాభాలతో ముగిశాయి. సోమవారం వెలువడిన రిటైల్ ద్రవ్యోల్బణం, ఐఐపి గణాంకాలు మార్కెట్లో సెంటిమెంట్ను పెంచాయి. ఐటి, కొన్ని బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం సెంటిమెంట్ను దెబ్బతీసిందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చి హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
పీవోకు హెచ్డీఎఫ్సీ ఏఎంసీ
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఒఐ) షేర్లు మంగళవారం చురుగ్గా ట్రేడయ్యాయి. స్టాండ్ బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ద్వారా బ్యాంక్ ఇప్పటికే రూ.7,000 కోట్లు వసూలు చేసుకుందన్న వార్తలతో ఈ స్టాక్ భారీ లాభాలతో ట్రేడైంది. బిఎస్ఇలో ఒక దశలో 14.98 శాతం లాభంతో రూ.109.35ను తాకింది. చివరకు 7.47 శాతం లాభంతో రూ.102.20 దగ్గర ముగిసింది. హెచ్డీఎఫ్సీ ఫిన్కార్ఫ్కు అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ ఐపీవోకు రానుంది. ఈ విషయాన్ని హెచ్డీఎఫ్సీ ఫినాన్స్ కార్ఫ్ మంగళవారం తెలిపింది. ఈ ఐపీవోలో 4శాతం వాటాను విక్రయిస్తారు. ఈ ఐపీవోలో85,92,970 వాటాలను విక్రయిస్తారు. షేర్ ధర రూ.5 ఉండవచ్చని భావిస్తున్నారు. ఐపీవో ద్వారా వచ్చే మొత్తం 4.08శాతం పెయిడప్ క్యాపిటల్కు సమానం. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ మాతృసంస్థ హెచ్డీఎఫ్సీ ఈ ఐపీవోకు ఆమోదముద్రవేసింది. ఈ ఐపీవో అనంతరం సంస్థలో హెచ్డీఎఫ్సీ ఫిన్కార్ప్కు ఇంకా 50.01 శాతం వాటా ఉంటుంది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీ గత ఏడాది రూ.550 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
ఇలా టిసిఎస్ షేర్లు ఢమాల్
ప్రభుత్వ రంగ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) పబ్లిక్ ఇష్యూ శుక్రవారం ప్రారంభమవుతోంది. మొత్తం రూ.4,230 కోట్ల సమీకరణ కోసం ఈక్విటీలో 20.20 శాతం షేర్లను కంపెనీ ఈ ఇష్యూ ద్వారా విక్రయిస్తోంది. ఒక్కో షేరు ధరను రూ.1,215-1,240గా నిర్ణయించారు. పెట్టుబడుల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.75,000 కోట్లు సమీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా హెచ్ఎఎల్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 20న హెచ్ఎఎల్ ఇష్యూ ముగుస్తుంది. టిసిఎస్ ఈక్విటీలో తనకున్న వాటా నుంచి టాటా సన్స్ దాదాపు రూ.9,000 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. దీంతో టీసీఎస్ షేర్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. ఈ అమ్మకాల హోరుతో బిఎస్ఈలో టిసిఎస్ షేర్లు 5.22 శాతం నష్టంతో రూ.2,892.45 దగ్గర ముగిసింది. దీంతో మంగళవారం ఒక్క రోజే టీసీఎస్ వాటాదారులు రూ.30,513 కోట్లు నష్టపోయారు. బిఎస్ఇ, ఎన్ఎస్ఇల్లో మొత్తం 421.98 లక్షల టిసిఎస్ షేర్లు ట్రేడయ్యాయి.