పీఎన్బీ మోసం ఎఫెక్ట్: ట్రేడ్ ఫైనాన్స్ పైనే ఆర్బీఐ ‘నిఘా నేత్రం’
ముంబై: దేశీయ బ్యాంకింగ్ రంగం వరుస కుంభకోణాలతో కుదేలవడంతో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలతో లావాదేవీలు సాగించే ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల్లో ప్రత్యేక ఆడిటింగ్కు శ్రీకారం చుట్టింది. మరీ ముఖ్యంగా ట్రేడ్ ఫైనాన్సింగ్ కార్యకలాపాలు నిర్వహించే బ్యాంకులు, అవి జారీ చేస్తున్న అండర్ టేకింగ్ లెటర్ (ఎల్వోయూ)లపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆర్బీఐ నిర్ణయించుకున్నది.
ట్రేడ్ ఫైనాన్స్పైనే ఆర్బీఐ దృష్టి పెట్టడానికి కారణం ఉంది. ఇటీవల కాలంలో ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారుల తాకిడి అత్యధికంగా ట్రేడ్ఫైనాన్స్ విభాగానికే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ జారీ చేసిన ఎల్వోయూల జాబితాతోపాటు, ముందస్తు రుణ అంగీకార పరిమితులు, మార్జిన్ కోసం ఉంచిన నగదు నిల్వలు, గ్యారంటీల వివరాలను అందజేయాలని దేశంలోని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.

బయటపడ్డ పీఎన్బీ మోసంతో భారత్ బ్యాంకింగ్లో అక్రమాలు ఇలా బహిర్గతం
ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన సహచరుల ప్రమేయంతో పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో జరిగిన భారీ కుంభకోణంతో పాటు దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన అనేక మోసాలు ట్రేడ్ ఫైనాన్స్కు సంబంధించినవే కావడం గమనార్హం. నీరవ్ మోదీ, ఆయన వ్యాపార భాగస్వాములు పీఎన్బీ సిబ్బందితో కుమ్మక్కై తప్పుడు అండర్ టేకింగ్ లెటర్లతో రూ.12,646 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడటంతో ట్రేడ్ ఫైనాన్స్తో పాటు అండర్ టేకింగ్ లెటర్లు, క్రెడిట్ లెటర్ (ఎల్సీ)లపై ఆర్బీఐ ప్రత్యేక పరిశీలన జరపాల్సిన అవసరం ఏర్పడిందని ఆ వర్గాలు తెలిపాయి.

ఓరియంటల్ బ్యాంకులో ద్వారకాదాస్ సేథ్ ఇలా మోసం
నీరవ్మోదీ కూడా ట్రేడ్ ఫైనాన్స్ కిందే ఎల్వోయూలను పొందారు. అందుకు భవిష్యత్లో మరిన్ని మోసాలు జరగకుండా దీనిపై దృష్టిపెట్టింది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైబడిన అన్ని మొండి బకాయిలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీరవ్ మోదీ వ్యవహారం తర్వాత ఢిల్లీ వజ్రాల వ్యాపారి ద్వారకా దాస్ సేథ్ కూడా ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నుంచి వివిధ మార్గాల ద్వారా రూ.389.85 కోట్ల రుణం పొంది ఎగవేతకు పాల్పడ్డాడు. ట్రేడ్ ఫైనాన్స్ వ్యవస్థను వాడుకొని బ్యాంక్ ఆఫ్ బరోడాను ఢిల్లీ వ్యాపారులు కొందరు రూ.6,000 కోట్లకు మోసం చేశారు.

పర్యవేక్షణాలోపంతో ఇలా వేల కోట్ల రూపాయలు మోసగాళ్ల పాటు
అత్యాశ, వ్యవస్థీకృత లోపాలు, అవినీతి, నిర్లక్ష్యం, ఉదాసీనత, నమ్మక ద్రోహం, చట్టాల్లోని లోపాలు వెరసి వేల కోట్ల రూపాయల సొమ్ము మోసగాళ్ల పాలైంది. వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ, అలసత్వం లేని సిబ్బంది బ్యాంకింగ్ వ్యవస్థకు అత్యవసరమని పంజాబ్నేషనల్ బ్యాంక్ కుంభకోణం చెబుతోంది. ఆర్బీఐ ఈ పాఠాలను వెంటనే నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అసలు ట్రేడ్ఫైనాన్స్ను వాడుకొని నీరవ్మోదీ, మెహుల్ ఛోక్సీ భారత బ్యాంకింగ్ వ్యవస్థతో ఒక ఆటాడుకున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఎక్కువ మొత్తాలకు ఇలా ఎల్వోయూల రెన్యూవల్స్
ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెందిన బ్రాడీహౌస్ బ్రాంచి నీరవ్ మోదీ, ఛోక్సీలకు ఎల్వోయూలు జారీ చేశాయి. వీటి ఆధారంగా వారు ఇతర బ్యాంకుల విదేశీ శాఖ నుంచి రుణాలను విదేశీ కరెన్సీ రూపంలో పొందే అవకాశం లభించింది. ఎల్వోయూలు ఇచ్చినందుకు బ్యాంకు ఎటువంటి హామీలను పెట్టుకోలేదు. దీంతో పాటు ఈ ఎల్వోయూలు జారీ చేసిన విషయాన్ని కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్)లో నమోదు చేయలేదు. మరోపక్క క్యాష్ ట్రాన్స్ఫర్ మెసేజింగ్ వ్యవస్థ (స్విఫ్ట్)ను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ను ఏకీకృతం చేశారు. ఈ ఎల్వోయూలు సీబీఎస్లో నమోదు చేయకపోవడంతో వాటిని ఎక్కువ మొత్తాలకు రెన్యూవల్ చేశారు. పైపెచ్చు రుణాల చలామణి కోసం ఈ విధంగా చేశారు. పరిస్థితి తిరగబడటంతో విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ ఎగవేతకు పాల్పడ్డారు.

ఎస్బీఐ నుంచి యూబీఐ వరకు ఐదు బ్యాంకులకు విస్తరణ
నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీల ద్వయం పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)కి రూ.12,600 కోట్లకు మోసం పెట్టేసింది. ఇందులో అలహాబాద్ బ్యాంక్ రూ.2,400 కోట్లు ఉండగా, యూకో బ్యాంకుకు రూ. 2,635 కోట్లు, ఎస్బీఐకి రూ.1,360 కోట్లు, యాక్సిస్ బ్యాంక్కు రూ.200 కోట్లు, యూబీఐకి రూ.1,920 కోట్ల మేరకు శఠగోపం పెట్టేశాయి.

ఎస్ఎఫ్ఐఓతోపాటు సీబీఐ దర్యాప్తు ప్రారంభం
పీఎన్బీ అధికారులతో కుమ్మక్కై నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ రూ.281 కోట్లను పొందినట్లు గత జనవరిలో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిని ఫిబ్రవరిలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి బదిలీ చేశారు. అదే సమయంలో మొత్తం కుంభకోణం విలువ రూ.12 వేల కోట్లు అని పీఎన్బీ తేల్చింది. దీంతో సీబీఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై రూ.50కోట్లు దాటిన మొండి బకాయిల్లో అనుమానాస్పద కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నిర్ణయించింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్గేషన్ (ఎప్ఎఫ్ఐఓ) అధికారులు కూడా 110 కంపెనీలపై దర్యాప్తు ప్రారంభించారు. వీటిలో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల 10 కంపెనీలు ఉన్నాయి.

నీరవ్ మోదీ కంపెనీల అడిటింగ్ కోసం బెల్జియం సంస్థ నియామకం
నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలకు జెమ్స్ అండ్ జ్యూవెలరీ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరి వల్ల వజ్రాల పరిశ్రమ పరపతి దెబ్బతిన్నట్లు పేర్కొన్నది. నీరవ్ మోదీ ఐదు కంపెనీలపై ఫోరెన్సిక్ ఆడిట్ను నిర్వహించేందుకు బెల్జియంకు చెందిన బీడీవో సంస్థను నియమించింది. ఈ కంపెనీల్లో ఫైర్స్టార్ డైమండ్, ఫైర్స్టార్ ఇంటర్నేషనల్, సోలార్ ఎక్స్పోర్ట్, స్టెల్లార్ డైమండ్స్, డైమండ్ ఆర్ యూఎస్ ఉన్నాయి.

యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల సీఈఓలకు ఇలా తాఖీదులు
మరోపక్క ఐటీ శాఖ నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 105 ఖాతాలు, 29 ఆస్తులను సీజ్ చేసింది. దీంతోపాటు నల్లధన వ్యతిరేక చట్టం కింద కేసులు నమోదు చేసింది. మెహుల్ చౌక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్పై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. తర్వాత వివిధ పీఎన్బీ శాఖల్లో తనిఖీలు చేపట్టింది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్బీ సీఈవోలకు ఎస్ఎఫ్ఐవో నోటీసులు జారీ చేసింది. తర్వాత వీరిని విచారించింది.

పాస్ పోర్టుల రద్దు పట్ల బ్యాంకు, దర్యాప్తు అధికారులపై ఎదురుదాడి
భారత్కు తిరిగి రావాలని సీబీఐ పంపిన ఈ -మెయిల్స్కు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ స్పందించారు. తాము భారత్ రావడం అసాధ్యమని తేల్చిచెప్పారు. ఇప్పటి వరకు వారు ఎక్కడ ఉన్నారో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గుర్తించలేకపోయారు. వీరి పాస్పోర్టులను విదేశాంగశాఖ సస్పెండ్ చేసింది. తన పాస్పోర్టు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని మెహుల్ చోక్సీ ఎదురు దాడికి దిగారు. ముందుగా సంగతి బయట పెట్టి రుణాలు చెల్లించే వీలు లేకుండా చేసేశారని పీఎన్బీపై నీరవ్ మోదీ ఆరోపించారు.

విలాసవంతమైన వాహనాలు, షేర్లు కూడా జప్తు
ఇప్పటి వరకు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన రూ.5,674 కోట్ల ఆస్తులను సీజ్ చేసింది. వీటిల్లో నీరవ్ మోదీ ఇంట్లో బంగారం, వజ్రాలు, నగలు ఉన్నాయి. దీంతో పాటు నీరవ్ మోదీ ఇల్లు, ఆఫీస్ను కూడా స్వాధీనం చేసుకుంది. తొమ్మిది విలాసవంతమైన వాహనాలను స్వాధీనం చేసుకున్నది. నీరవ్కు చెందిన రూ.7.8 కోట్లు విలువైన వాటాలను, మెహుల్ ఛోక్సీకి చెందిన రూ.86.72 కోట్ల వాటాలను సీజ్ చేసింది.

విపుల్ అంబానీ సహా పలువురు సిబ్బంది అరెస్ట్
ఈ కేసులో ఇప్పటి వరకు సీబీఐ అధికారులు 20 మందిని అరెస్టు చేశారు. వీరిలో పీఎన్బీ జీఎం రాజేష్ జిందాల్, రిటైర్డ్ డిప్యూటీ జీఎం గోకుల్నాథ్ షెట్టి, ఆడిటర్ ఎంకే శర్మలనూ అరెస్ట్ చేశారు. నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ కంపెనీలకు చెందిన 10 మంది ఉద్యోగులతోపాటు పీఎన్బీ ఉద్యోగులు, ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు విపుల్ అంబానీ తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు.

ఏప్రిల్ నెలాఖరులోగా బ్యాంకుల ‘స్విఫ్ట్'ను
అనుసంధానించాలని ఆర్బీఐ ఆదేశం
నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 60 కంపెనీల ఆస్తులపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆంక్షలు విధించింది. వీటిలో నీరవ్ మోదీ , మెహుల్ ఛోక్సీలకు లిమిటెడ్ లైబల్టీ పార్టనర్షిప్ సంస్థలు(ఎల్ఎల్పీ) ఉన్నాయి. ఇదిలా ఉండగా స్విఫ్ట్ వ్యవస్థను కోర్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సంస్థతో ఏప్రిల్ 30వ తేదీ లోపు అనుసంధానించాలని ఆర్బీఐ ఆదేశించింది. మరోపక్క ఈ కేసును ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. అప్పటికల్లా అన్ని కేసుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని ఈడీకి సూచించింది.

ఆర్థిక వ్యవస్థ స్తంభించకుండా చర్యలు తీసుకోవద్దన్న రాజేశ్ షా
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఇటీవల వెలుగులోకి వచ్చిన రూ.13 వేల కోట్ల భారీ కుంభకోణం దేశ ఆర్థిక వ్యవస్థలో భయోత్పాతానికి దారితీయకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తగిన చర్యలు చేపట్టాలని భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) విజ్ఞప్తి చేసింది. పీఎన్బీ కుంభకోణం భయాందోళనలకు, దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయేందుకు దారితీయకుండా తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని ఫిక్కీ అధ్యక్షుడు రాశేష్ షా స్పష్టం చేశారు.

పీఎన్బీ కుంభకోణంపై దర్యాప్తు భయోత్పాతానికి తావివ్వొద్దన్న రాజేశ్ షా
బ్యాంకింగ్ వ్యవస్థ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకునే విషయమై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వు బ్యాంకుకు లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రమేయంతో పీఎన్బీలో జరిగిన భారీ కుంభకోణం దేశ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తుందా? అని ప్రశ్నించగా, అటువంటి భయాందోళనల నుంచి మనం బయటపడాలని, ఈ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తు భయోత్పాతానికి దారితీయకూడదని ఆయన అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications