తప్పంతా ఆర్బీఐదే: ఆడిటింగ్లో వైఫల్యం.. దాని ఫలితమే పీఎన్బీ స్కాం
న్యూఢిల్లీ: బ్యాంకుల నియంత్రణ సంస్థ భారతీయ రిజర్వు బ్యాంక్ (పీఎన్బీ) ఆడిట్లోపాల వల్లే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో (పీఎన్బీ) అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అన్నారు. పీఎన్బీలో మోసం సమయంలో ఆర్బీఐ అడిట్ సక్రమంగా లేనందువల్లే భారీ కుంభకోణం జరిగిందని అన్నారు.
మోసాలను అరికట్టేందుకు మరింత పటిష్ఠమైన ఆడిటింగ్ వ్యవస్థ అమల్లోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు. సాధారణంగా బ్యాంకుల నియంత్రణ చర్యలను ఆర్బీఐ పర్యవేక్షిస్తూ ఉంటుందని.. ఏవైనా విధానపరమైన లోపాలు జరిగినప్పుడు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని తెలిపారు.
గైడ్లైన్స్ అమలు చేసే బాధ్యత ఆర్బీఐదే
ఆర్బీఐ గతంలో ఉన్న కాలావధి వ్యవస్థ నుంచి 'రిస్క్బేస్డ్' ఆడిట్ వ్యవస్థకు మారినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఆర్థిక ముప్పు కలుగుతోందన్న స్ఫురణ కలిగినప్పుడు రిస్క్బేస్డ్ ఆడిట్ను ఆర్బీఐ నిర్వహిస్తూ వస్తోందన్నారు. ఆర్థిక ముప్పును నిర్ణయించేలా కొన్ని పారామితులను నిర్వచించాలని వివరించారు. వీటి ఆధారంగా ఆర్బీఐ ఆడిటింగ్కు దిగేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నియంత్రణ సంస్థ లా ఆర్బీఐ బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించిందని వివరించారు. అయితే అవి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్బీఐదేనని అన్నారు. అయితే ఆర్బీఐ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రతి శాఖలో ఏమి జరుగుతోందన్న విషయాన్ని పర్యవేక్షించలేదని తెలిపారు. పీఎన్బీలో స్కామ్ వెలుగులోకి రాగానే ఆ బ్యాంక్లో వ్యవస్థ సరిగ్గా లేదని.. మిగతా బ్యాంకులు నూటికి నూరు శాతం సక్రమంగా ఉన్నాయన్నట్లు కాదని అన్నారు. ఆర్బీఐ చేపట్టిన ఆడిట్ విధానం సక్రమంగా ఉన్నట్టు కాదని అన్నారు.
అనుమానిత లావాదేవీలపై జూన్ లోగా పరిశీలనలు పూర్తి
పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం భారీగా నగదు డిపాజిట్లు చేసినవారికి ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా జారీ చేస్తున్న నోటీసులను మే 31లోగా పూర్తిచేయాలని ఆదాయం పన్ను శాఖను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది. పాన్ కార్డులు లేకుండా జరిగిన అధిక, అనుమానిత లావాదేవీల పరిశీలనల్నీ జూన్ 30లోగా ముగించాలని స్పష్టం చేసింది.
యాక్సిస్ బ్యాంకుకు ఇలా ఆర్బీఐ షాక్
పసిడి దిగుమతులు చేయకుండా యాక్సిస్ బ్యాంక్పై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిషేధం విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి, వెండి దిగుమతులు చేసుకోరాదని బ్యాంకుల జాబితా నుంచి తొలగించింది. యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా మరోసారి శిఖా శర్మను నియమించే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బోర్డును ఆర్బీఐ కోరినట్లు వార్తలు వెలువడిన ఒకరోజులోనే తాజా ఆంక్షలు విధించడం గమనార్హం. పసిడి, వెండి దిగుమతులు చేసుకోవడానికి అనుమతిస్తూ ఆర్బీఐ విడుదల చేసిన 16 బ్యాంకుల జాబితాలో యాక్సిస్ బ్యాంక్ పేరు లేదు. గత ఏడాది లైసెన్సు పొందిన 19 అగ్రగామి బ్యాంకుల జాబితాలో యాక్సిస్ బ్యాంక్ ఒకటి. దీనిపై స్పందించేందుకు ఆర్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధులు నిరాకరించారు.
అమెరికా సంస్థ చేతిలోకి వొడాఫోన్ ఇండియా టవర్లు
టెలికాం మౌలిక వసతుల కంపెనీ అమెరికన్ టవర్ కార్పొరేషన్(ఏటీసీ) తన అనుబంధ సంస్థ ద్వారా వొడాఫోన్ ఇండియాకు చెందిన రూ.3850 కోట్ల మొబైల్ టవర్ల కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఏటీసీ భారత అనుబంధ సంస్థ ఏటీసీ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ లావాదేవీని పూర్తి చేసింది. అంతక్రితం ప్రకటించినట్లుగా 10,200 కమ్యూనికేషన్ సైట్లను ఈ మేరకు నగదును చెల్లించి సొంతం చేసుకున్నామని ఏటీసీ ఒక ప్రకటనలో వివరించింది. భవిష్యత్లో భారత్లో 4జీ సేవల విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఈ టవర్ల వ్యాపారం తమకు ప్రయోజనాలను చేకూర్చుతుందని ఏటీసీ ఆసియా విభాగం ప్రెసిడెంట్ అమిత్ శర్మ పేర్కొన్నారు.