క్రిప్టో కుబేరుల్లో లార్సెన్ టాప్.. అది ఒక పోంజీ స్కీం వంటిదన్న ప్రపంచ బ్యాంక్
న్యూయార్క్/ వాషింగ్టన్: క్రిప్టోకరెన్సీలో అత్యంత సంపన్నుల్లో రిపుల్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ నిలిచారు. 7.5- 8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.48750-52,000 కోట్లు)తో రిపుల్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ లార్సెన్ అగ్రస్థానంలో నిలిచారు. బ్లాక్చైన్ సాంకేతిక ఆధారంగా సీక్రెట్ ఆల్గారిథమ్స్ను ఉపయోగించి 'తవ్వితీసేవే' ఈ క్రిప్టోకరెన్సీలు.
వీటిపై ఎవరికీ నియంత్రణ ఉండదు. ఇటీవలి కాలంలో భారీ లాభాలతో ఇవి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ఒక 'పోంజీ' (చిట్ ఫండ్) స్కీమ్ వంటిదని ప్రపంచ బ్యాంక్ అధినేత జిమ్ యాంగ్ కింగ్ పేర్కొన్నారు.
ప్రపంచంలో అత్యంత సాధారణ క్రిప్టోకరెన్సీలుగా పేరు తెచ్చుకున్న బిట్కాయిన్, ఎథేరియం, ఎక్స్ఆర్పీ లాంటి కరెన్సీల సగటు విలువ 2017లో గణనీయంగా 14,409 శాతం పెరిగిందని ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1,500 రకాల క్రిప్టోకరెన్సీలు చెలామణిలో ఉన్నాయని, 2017 ఆరంభం నుంచి వీటి మొత్తం విలువ 31 రెట్లు పెరిగి 55 వేల కోట్ల డాలర్ల (రూ.35,75,000 కోట్ల)కు చేరుకున్నదని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది.

ఫోర్బ్స్ - 400 అమెరికా కుబేరుల సగటు వయస్సు 67
క్రిప్టోకరెన్సీ పరంగా అత్యంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో జోసఫ్ లుబిన్ (నికర సంపద 100 కోట్ల డాలర్ల నుంచి 500 కోట్ల డాలర్లు), చాంగ్పెంగ్ జావో (110 కోట్ల నుంచి 200 కోట్ల డాలర్లు), కామెరాన్ అండ్ టేలర్ వింక్లెవోస్ (90 కోట్ల నుంచి 110 కోట్ల డాలర్లు), మాథ్యూ మెల్లెన్ (90 కోట్ల నుంచి 110 కోట్ల డాలర్లు)తో పాటు బ్రియాన్ ఆర్మ్స్ట్రాంగ్, మాథ్యూ రాస్జెక్, ఆంథోనీ డీ ఇయోరియో, బ్రాక్ పియర్స్, మైఖేల్ నొవోగ్రట్జ్, బ్రెండన్ బల్మర్, డాన్ లారీమర్, వాలెరీ వవిలోవ్, చార్లెస్ హాస్కిన్సన్, బ్రాడ్ గార్లింగ్హౌస్, బ్యారీ సిల్బెర్ట్, విటాలిక్ బుటెరిన్, టిమ్ డార్పర్, సంగ్ చి-హ్యుంగ్ తదితరులు ఉన్నారని ఆ పత్రిక ప్రకటించింది.
కనీసం 35 కోట్ల డాలర్ల సంపదను కలిగి ఉన్న సంపన్నులతో ఈ జాబితాను రూపొందించామని, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వ్యక్తుల సగటు వయసు 42 ఏళ్లుగా ఉన్నదని ఫోర్బ్స్ వివరించింది. పోర్బ్స్ - 400 అమెరికా కుబేరుల సగటు వయస్సు 67 అని పేర్కొన్నది. అయితే భారతదేశంలో క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్) చట్టబద్ధం కాదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బిట్ కాయిన్ చలామణీని జాగ్రత్తగా పరిశీలించాల్సిందే
వర్చువల్ కరెన్సీ స్కీం ఒక పోంజీ స్కీం: ప్రపంచ బ్యాంక్
వర్చువల్ కరెన్సీలు కేవలం పోంజీ (చిట్ ఫండ్) స్కీం వంటివేనని ప్రపంచ బ్యాంక్ చైర్మన్ జిమ్ యాంగ్ కిమ్ వ్యాఖ్యానించారు. బిట్ కాయిన్ వంటి వాణి, వాటి చట్టబద్ధతపై ఇటీవల గణనీయంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాము వాటి గమనం గురించి పరిశీలిస్తున్నామన్నారు. దీనిపై స్పష్టంగా ఎలా ద్రుష్టి సారించాలన్న అంశంపై ఇంకా నిర్ధారణకు రాలేదని వాషింగ్టన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చెప్పారు. దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉన్నదన్నారు.
రుణ దాతలు గానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీతో లావాదేవీలు నిర్వహిస్తున్న వారు గానీ ఈ వేదికను ఎలా సురక్షితంగా వాడుకుని నిధులు పంపిణీ చేస్తున్నారన్న సంగతి గమనించాల్సి ఉన్నదన్నారు. అభివ్రుద్ధి చెందుతున్న వర్ధమాన దేశాల్లో అవినీతిని అంతమొందించేందుకు నగదు చెల్లింపులు ఆన్ లైన్లో చేయాల్సి రావడంతో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఉండవచ్చునని అంచనా వేశారు. 2017లో దూసుకెళ్లిన క్రిప్టో కరెన్సీ విలువ.. వాటిల్లో ఒకటైన బిట్ కాయిన్ విలువ గత ఏడాది డిసెంబర్ నెలలోనే మూడింట రెండొంతులు పతనమైన సంగతి తెలిసిందే.
అయితే క్రిప్టో కరెన్సీ టెక్నాలజీకి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలనే మార్చివేసే సత్తా ఉన్నదని, దాని లావాదేవీల్లో అనిశ్చితి వల్ల హవాలా లావాదేవీలు, ఇతర నేరాలు జోరుగా సాగే అవకాశం ఉన్నదని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి డిజిటల్ కరెన్సీలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అంతరాయం కలిగించే అవకాశం ఉన్నదని ప్రపంచ బ్యాంక్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ చీఫ్ అగస్టీన్ కార్స్టెన్స్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications