ఆధునిక మోసాల పితామహుడు మెహతా: ఆదానీకి అత్యంత ఆప్తుడు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)లో వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ రూ. 11,400 కోట్ల కుంభకోణం కొన్నాళ్ల నాటి విన్సమ్ డైమండ్ గ్రూప్ కుంభకోణాన్ని తలపిస్తోందంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఈ రెండు సందర్భాల్లోనూ ఎక్కువగా దెబ్బతిన్నదీ ఇదే పీఎన్బీ కావడం ఆసక్తికర పరిణామం. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తర్వాత విన్సమ్ డైమండ్ గ్రూప్ కుంభకోణాన్ని రెండో అతి పెద్ద బ్యాంకింగ్ స్కామ్గా దీన్ని లెక్కేస్తారు.
ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడైన కార్పొరేట్ యజమాని గౌతమ్ ఆదానీకి జతిన్ మెహతా సమీప బంధువు కూడా. జతిన్ మెహతా కుమారుడు సూరజ్, గౌతం ఆదాని సోదరుడు వినోద్ శాంతిలాల్ ఆదానీ కూతురు కృపను 2012లో పెండ్లాడారు మరి.
కారణాలేమైనా వేలకోట్లు కొల్లగొడుతూ భారత బ్యాంకింగ్ వ్యవస్థను పీకల్లోతు ముంచడంలో వజ్రాల వ్యాపారుల తర్వాతే మిగతావారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నానాటికి కార్పొరేట్ రుణ ఎగవేతదారులతోపాటు విదేశాలకు పారిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నది. వారి అప్పగింతల కోసం సంబంధిత దేశాలతో సంప్రదింపులతోనే దర్యాప్తు సంస్థల విధులు సరిపోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గుణపాఠం నేర్చుకోకుండా వజ్ర వ్యాపారుల సేవలోనే బ్యాంకర్లు
పీఎన్బీకి రూ.11,400 కోట్ల మేరకు కుచ్చుటోపీ పెట్టిన మేనమామ - మేనల్లుడు మెహుల్ చోక్సీ - నీరవ్ మోదీ నుంచి నాటి జతిన్ మెహతా రూ.6800 కోట్లకు ముంచిన ఘనాపాటిలే. గతానుభవాల నుంచి గుణపాఠం నేర్చుకోని బ్యాంకర్లు ఎప్పటికప్పుడు వజ్రాల వ్యాపారులకు దోచిపెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో నీరవ్ మోదీ మోసం పుట్టుకొచ్చినట్లు కనిపిస్తున్నా.. ఆధునిక మోసాలకు పితామహుడు జతిన్ మెహతా అన్న విమర్శలు ఉన్నాయి.
2013లోనే వెలుగులోకి వచ్చిన జతిన్ నిర్వాకం
విన్సమ్ గ్రూప్ ప్రమోటర్ జతిన్ మెహతా కూడా భారీ కార్పొరేట్ డిఫాల్టర్లలో ఒకరు. 2013లో ఈ కుంభకోణం బైటపడింది. అప్పట్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సారథ్యంలోని కన్సార్షియం నుంచి విన్సమ్ డైమండ్ గ్రూప్నకు చెందిన విన్సమ్ డైమండ్ అండ్ జ్యుయలర్స్, ఫరెవర్ ప్రెషియస్ డైమండ్ అండ్ జ్యుయలరీ, సూరజ్ డైమండ్స్ సంస్థలు రూ. 6,800 కోట్లు రుణం తీసుకున్నాయి. ఇందులో పీఎన్బీనే అత్యధికంగా రూ. 1,800 కోట్లు ఇచ్చింది.
విన్సమ్ గ్రూపునకు స్టాండ్ బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్
మోదీ కేసులో లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తరహాలోనే బ్యాంకులు .. విన్సమ్ గ్రూప్ కంపెనీలకు అంతర్జాతీయ బులియన్ బ్యాంకులు బంగారం సరఫరా చేసేందుకు వీలుగా ‘స్టాండ్బై లెటర్స్ ఆఫ్ క్రెడిట్' ఇచ్చాయి. వీటి ప్రకారం బంగారం కొనుగోళ్లకు సంబంధించి ఒకవేళ విన్సమ్ గ్రూప్ సంస్థలు గానీ నిధులు చెల్లించడంలో విఫలమైతే.. ఆ మొత్తాలను బులియన్ బ్యాంకులకు ఈ బ్యాంకులు కట్టాల్సి ఉంటుంది.
ఎగవేతకు జతిన్ మెహతా పక్కాగా ప్రణాళిక
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రికార్డుల ప్రకారం నీరవ్ మోదీ, లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా తర్వాత ఉన్నది మెహతానే. 2011లో విన్సమ్ రుణాల ప్రక్రియ మొదలవగా, మొత్తం 15 బ్యాంకుల నుంచి రూ.6,800 కోట్లు మెహతా తీసుకున్నాడు. వీటిని ఎగ్గొట్టేందుకు పక్కా ప్రణాళికనూ రూపొందించుకున్న మెహతా 2012 ఆగస్టు 13వ తేదీన దానికి శ్రీకారం చుట్టారు. తొలుత తమ గ్రూప్లోని ఫరెవర్ ప్రీషియస్ డైమండ్ అండ్ జువెల్లరీ నుంచి వైదొలిగారు. ఇదే ఏడాది నవంబర్ 9న విన్సమ్ డైమండ్స్ అండ్ జువెల్లరీకీ గుడ్బై చెప్పారు.
2013లోనే మెహతాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన బ్యాంకర్లు
విన్సమ్ గ్రూప్.. కొన్నాళ్లకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని కొందరు కస్టమర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్లో ఒక బిలియన్ డాలర్లు నష్టపోవడంతో తమకు రావాల్సిన బాకీలు కట్టలేదన్న కారణంతో బులియన్ బ్యాంకులకు కట్టడం మానేసింది. తమకు అప్పులిచ్చిన బ్యాంకులకు మేమూ చెల్లించలేకపోతున్నామని జతిన్ మెహతా ప్రకటించారు. విదేశాలకు పారిపోయారు. 2013లో డిఫాల్ట్లు మొదలయ్యాయి. అదే ఏడాది విన్సమ్ డైమండ్ గ్రూప్ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా బ్యాంకులు ప్రకటించాయి.
కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నీరుగారిన విచారణ
గమ్మత్తేమిటంటే 2014 ప్రారంభంలోనే సీబీఐని బ్యాంకు అధికారులు సంప్రదించారు. నాటి నుంచి ప్రారంభమైన సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది. కానీ అదే ఏడాది కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసు విచారణను నీరుగార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాటి నుంచి మూడేళ్లుగా కేసు విచారణ జరిపిన సీబీఐ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు.
2014 నుంచి భారత్కు రాని మెహతా కుటుంబం
చివరకు 2017 ఏప్రిల్ ఐదో తేదీన విన్సమ్ డైమండ్స్, ఇతర సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014 నుంచి మెహతా కుటుంబసభ్యులు ఇప్పటిదాకా భారత్ రాలేదు. కొందరు సెయింట్ కిట్స్ పౌరసత్వం తీసుకున్నారని.. సింగపూర్, దుబాయ్లలో సెటిల్ అయిపోయినట్లు సమాచారం.
మొండి బకాయిల సమస్య పరిష్కారానికి 2015లో పీఎంఓకు లేఖ
బ్యాంకింగ్ రంగంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న మొండి బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్, డైమండ్ రంగాల్లోని కీలక వ్యక్తులు ఈ మొండి బకాయిల వెనుక ఉన్నారని గుర్తించారు. దీనిపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి కార్యాలయాని (పీఎంవో)కి లేఖ 2015 ప్రారంభంలోనే కూడా రాశారు. పలు కేసుల్లో విచారణలకు ఎదురవుతున్న అడ్డంకులనూ అందులో వివరించారు.
రాజన్ సూచనను పట్టించుకోని బ్యాంకర్లు, కేంద్రం
విదేశాలకు బ్యాంకుల సొమ్ము దొంగచాటుగా తరలిపోతున్నదని, ఆయా దర్యాప్తు సంస్థలతో బ్యాంకర్లు కలిసి పనిచేయాలని కూడా రఘురామ్ రాజన్ సూచించారు. రాజన్ హెచ్చరికలను అటు ప్రభుత్వంగానీ, ఇటు బ్యాంకులుగానీ సీరియస్గా తీసుకోలేదన్న నిజాన్ని తాజా నీరవ్, కొఠారి కుంభకోణాలు రుజువు చేస్తున్నాయి.
రఘురామ్ రాజన్ సూచనను పెడచెవిన బెట్టిన కేంద్రం
నాడు సీబీఐ ఆధ్వర్యంలో వివిధ మొండి బకాయిలు కేసుల విచారణను అనుసరించి రూ.17,500 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని రాజన్ పేర్కొన్నారు. ఎవరూ తప్పించుకోలేరన్న కఠిన హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. 2015 జూన్లో బ్యాంకింగ్ వ్యవస్థపై ఒత్తిళ్ల పరిష్కారం అన్న అంశంపై జరిగిన సదస్సులో రాజన్ మాట్లాడుతూ అతిపెద్ద మొండి బకాయిల కేసులను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) తీవ్రంగా పరిశీలిస్తున్నదని ధ్రువీకరించారు. కానీ ఆచరణలో మాత్రం ప్రయోజనం శూన్యం.