5 పైసలకే బిర్యానీ: హోటల్ వద్ద ఎగబడ్డ జనం, కరోనా నిబంధనలు గాలికి, షటర్ మూసేశారు!
చెన్నై: బిర్యానీ అంటే ఎవరు ఇష్టపడరు. ఆఫర్లు పెడితే ఎగబడి తింటారు. ఏకంగా 5 పైసలకే నోరూరించే బిర్యానీ అంటే ఇక ఎవరు వదిలిపెడతారు. అందుకే ఆ ఆఫర్ ప్రకటించిన రెస్టారెంట్ ముందు భారీగా క్యూకట్టారు. కరోనావైరస్ మహమ్మారి ఉందనే విషయాన్ని కూడా వారు మర్చిపోయి గుంపులుగా చేరారు. ఈ ఘటన తమిళనాడులోని మదురైలో చోటు చేసుకుంది.
5 సైసల నాణేనికి ఉచిత బిర్యానీ అంటూ ప్రకటన
మదురైలో సుకన్య బిర్యానీ స్టాల్ ప్రారంభోత్సవం సందర్భంగా 5 పైసల నాణెం ఇచ్చినవారికి ఉచితంగా బిర్యానీ అంటూ ప్రకటించింది యాజమాన్యం. ప్రచారం కూడా బాగా జరుగుతుందని భావించింది. అయితే, 5 పైసల నాణేలు ఎంత మంది దగ్గర ఉంటాయి.. పదుల సంఖ్యలో వస్తారని హోటల్ యాజమాన్యం అనుకుంటే.. పెద్ద సంఖ్యలో వచ్చేసరికి ఖంగుతింది.
బిర్యానీ కోసం హోటల్ వద్ద ఎగబడ్డ జనం
ఈ బిర్యానీ సెంటర్ ప్రకటన ఫోన్లలోనూ ప్రచారం బాగా జరగడంతో వందలాది మంది 5 పైసల నాణేలతో ఆ హోటల్ ముందు బారులు తీరారు. ఒకేసారి 300 మందికిపైగా కస్టమర్లు హోటల్ ముందు చేరుకున్నారు. అయితే, చాలా మంది కరోనా నిబంధనలు పాటించలేదు. కొందరు మాస్కులు ధరించలేదు. ఇక భౌతిక దూరం అనే మాటకు ఇక్కడ చోటే లేకుండా పోయింది.
జనం తాకిడికి హోటల్ షటర్ మూసేశారు..
ఊహించని విధంగా కష్టమర్లు రావడంతో కొంత మందికి బిర్యానీ పంపిణీ చేసిన హోటల్ యాజమాన్యం చివరకు షటర్ మూసేసింది. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ చాలా మంది మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా కనిపించారు.
5 పైసల నాణేలు తీసుకొచ్చినా.. బిర్యానీ ఇవ్వలేదంటూ జనం గగ్గోలు..
అయితే, హోటల్ వద్దకు 5 పైసలతో చేరుకున్న వినియోగదారులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము హోటల్ ప్రకటించిన విధంగా 5 పైసల నాణేలు తీసుకొచ్చినప్పటికీ.. హోటల్ యాజమాన్యం మాత్రం తమకు బిర్యానీ ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. అయితే, కరోనా నిబంధనలు పాటించని కారణంగా పోలీసులు ఆ గంపును స్వల్ప లాఠీ ఛార్జీ చేసి చెదరగొట్టారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని, థర్డ్ వేవ్ కూడా త్వరలోనే వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు, వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ జనం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.