ED attaches: జగద్రక్షకన్ కు పొలిటికల్ పంచ్, రూ. 89 కోట్ల ఆస్తులు అటాచ్, సింగపూర్ సిల్వర్ పార్క్!
చెన్నై/ న్యూఢిల్లీ: ఈడీ అధికారుల దెబ్బకు టాప్ పొలిటికల్ లీడర్ దిమ్మతిరిగిపోయింది. కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఎస్. జగద్రక్షకన్ కు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. సింగపూర్ సిల్వర్ పార్క్ కంపెనీల వాటాలు కొనుగోలు చేసి గోల్ మాల్ కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో డీఎంకే పార్టీ సిట్టింగ్ ఎంపీ జగద్రక్షకన్, ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ కు ఈడీ అధికారులు ఆనందం దూరం చేశారు. టాప్ పొలిటికల్ లీడర్ కు సీబీసీఐడీ, ఈడీ అధికారులు ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో కొందరు రాజకీయ నాయకులు హడలిపోయారు.

జగద్రక్షకన్ అంటే మామూలు మాటలా!
తమిళనాడులోని అరక్కోణం లోక్ సభ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్ అంటే ఆ రాష్ట్రంలో తెలియని నాయకుడు, ప్రజలు ఉండరు. గతంలో కేంద్ర మంత్రిగా ఓ వెలుగు వెలిగిన జగద్రక్షకన్ డీఎంకే పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. బంధు బలగంతో పాటు కార్యకర్తల అండ పుష్కలంగా ఉండటంతో అరక్కోణం లోక్ సభ నియోజక వర్గం నుంచి గత లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.

లెధర్ సంస్థ లొల్లి
తమిళనాడులోని క్రోంపేటలో డీఎంకే పార్టీ ఎంపీ జగద్రక్షకన్ కు చెందిన లెధర్ సంస్థ ఉంది. జగద్రక్షకన్ కుమారుడు సందీప్ ఆనంద్ ఆ లెధర్ సంస్థ కార్యకలాపాలు చూసుకుంటున్నారు .ఇటీవల లెధర్ సంస్థ అక్రమలావాదేవీల మీద సీబీసీఐడీ అధికారులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ కేసులో డీఎంకే పార్టీ ఎంపీ జగద్రక్షకన్, ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

సింగపూర్ సిల్వర్ పార్క్ కంపెనీ కహాని
2017లో సింగపూర్ కు చెందిన సిల్వర్ పార్క్ కంపెనీకి చెందిన 70, 00, 000, 20, 00, 000 వాటాలను డీఎంకే పార్టీ ఎంపీ జగద్రక్షకన్, ఆయన కుమారుడు సందీప్ ఆనంద్ కొనుగోలు చేశారు. సింగపూర్ సిల్వర్ పార్క్ సంస్థ వాటాల కొనుగోళ్లు నిబంధనలకు వ్యతిరేకంగా జరిగాయని, అందులో అక్రమాలు జరిగాయని సీబీసీఐడి అధికారులు ఇప్పటికే కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

రిజర్వు బ్యాంకు అనుమతి లేదు
రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా లావాదేవీలు జరిగాయని, విదేశీ మారక ద్రవ్యం చట్టానికి వ్యతిరేకంగా డీఎంకే పార్టీ ఎంపీ జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులు లావాదేవీలు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో సీబీసీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకాకుండా జగద్రక్షకన్ కుమారుడు సందీప్ ఆనంద్ తప్పించుకుని తిరుగుతున్నాడు.

దెబ్బకు జగద్రక్షకన్ ఢమాల్
సీబీసీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని శుక్రవారం కోర్టు ఆదేశాలు జారీ చేసినా సందీప్ ఆనంద్ పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో జగద్రక్షకన్ కు ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. జగద్రక్షకన్ కు చెందిన రూ. 89.19 కోట్ల ఆస్తులు జప్తు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన పోలాలు, ఇళ్లు తదితర ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చెయ్యడంతో డీఎంకే పార్టీ నాయకులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications